పట్టణ ప్రాంతాల్లో వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర

హైదరాబాద్‌, పీసీబీ, డిసెంబర్‌ 27 : వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర రాష్టం వ్యాప్తంగా వివిధ జిల్లాల్లోని పట్టణ ప్రాంతాల్లో బుధవారం ప్రారంభమైంది. గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందర రాజన్‌ హైదరాబాద్‌లోని లాలాపేట్‌ మున్సిపల్‌ గ్రౌండ్స్‌లో కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమగ్ర సమాచారం అందించే వీడియో వ్యాన్‌ను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ దేశ వ్యాప్తంగా  ఉన్న లబ్ధిదారులతో వర్చువల్‌ గా మాట్లాడారు. లబ్ధిదారులు అందుకుంటున్న అభివృద్ధి ఫలాల పట్ల ఆనందం వ్యక్తం చేశారు. వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర ద్వారా ఇప్పటి వరకు చేరుకోని లబ్ధిదారులను చేరుకుంటున్నందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు చివరి లబ్ధి దారుడికి చేరే వరకు తమ ప్రయత్నాలు ఉంటాయని అన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ..సోదరి మణులు కష్ట పడకుండా ఉండాలని పిఎం ఉజ్వల యోజన ద్వారా వంట గ్యాస్‌, ఆయుష్మాన్‌ భారత్‌ ద్వారా నిరుపేదలకు ఉచితంగా వైద్య సదుపాయం ప్రధాన మంత్రి కల్పించారన్నారు.

ఎలాంటి గ్యారంటీ లేకుండా బ్యాంక్‌ లోన్స్‌ ఇవ్వడం జరిగిందని, సమాజం లోని అన్ని వర్గాలను మదిలో ఉంచుకుని ప్రధానమంత్రి పని చేస్తున్నారని అన్నారు. 2025 సంవత్సరంలోగా టీబీ ముక్త్‌ భారత్‌ కోసం ప్రధాని సంకల్పించారని అన్నారు. వృత్తి రీత్యా వైద్యురాలు అయిన తాను ఈ విషయం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాల ఫలాలను ప్రజలకు చేరవేసేందుకు, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఈ యాత్ర సమాజంలోని చిట్టచివరి వ్యక్తికి చేరుతుందన్నారు. ముఖ్యంగా పీఎం ఆవాస్‌ యోజన, అటల్‌ పెన్షన్‌ యోజన, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ, వడ్డీ లేని రుణాలు, వ్యవసాయ సంబంధిత పథకాలపై ఈ ఆడియో విజువల్‌ వ్యాన్లు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయని, రాష్ట్రంలో ఈ యాత్ర 2024 జనవరి 25 వరకు కొనసాగనుందని గవర్నర్‌ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు  100 శాతం అందచేయడమే సంకల్ప్‌ యాత్ర ముఖ్య ఉద్దేశమన్నారు. స్వచ్ఛ భారత్‌ అభియాన్‌, పీఎం ఉజ్వల యోజన, పీఎం గరీబ్‌ కల్యాణ్‌ యోజన వంటి సంక్షేమ పథకాల ప్రయోజనాలను ప్రజలకు చేరువ చేయడం, అవగాహన కల్పించడంపై ఈ యాత్ర దృష్టి సారిస్తుందని పేర్కొన్నారు. అంతకు ముందు కేంద్ర ప్రభుత్వ సమాచారంతో కూడిన ఐఈసీ మెటిరియల్‌ను గవర్నర్‌ ఆవిష్కరించారు. లాలాపేట్‌ మున్సిపల్‌ గ్రౌండ్స్‌ లో ఏర్పాటు చేసిన వివిధ కేంద్ర ప్రభుత్వ స్టాళ్లను గవర్నర్‌ సందర్శించారు. కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పథకాల లబ్ధిదారులను చేరనుంది. భగవాన్‌ బిర్సా ముండా జయంతి సందర్భంగా నవంబర్‌ 15న జార్ఖండ్‌ నుంచి మల్టీమీడియా వీడియో వ్యాన్లను జెండా ఊపి ప్రధాని నరేంద్ర మోదీ ఈ వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రను ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *