మరో రెండు గ్యారంటీలు అమలు

ఈ బడ్జెట్‌లోనే నిధుల కేటాయింపు…అసెంబ్లీ సమావేశాల్లోపు తుది నిర్ణయం
అర్హులందరికీ లబ్ధి చేకూరేలా పథకాలు
ప్రజా పాలన దరఖాస్తులపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి
దరఖాస్తు చేయని వారికి నిరంతర ప్రక్రియగా అవకాశం కల్పించాలని ఆదేశం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 1 : ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల్లో మరో రెండు గ్యారంటీలను అమలు చేయనున్నామని ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి అన్నారు. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ లబ్ధి జరిగేలా గ్యారంటీల అమలుకు సన్నాహాలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన దరఖాస్తులపై గురువారం సచివాలయంలో కేబినేట్‌ సబ్‌ కమిటీ మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి పాల్గొన్నారు. రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకాలపై సంబంధిత విభాగాల అధికారులతో చర్చించారు. ఈ మూడు గ్యారంటీల అమలుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

వీటిలో రెండిరటిని తక్షణమే అమలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం చెప్పారు. ఒక్కో గ్యారంటీ అమలుకు ఎంత ఖర్చవుతుంది..ఎంత మందికి లబ్ధి కలుగుతుందనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ బడ్జెట్‌ లోనే వాటికి అవసరమైన నిధులు కేటాయించాలని సీఎం ఆర్థిక శాఖకు సూచించారు. అసెంబ్లీ సమావేశాల్లోపు మరోసారి కేబినేట్‌ సబ్‌ కమిటీతో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది డిసెంబర్‌ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టారు. ఇందులో ప్రభుత్వం ప్రకటించిన అయిదు గ్యారంటీలకు అర్హులైన వారందరి నుంచి గ్రామసభలు, వార్డు సభల ద్వారా  దరఖాస్తులను స్వీకరించారు. అయిదు గ్యారంటీలకు మొత్తం 1,09,01,255 దరఖాస్తులు నమోదయ్యాయి.

జనవరి 12వ తేదీ నాటికే వీటికి సంబంధించిన డేటా ఎంట్రీ రికార్డు సమయంలో పూర్తి చేసినట్లు అధికారులు సీఎంకు నివేదించారు. వొచ్చిన దరఖాస్తుల్లో కొందరు ఒకే పేరుతో రెండు మూడు దరఖాస్తులు ఇచ్చారని, కొన్నింటికి ఆధార్‌, రేషన్‌ కార్డు నెంబర్లు లేవని అధికారులు వివరించారు. అలాంటి దరఖాస్తులను మరోసారి పరిశీలించాలని, అవసరమైతే క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన జరపాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. అర్హులైన వారెవరూ నష్టపోకుండా ఒకటికి రెండు సార్లు సరి చూడాలని కోరారు. దరఖాస్తుల్లో తప్పులుంటే వాటిని సరిదిద్దుకునేందుకు ఎంపీడీవో ఆఫీసుల్లో లేదా తదుపరి నిర్వహించే ప్రజా పాలన కార్యక్రమంలో మరోసారి అవకాశమిచ్చే ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు.

గ్యారంటీల అమలుకు లేని పోని నిబంధనలు పెట్టి ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దని చెప్పారు. దరఖాస్తు చేసిన వారిలో  అర్హులైన వారందరూ లబ్ధి పొందేలా చూడాలని అన్నారు. దరఖాస్తు చేయని వారుంటే..నిరంతర ప్రక్రియగా మళ్లీ దరఖాస్తు చేసే అవకాశం కల్పించాలని సీఎం ఆదేశించారు. ఇంకా ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డిజీపీ రవిగుప్తా, ఫైనాన్స్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రామకృష్ణ రావు, సివిల్‌ సప్లయిస్‌ కమిషనర్‌ డీఎస్‌ చౌహన్‌, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ దానకిషోర్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌, హోం శాఖ సెక్రటరీ జితేందర్‌, సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీ శేషాద్రి, సీఎం స్పెషల్‌ సెక్రటరీ అజిత్‌ రెడ్డి,  ఇంటలిజెన్స్‌ చీఫ్‌ శివధర్‌ రెడ్డి, ఇతర ఉన్నాతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *