పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్ రాజీనామా

  • ఇంకా ఆమోదించని గవర్నర్‌ తమిళిసై
  • కోర్టులో కేసు ఉండడమే కారణమని భావన

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12 : టిఎస్‌పిఎస్‌సి ఛైర్మన్‌ జనార్థన్‌ రెడ్డి రాజీనామాను గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్‌ ఆమోదించలేదు. సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో జనార్థన్‌ రెడ్డి సమావేశమైన తరువాత అతడు రాజీనామా చేసిన విషయం విదితమే. అయితే ఆయన రాజీనామాను ఆమోదించినట్లు వొస్తున్న వార్తలు అవాస్తవమని రాజ్‌భవన్‌ వర్గాలు వెల్లడిరచాయి. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రస్తుతం పుదుచ్చేరిలో ఉన్నారని, జనార్థన్‌ రెడ్డి రాజీనామా లేఖ గవర్నర్‌ పరిశీలనలో ఉందని వెల్లడిరచాయి. గవర్నర్‌కు అన్ని వివరాలు పంపించామని పేర్కొన్నాయి. పేపర్‌ లీకులు అయినప్పుడే నిరుద్యోగుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయాలని కోరుతూ రాష్ట్రపతికి గవర్నర్‌ తమిళసై లేఖ రాశారు.

అప్పుడు దానిని డీఓపీటీకి రాష్ట్రపతి అధికారులు పంపించారు. టీఎస్‌ పీఎస్సీ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని ..ఏం జరిగిందో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి అక్కడి నుంచి లేఖ అందింది. మునుపటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం స్పందించకుండా సైలెంట్‌గా ఉండిపోయింది. ఇపుడు ప్రభుత్వం మారగానే టీఎస్‌ఎస్‌పీఎస్సీ చైర్మన్‌ రాజీనామా లేఖ ఇచ్చారు. ఇప్పటికే కోర్టులో పేపర్‌ లీకు కేసు ఉంది. గతంలో చర్యలు తీసుకునేలా బోర్డును పుర్తిగా రద్దు చేసేలా ముందుకి వెళ్లడమా..? లేదంటే జనార్దన్‌ రెడ్డి రాజీనామాను ఆమోదించడమా? అనే దానిపై గవర్నర్‌ సందిగ్ధంలో ఉన్నారనే భావన వ్యక్తం అవుతున్నది. రాజీనామా ఆమోదిస్తే పేపర్‌ లీకు సంగతి అంతేనా అనే ఆలోచనలో గవర్నర్‌ తమిళి సై ఉన్నారు. లీగల్‌ ఒపీనియన్‌ తీసుకోవడంతో పాటు.. ప్రస్తుత రాష్ట్ర సర్కార్‌ స్టాండ్‌ తెలుసుకునేందుకు సీఎస్‌కు లేఖ రాసే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *