– పదవీ కాలం మరో 4 నెలలు ఉన్నప్పటికీ..
– ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన వెంటనే నిర్ణయం
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 22: తెలంగాణ విద్యా రంగంలో సంచలనం చోటుచేసుకుంది. విద్యా కమిషన్ చైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తన పదవికి రాజీనామా చేశారు. విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను ఈ కీలక బాధ్యతల్లో నియమించింది. అయితే నాలుగు నెలల ముందుగానే తన పదవికి రాజీనామా చేసి లేఖను ప్రభుత్వానికి సమర్పించడం రాష్ట్ర రాజకీయ, విద్యా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ విద్యా రంగంపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన అనంతరం మురళి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యా సంస్కరణల నివేదిక పూర్తి కావడంతో తన బాధ్యత ముగిసిందని పేర్కొంటూ తన రాజీనామా లేఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమర్పించారు. ఇంకా నాలుగు నెలల పదవీ కాలం మిగిలి ఉండగానే ఆయన పదవి నుంచి తప్పుకోవడం గమనార్హం. ఈ సందర్భంగా తనకు అవకాశం కల్పించిన ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలుపుతూతన రాజీనామా విషయమై సీఎం కార్యదర్శికి కూడా ముందస్తు సమాచారం పంపారు. ఆకునూరి నేతృత్వంలోని విద్యా కమిషన్ ఇటీవల ప్రభుత్వానికి సమర్పించిన కొన్ని సిఫారసులు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది వేతనాలు ఎక్కువగా ఉన్నాయని, వాటిని హేతుబద్ధీకరించాలని కమిషన్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వచ్చాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





