24, 25న హైదరాబాద్లో ప్రధాని మోదీ రోడ్ షోలు
సీనియర్ నాయకులు బహిరంగ సభలు, రోడ్ షోలు, మీడియా సమావేశాలు
ప్రజలందరి చూపు…బిజెపి వైపు
బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 19 : మరో 10 రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బిజెపి సీనియర్ నాయకులు అన్ని నియోజకవర్గాల్లో బహిరంగ సభలు, రోడ్ షోలు, మీడియా సమావేశాలు నిర్వహించనున్నారని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ పేర్కొన్నారు. ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…నేడు రాష్ట్రానికి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా రానున్నారన్నారు. సోమవారం మధ్యాహ్నం 12.35 గంటలకు అమిత్ షా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి 1 గంటలకు జనగామ పబ్లిక్ మీటింగ్కు హాజరవుతారు…అక్కడ సభ అనంతరం 2.45 గంటలకు కోరుట్లకు చేరుకుని మధ్యాహ్నం 3 గంటల నుంచి 3.40 వరకు సభలో పాల్గొంటారని తెలిపారు. కోరుట్ల నుంచి బయలుదేరి 4.45 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారని..అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఉప్పల్కు చేరుకుంటారని, సాయంత్రం 5.30 గంటల నుంచి 7 గంటల వరకు రోడ్ షోలో పాల్గొంటారని సుభాష్ అమిత్ షా పర్యటన వివరాలు వెల్లడించారు. తెలంగాణలో బిజెపి జాతీయ నాయకుల షెడ్యూల్ వివరాలను వెల్లడించారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ నవంబరు 25, 26వ తేదీన హుజురాబాద్, మహేశ్వరంలో జరిగే బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నవంబరు 24, 25, 26న తెలంగాణకు రానున్నారు. అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ తో పాటు, గోవా సీఎం ప్రమోద్ సావంత్ తెలంగాణ పర్యటనలో భాగంగా రోడ్ షో, బహిరంగ సభల్లో పాల్గొంటారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ 21వ తేదీన రెండు సభల్లో పాల్గొంటారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. నితిన్ గడ్కరీ నవంబరు 20వ తేదీన ఎల్లారెడ్డి అసెంబ్లీలో ఉ. 11 30 గం.లకు, కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మ. 2 గం.లకు బహిరంగ సభలో పాల్గొనడంతో పాటు సాయంత్రం రోడ్ షోలో పాల్గొంటారు.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నవంబరు 20వ తేదీన ముషీరాబాద్లో ఉ. 10:30 గం.లకు రోడ్ షోలో పాల్గొననున్నారు. నవంబరు 24, 25న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్లో రోడ్ షోతో పాటు బహిరంగ సభలో పాల్గొననున్నారు. కేంద్రం నుంచి అనేక నిధులు తెలంగాణ రాష్ట్రానికి రావాలంటే భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని ప్రజలు చూస్తున్నారని సుభాష్ అన్నారు. ఎస్సీ వర్గీకరణ, బీసీ ముఖ్యమంత్రి ప్రకటన తర్వాత ప్రజలందరూ బిజెపి వైపు చూస్తున్నారన్నారు. బిజెపి అగ్రనేతల సమావేశాలకు ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రావాలని ఆశిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా….. కర్ణాటకలో కాంగ్రెస్ అమలుకోని నోచుకోని హామీలతో విఫలమవ్వడంతో…తెలంగాణలో ప్రజలంతా భారతీయ జనతా పార్టీకే మద్దతు తెలిపాలని భావిస్తున్నారని చెప్పారు. బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి అమర్ నాథ్ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో తెలంగాణలో బిజెపిని గెలిపించుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని.. మేనిఫెస్టో అనేది ప్రజలకు సుపరిపాలన ఎలా అందిస్తామనే దానికి ప్రమాణపత్రం అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మాత్రం అర్రాస్ పాట పాడినట్లుగా మేనిఫెస్టో ప్రకటించారన్నారు. బీసీ, ఎస్సీ-ఎస్టీ, యువత, మహిళలు, వృద్ధులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలకు అవసరమయ్యే విధంగా తమ మేనిఫెస్టో రూపకల్పన జరిగిందన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు ఖచ్చితంగా వొస్తుందని, మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్ లా భావిస్తున్నామన్నామని, మేనిఫెస్టోను ప్రమాణపత్రంగా తీసుకుంటూ..రాష్ట్రంలో బిజెపి గెలిచాక మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి అంశాన్ని అమలుచేసి తీరుతామని అమర్ నాథ్ హామీ ఇచ్చారు.




