విత్తనాన్ని సంకరం, వ్యవసాయాన్ని రసాయనమయం చేయొద్దు..
ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ పురుషోత్తమ్ రెడ్డి
మహేశ్వరం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4: తొలి తెలంగాణ వార్షిక విత్తనోత్సవం స్థానిక విత్తనమే కేంద్రంగా, రైతే లక్ష్యంగా వ్యవసాయంలో వొచ్చే సమూల మార్పులతోనే నిజమైన హరిత విప్లవం సాధ్యమని ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ పురుషోత్తమ్ రెడ్డి పేర్కొన్నారు. ఇకపై ఆ హరిత విప్లవమే మనందరికీ రక్ష అని, విత్తనాన్ని సంకరం చేసి-వ్యవసాయాన్ని రసాయనమయం చేసిన ప్రక్రియ ‘హరిత విప్లవం’ కాదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ తొలి ‘విత్తనాల పండుగ’ను శుక్రవారం ప్రారంభించి ఆయన ప్రసంగించారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్-సీజీఆర్ (Council for Green Revolution), భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ మూడు రోజుల పండుగ కడ్తాల్ మండలం, అన్మాస్ పల్లిలో ఈ పండుగ మొదలయింది.
కర్ణాటక,రాజస్థాన్, తమిళనాడు,కేరళ తదితర రాష్ట్రాల విత్తనాల నిపుణులు, ఆర్గానిక్ సంస్థలతో 52 స్టాల్స్ తో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. విత్తనాలు బ్యాంక్ ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని సంస్థ నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఎస్.అన్వేష్ రెడ్డి సుంకెటి మాట్లాడుతూ సంప్రదాయ విత్తనాలు గ్రామ స్థాయిలో అవగాహనతో విస్తృత పరచాలన్నారు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే సహకారం అందిస్తామని తెలిపారు.
ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ డబ్ల్యూ రాంపుల్లా రెడ్డి, ఎమినెంట్ సీడ్ కన్జర్వేటర్ (పద్మశ్రీ ) రైమతి ఘురియా ఒడిశా,భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ జాకబ్ నెల్లితాన్, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్.డా.డి.రాజి రెడ్డి, పబ్లిక్ పాలసీ నిపుణులు డా.దొంతి నరసింహా రెడ్డి, సిజిఆర్ అధ్యక్షులు కె. లీలా లక్ష్మా రెడ్డి, సిజిఆర్ వ్యవస్థాపకులు కె. లక్ష్మా రెడ్డి , రైతులు,విద్యార్థులు, ప్రొఫెసర్లు, మేధావులు, సైంటిస్టులు,డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.