బోర్డు కార్యాలయం ముట్టడికి బిఎస్పీ యత్నం
హైదరాబాద్,ప్రజాతంత్ర,జూన్6: టీఎస్ పీఎస్ సీ బోర్డు దగ్గర ఉద్రిక్తత నెలకొంది. గ్రూప్ 1పరీక్ష రద్దు చేయాలని బీఎస్పీ నాయకులు బోర్డు ముట్టడికి యత్నించారు. బోర్డు ముందు బైఠాయించి నిరసన తెలిపారు. కొత్త బోర్డు ఏర్పాటు చేశాకే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. గతంలో పరీక్ష రాసి నష్టపోయిన ప్రతి అభ్యర్థికి లక్ష రూపాయల పరిహారం ఇవ్వాలన్నారు. పోలీసులు కేసీఆర్ కు తొత్తుల్లా మారారని విమర్శించారు. గత మూడు నెలలుగా పోరాటం చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు.
టీఎస్ పీఎస్ సీ బోర్డు దగ్గరకు భారీగా చేరుకున్న పోలీసులు బీఎస్పీ నాయకులను అడ్డుకున్నారు. పోలీసులకు వాళ్లకు మధ్య కాసేపు తోపులాట జరిగింది. 30 మంది నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు నాంపల్లి, గోషామహల్ పోలీస్ స్టేషన్ లకు తరలించారు. జూన్ 11న గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించేందుకు టీఎస్ పీఎస్ సీ అన్ని ఏర్పాట్లు చేసింది. అభ్యర్థులు పావుగంట ముందే ఎగ్జామ్ సెంటర్ కు చేరుకోవాలని సూచించింది. ఉదయం 10.15 గంటల తర్వాత గేట్లు మూసేస్తామని హెచ్చరించింది. హాల్ టికెట్ తో పాటు గుర్తింపు కార్డు తీసుకురావాలని సూచించింది.




