న్యూదిల్లీ, జూలై 17: దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లు-2025కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. రాబోయే వర్షాకాల సమావేశాల్లో ఈ వివాదాస్పద బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టకూడదని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయించింది. బిల్లుపై అధ్యయనం చేస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) తన నివేదిక సమర్పణకు మరికొంత సమయం కావాలని కోరడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్లమెంట్ అనెక్స్లో బీజేపీ ఎంపీ, జేపీసీ చైర్పర్సన్ అపరాజిత సారంగి అధ్యక్షతన శుక్రవారం జరిగిన కమిటీ సమావేశంలో బిల్లుపై విస్తృత చర్చ జరిగింది. సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలు, న్యాయపరమైన చిక్కులు, రాజ్యాంగపరమైన అంశాలను పరిశీలించేందుకు మరింత సమయం అవసరమని కమిటీ అభిప్రాయపడింది. ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులు, అరెస్టుల అంశానికి సంబంధించి కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చింది. బిల్లు ప్రకారం ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు వంటి ప్రజాప్రతినిధులు 30 రోజుల పాటు జైలులో ఉండి బెయిల్ పొందలేని పరిస్థితి ఏర్పడితే పదవులు కోల్పోయే విధంగా నిబంధనలు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు కారణమైంది. ప్రతిపక్షాలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించగా.. అధికార పక్షం మాత్రం పాలనలో పారదర్శకత, నైతికత పెంచేందుకు ఈ మార్పులు అవసరమని వాదిస్తోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు



