- ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న నగర పోలీసులు
- సమన్వయ సమావేశంలో సిపి వెల్లడి
హైదరాబాద్,ప్రజాతంత్ర, ఏప్రిల్ 4 : నగరంలో నిర్వహించే శ్రీరామ నవమి (Ram Navami) శోభాయాత్ర సందర్భంగా పోలీసులు ప్రత్యేక చర్యలతో పాటు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. నగరంలో నిర్వహించే శోభాయాత్రకు దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉందని, శోభాయాత్రను శాంతియుతంగా, ప్రశాంతంగా నిర్వహించుకోవాలని నగర సీపీ సీవీ ఆనంద్ సూచించారు. శ్రీరామనవమి శోభా యాత్ర సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివిధ శాఖల అధికారులతో సీతారాంబాగ్లోని ద్రౌపది గార్డెన్లో నిర్వహించిన సమన్వయ సమావేశంలో సీపీ సీవీ ఆనంద్ పాల్గొని పలు సూచనలు చేశారు.
ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ.. శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా 20 వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశామని తెలిపారు. యాత్రలో షీటీమ్స్, సీసీఎస్, టాస్క్ఫోర్స్ సిబ్బందితో పూర్తిస్థాయిలో నిఘా ఏర్పాటు చేశామన్నారు. శోభాయాత్రను డ్రోన్లు, సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ రూము నుంచి పర్యవేక్షిస్తామని తెలిపారు. సీతారాంబాగ్ నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు కొనసాగుతున్న శ్రీరామ నవమి శోభా యాత్రలో విగ్రహాల ఎత్తు గురించి జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు, ప్రశాంతంగా జరిగేలా పోలీసులకు సహకరించాలని కోరారు.
యాత్రను మధ్యాహ్నం ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ముందస్తుగా ట్రయల్ రన్ చేపట్టాలని నిర్వాహకులకు సూచించారు. నిర్వాహకులు డ్రోన్లను వినియోగించేందుకు ముందస్తు అనుమతులు తీసుకోవాలన్నారు. పెద్ద శబ్దాలతో డీజే వినియోగించడం వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్న దృష్ట్యా, సౌండ్ సిస్టం వినియోగించుకోవాలని నిర్వాహకులకు సీపీ సూచించారు. శోభా యాత్ర ప్రశాంతంగా ముగిసేలా వివిధ శాఖల అధికారులతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ మాట్లాడుతూ.. శోభా యాత్రలో ఇబ్బందలు తలెత్తకుండా రోడ్ల మరమ్మతు, లైటింగ్, వసతులు ఏర్పాటు- చేస్తున్నామని తెలిపారు. మంగళ్హాట్ నుంచి పురానాపూల్, జుమ్మేరాత్ బజార్, సిద్ది అంబర్ బజార్, అప్జల్గంజ్, గౌలిగూడ, కోఠి, ఆంధ్రాబ్యాంక్ చౌరస్తా దుగా హనుమాన్ వ్యాయామశాల వరకు ఓపెన్ టాప్ జీప్లో ప్రయాణిస్తూ రూట్ను పరిశీలించారు. ఈసమన్వయ సమావేశంలో అడిషనల్ సీపీ విక్రం సింగ్ మాన్, జాయింట్ సీపీ ట్రాఫిక్ జోయల్ డేవిస్, డీసీపీలు, భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ సమితి సభ్యులు, ఆర్ అండ్ బీ, విద్యుత్, అగ్నిమాపక శాఖ, ఆర్టీసీ, జలమండలి, ఆర్టీఏ, వైద్యశాఖ అధికారులు పాల్గొన్నారు.