ఈ ఏడాది నుంచి నైని బ్లాక్ నుంచి బొగ్గు ఉత్పత్తి

గతేడాది జూలై 24న జరిగిన చర్చలు సఫలం
విద్యుత్ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించేందుకు బొగ్గు బ్లాక్ వద్దే విద్యుత్ ప్లాంట్
అవసరమైన స్థలాన్ని కేటాయించండి
ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాంజితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

నైని బొగ్గు గనుల ద్వారా ఈ సంవత్సరం మార్చి నుంచి బొగ్గు ఉత్పత్తి చేస్తామని డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం ఒడిశా రాష్ట్రంలోని కోణార్క్ లో జరుగుతున్న మూడవ జాతీయ మైనింగ్ మంత్రుల సదస్సు సందర్భంగా ఒరిస్సా రాష్ట్ర సీఎం మోహన్ చరణ్ మాంజీ తో డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ సందర్భంగా ఓ లేఖను ఆయనకు అందజేశారు. ఒడిశాలోని అంగూల్ జిల్లాలో నైని బొగ్గు గనిని స్థాపించేందుకు ఒడిశా సీఎం కార్యాలయం నుంచి అద్భుతమైన మద్దతు అందించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లేఖలో పేర్కొన్నారు. గతేడాది జూలై 24న జరిగిన సమావేశంలో చర్చలు ఫలవంతం అయ్యాయని తెలిపారు.

నైని క్యాప్టివ్ బ్లాక్ అయినందున బొగ్గు గని నుంచి ఉత్పత్తి చేసిన బొగ్గును తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా జైపూర్ లోని 800 మెగావాట్ల సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ కు సరఫరా చేయాలి. జైపూర్ విద్యుత్ ప్లాంట్ నైనీ గని నుంచి దాదాపు 1000 కిలోమీటర్ల దూరంలో ఉంది, లాజిస్టిక్స్ లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సింగరేణి ఒడిశాలోని నైనా బొగ్గు గని సమీపంలో పిట్ హెడ్ ఓవర్ ప్లాంట్ గా 1600 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని భావిస్తోందన్నారు.

దీని ద్వారా ఉత్పత్తి వ్యయం తగ్గడంతో పాటు, ఉత్పత్తి అయిన బొగ్గు లాభదాయకంగా ఉపయోగించే అవకాశం ఉంటుందని భావిస్తున్నామని ఒరిస్సా సీఎంకు అందించిన లేఖలో తెలిపారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని నైని బొగ్గు గని సమీపంలో సింగరేణి ఆధ్వర్యంలో 1600 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టును స్థాపించడానికి తగిన భూమిని కేటాయించేందుకు, సంబంధిత అధికారులను ఆదేశించాలని కోరుతున్నట్టు డిప్యూటీ సీఎం తన లేఖలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *