నేడు భౌతిక, జీవ, వృక్ష, పురాతత్వ శాస్త్ర వేత్త జగదీష్ చంద్రబోస్ వర్ధంతి
మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది
మొక్కలకు కూడా జంతువుల మాదిరి ప్రాణం ఉంటుందని వేడికీ,చలికి, కాంతికి, శబ్దానికి, గాయానికి ఈ మొక్కలు స్పందిస్తాయని ఈలోకానికి శాస్త్రపరంగా తొలిసారిగా వెల్లడి చేసినవాడు సర్ జగదీశ్ చంద్ర బోస్ .
బాల్యం
జీవిత కాలాన్నంతా శాస్త్ర పరిశోధనకు త్యాగం చేసిన జగదీష్ చంద్రబోస్ 23 నవంబర్ 1937 కలకత్తాలో తుదిశ్వాస వదిలాడు. ఆ మహానీయుని స్మరించుకొని ఆయన స్ఫూర్తిని రాబోయే తరాలకు తెలియజేయడం మనవిధి.నాటి బెంగాల్, నేటి బంగ్లా దేశ్ లోని మైమెన్సింఘ్ గ్రామం 1858 నవంబర్ 30 న జన్మించిన జగదీష్ చంద్ర బోస్ బహుముఖ ప్రజ్ణాశాలి. ఆయన భౌతిక శాస్త్రవేత్త, జీవశాస్త్రవేత్త, జీవభౌతిక శాస్త్రవేత్త, వృక్షశాస్త్రవేత్త, పురాతత్త్వ శాస్త్రవేత్త.
వైర్ లెస్ టెలిగ్రాఫ్ సృష్టికర్త
మార్కొని అనే శాస్త్రవేత్త కనిపెట్టినట్లుగా చెప్పబడుతున్న ఎలక్ట్రో మ్యాగ్నటిక్ రేడియో వేవ్స్ ఆధారంగా పనిచేసే వైర్ లెస్ టెలిగ్రాఫ్ ను జగదీష్ చంద్రబోస్ 1894 వ సంవత్సరంలోనే కనిపెట్టి ప్రయోగాత్మకంగా నిరూపించారు.
పలు పరికరాలు సృష్టికర్త
ప్రస్తుతం న్యూక్లియర్,ఎలక్ట్రానిక్ రంగాలలో ఉపయోగపడుతున్న ‘‘వేవ్ గైడ్’’ పరికరాన్ని కనిపెట్టింది కూడా బోసే.రేడియో వేవ్స్ ను తెలుసుకునే ‘‘కొమోరర్’’ పరికరాన్ని కనిపెట్టారు.రేడియో మరియు మైక్రోవేవ్ ఆప్టిక్స్ తో వృక్షశాస్త్రంలో గణనీయమైన ఫలితాల్ని సాధించారు. నాటి భారతీయుల పట్ల గల వివక్ష, పరిశోధనలకు సౌకర్యాల కొరత ఉన్నప్పటికీ రేడియో తరంగాలనూ, సూక్ష్మ తరంగాలపై పరిశోధనలు చేశాడు.ఇతన్ని రేడియో విజ్ఞానంలో పితామహునిగా పేర్కొంటారు.
అవార్డులు-రివార్డులు
1920 వ సంవత్సరంలో బోస్ ను ‘‘ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ’’ గా ఎన్నుకున్నారు.1917 వ సంవత్సరంలో కొల్ కతాలో బోస్ పరిశోధనాకేంద్రం(బోస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్) ను స్థాపించారు.
మే10, 1901న రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ లో మొక్కలు బ్రోమైడ్ విషప్రభావం వల్ల ఏవిధంగా చనిపోతాయో ఈయన ప్రయోగ పూర్వకంగానిరూపించాడు.
స్వాభిమానాన్ని,ఆత్మగౌరవాన్ని దేశభక్తిని ప్రకటించుకున్న మహాపురుషుడు
బోస్ ప్రెసిడెన్సీ కళాశాలలో పనిచేస్తున్నపుడు నిర్వహకులైన ఆంగ్లేయులు ఆంగ్ల అధ్యాపకులకిచ్చే జీతంలో 66.6 శాతం మాత్రమే జీతంగా భారతీయుడైన బోసుకిస్తామని చెప్తే,బోస్ దానికు అంగీకరించకుండా అసలు జీతమే తీసుకోకుండా మూడు సంవత్సరాలపాటు పనిచేసి తన స్వాభిమానాన్ని,ఆత్మగౌరవాన్ని దేశభక్తిని ప్రకటించుకున్న మహాపురుషుడు.అపుడు యాజమాన్యం దిగివచ్చి మొత్తం జీతాన్ని బకాయిలతో సహా చెల్లించింది.రేడియో తరంగాలను మార్కొని కంటే ముందుగా బోస్ కనుగొన్న రాయల్ సొసైటీ ఇటీవల నిర్ధారించింది.బోస్ పరిశోధనలకు సోదరి నివేదిత విశేష సహకారమందించింది.
రచించిన పుస్తకాలు
ఈయన వెలువరించిన ‘ది లివింగ్ అండ్ నాన్ లివింగ్’(1902), ‘దినెర్వస్ మెకానిజం ఆఫ్ ప్లాంట్స్’ (1926) పుస్తకాలు ప్రపంచ ప్రసిద్ది పొందాయి.నిస్తంత్రి విధానంలో సిగ్నలింగ్ ప్రక్రియ, ఈ సిగ్నలింగ్ని గుర్తించడానికి సెమీకండేక్టర్లను ఉపయోగించడంపై విస్తృతప్రయోగాలు చేశాడు.
క్రెస్కోగ్రాఫ్
మొక్కల పెరుగుదలను గణించడానికి క్రెస్కోగ్రాఫ్ అనే పరికరాన్ని రూపొందించాడు. చంద్రునిపైనున్న ఒక బిలానికి ‘‘బోస్’’ గా నామకరణం చేసి రోదసీ శాస్త్రవేత్తలు అతనిపై తమకున్న గౌరవాన్ని ప్రకటించుకున్నారు.బెంగాలీలో సైన్స్ ఫిక్షన్ రచనకు పితామహుడు.
దేశ సంపద
ఆయన తన పరిశోధనలను వ్యాపారానికి వాడుకోలేదు. తను పరిశోధన చేసే స్థాయికి చేర్చింది దేశమిచ్చిన విద్యయే కాబట్టి తన పరిశోధనా ఫలితాలు కూడా దేశ సంపదయేనని ప్రకటించాడు.నవంబర్ 23,1937 నాటి నుంచి భౌతికంగా కనుమరుగైపోయినా ఈయన కొనసాగించిన పరిశోధనలు మాత్రం అనంతంగా ఎదుగుతూ ఎంతో మందికిస్పూర్తిని కలిగిస్తూనే వుంటాయి.
– పిన్నింటి బాలాజీ రావు, హనుమకొండ.
9866776286




