ఆరు గ్యారంటీలతో పాటు ఇతర హామీలనూ నెరవేరుస్తాం
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడి
ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : త్వరలోనే అర్హులందరికి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడిరచారు. ధరణిలో సవరణలు చేసి ఎలాంటి సమస్యలు లేకుండా అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. ఖమ్మంలోని పాలేరు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో బుధవారం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్తో కలిసి లబ్దిదారులకు కల్యాణ లక్ష్మి/షాదీముబారక్ చెక్కులను మంత్రి పొంగులేటి పంపిణీ చేశారు. ఆ తర్వాత మహమ్మదాపురంలో రూ.5 కోట్లతో నిర్మించనున్న గిరిజన మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల, వెంకటగిరిలో రూ.2.65 కోట్లతో నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ మినీ స్టేడియం పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…పదవులు, అధికారం శాశ్వతం కాదని, చేసిన పనులే చరిత్రలో నిలిచిపోతాయని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హావిూ మేరకు ఆరు గ్యారంటీలను క్రమంగా అమలు చేస్తున్నామని చెప్పారు. ఏది ఏమైనా ఇచ్చిన హావిూలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీలతో పాటు ఇతర హావిూలను కూడా నెరవేరుస్తామన్నారు. ప్రభుత్వం ఎంత కష్టమైనా హావిూలను నెరవేరుస్తుందని, ప్రజా పాలన కార్యక్రమంలో ఇచ్చిన దరఖాస్తుల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. అర్హులైన వారందరికీ రూ.500కే ఎల్పీజీ సిలిండర్ ఇస్తామని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ధరణి పేరుతో గత ప్రభుత్వం వేలాది ఎకరాలను ఆక్రమించిందని ఆరోపించారు. అర్హులైన కుటుంబాలకు త్వరలోనే తెల్ల రేషన్ కార్డులు జారీ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందన్నారు. మహిళలకు త్వరలోనే రూ.2,500 సాయం అందిస్తామని ఆయన అన్నారు. కాగా ఇతర పథకాల కంటే రేషన్ కార్డు జారీ కోసమే ఎక్కువ అప్లికేషన్స్ రావడం గమనార్హం. ఈ క్రమంలో మంత్రి పొంగులేటి కీలక అప్డేట్ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.



