– దౌత్య మార్గంలో విఫలంతో ఆంక్షల కొరడా
– ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ
టెహ్రాన్, ఆగస్ట 11: తమ దేశంపై ఆంక్షలు విధించడం అమెరికాకు వ్యసనంగా మారిందని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ విమర్శించారు. ఆంక్షలతో ఇరాన్ను ’ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాం’ అని అమెరికా ఆర్థికశాఖ మంత్రి స్కాట్ బెసెంట్ చెప్పడంపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దౌత్య మార్గంలో లక్ష్యాలను సాధించలేనప్పుడల్లా అమెరికా ఆంక్షలు విధిస్తోందని ఆరోపించారు. అవి ఫలించకపోతే మరింత తీవ్రత పెంచుతోందని పేర్కొన్నారు. ఇది ఒక అలవాటుగా, చివరకు వ్యసనంగా మారిందని ఎక్స్ వేదికగా ఆయన మండిపడ్డారు. ఆంక్షలతో ఇరాన్ను లొంగదీసు కోవడం సాధ్యం కాదని బఘాయీ స్పష్టం చేశారు. దశాబ్దాలుగా ఇలాంటి ఆంక్షలను ఎదుర్కొంటూనే ఉన్నామన్నారు. అమెరికా నేతలు ఈ చెడు అలవాటును కొనసాగిస్తే.. సంక్షోభం నుంచి గౌరవప్రదంగా బయటపడే అవకాశాలను వారే దెబ్బతీసుకుంటారని హెచ్చరించారు. మరోవైపు ఇరాన్ ప్రభుత్వం డిజిటల్ ఆస్తులు, రహస్య బ్యాంకింగ్ నెట్వర్క్లపై ఆధారపడుతోందని స్కాట్ బెసెంట్ ఆరోపించారు. వారి అక్రమ ఆర్థిక నెట్వర్క్లను గుర్తించి ధ్వంసం చేస్తామని తెలిపారు. ఇరాన్ సైన్యంలో కీలక నియామకాలు జరిగాయి. సుప్రీం నేత మొజ్తబా ఖమేనీ ఈ మార్పులు చేశారు. మేజర్ జనరల్ అలీ అబ్దొల్లాహీని సాయుధ దళాల చీఫ్గా, కియుమర్స్ హైదారిని డిప్యూటీగా నియమించారు. అలాగే ఐఆర్జీసీ కమాండర్గా మేజర్ జనరల్ అహ్మద్ వాహిదీ, డిప్యూటీగా మోస్తఫా ఇజాదీ బాధ్యతలు చేపట్టారు. మొజ్తబా సుప్రీం నేతగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సైన్యంలో చేసిన తొలి కీలక నియామకాలు ఇవే కావడం గమనార్హం.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు


