తెలంగాణా రాష్ట్రానికి న్యాయంగా రావల్సిన రైల్వే పోజెక్టులను మంజూరు చేయడం లోను, ఇప్పటికే మంజూరైన పోజెక్టులకు పనులు వేగవంతం అయ్యేందుకు తగిన నిధులు ప్రణాళికా బద్ధంగా విడుదల చేయడం లోనూ కేంద్ర ప్రభుత్వం బహుశా రాజకీయ అవసరాల కారణం గా తీవ్ర అలక్ష్యం ప్రదర్సిస్తోంది. కాజీపేట్ ఇంటెగ్రల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బీ నగర్- నడికుడు ల మధ్య రెండో రైల్వే లైను, భద్రాచలం- ఖమ్మం-రాజమండ్రిల మధ్య కొత్త రైల్వే మార్గం, రాష్ట్రంలో 15 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ ప్రోజెక్టుల ఉసే అసలు లేదు. ఇవి కాక దాదాపుగా 15 కొత్త రైళ్ళ మంజూరు, 12 వీక్లీ రైళ్ళను డైలీ సర్వీసులుగా మార్పు వంటివి సంవత్సరాలుగా పెండింగులో వున్నాయి. అయితే పొరుగు రాష్ట్రాలైన కర్నాటక,ఒడిశ్శా, గుజరాత్, బీహార్ రాష్ట్రాలలో కొత్త రైల్వే ప్రోజెక్టులను తక్షణమే మంజూరు చేసిన కెంద్ర ప్రభుత్వం తెలంగాణా విషయం లో ఎందుకింత వివక్షత ప్రదర్శిస్తోందో అర్ధం కావడం లేదు. రైల్వే శాఖ 2020 లో తలపెట్టిన స్మార్ట్ స్టేషన్ అభివృద్ధి పధకంలో తెలంగాణాలో కేవలం సికింద్రాబాద్,నల్గండ లను చేర్చింది. మన కంటే తక్కువ వైశాల్యం వున్న ఒడిస్సా రాష్ట్రానికి ఏకంగా మూడు, కర్నాటక రాష్ట్రానికి అయిదు స్మార్ట్ స్తేషన్లను కేటాయించగా, దేశం లో మిగితా స్టేషన్లతో సరిపోలిస్తే సికింద్రాబాద్,నల్గొండ స్టేషన్ లలో అభివృద్ధి పనులు నిధుల లేమి కారణంగా నత్తనడకన సాగుతున్నాయి.
దేశంలోనే అతి చౌక రవాణా సాధనం అయిన మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టం ( ఎం ఎం టీ ఎస్) రెండవ దశ విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. హైదరాబాద్ నగరం లో 45 కిలోమోటర్ల పొడవున లింగంపల్లి- నాంపల్లి, సికిందరాబాద్ – ఫలక్నామా ల మధ్య తిరిగే ఎం ఎం టీ ఎస్ రైళ్ళలో నిత్యం 1.6 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. టికట్ ధర తక్కువగా వుండడం వలన ఈ రైళ్ళయ్ అత్యంత ప్రజాదరణ పొందాయి. ఈ నేపధ్యం లో ఈ రైళ్ళను నగరం శివార్లలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం 2014 లోనే నిర్ణయించి అందుకనుగుణ్నంగా ఏడు మార్గాలలో 84 కిలోమీటర్ల మేర విస్తరణ పనులు చేపట్టేందుకు రైల్వే శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకయ్యే మొత్తం 816 కోట్ల వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం 544 కోట్లు, రైల్వే శాఖ 272 కోట్లు భరించేలా ఒప్పందం అయిదేళ్ళ క్రితమే కుదిరింది. 2019 జనవరి కల్లా పనులు పూర్తి చేసి ట్రయల్ రన్ ప్రారంభించలన్నది డి పి ఏర్ లో షెడ్యూల్. అయితే 2015 సెప్టెంబరులోనే ఈ విస్తరణ పనులు లాంచనంగా ప్రారంభమైనా పనులు నత్త నడకన నడుస్తున్నాయి.
మారిన రాజకీయ సమీకరణల నేపధ్యంలో నిధులు మంజూరు చేయడం లో రైల్వే శాఖ తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికి 65 శాతం పనులు మాత్రమే పూర్తికాగా మిగితా పనులు పూర్తయ్యేందుకు మరిక సంవత్సరం పట్టవచ్చునని, ఈ ఆలశ్యం కారణంగా ప్రోజెక్టు వ్యయం మైంత పెరగవచ్చునని, ఈ పెరిగిన వ్యయాన్ని రైల్వే శాఖ భరించకపోతే, అదనపు భారం అంతిమంగా ప్రయాణీకులపైనే పడుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకొక విచిత్రం ఏమిటంటే కొన్ని మార్గాలలో పనులు పూర్తయ్యినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదన్న సాకుతో రైల్వే అధికారులు పూర్తి స్థాయిలో రైళ్ళను నడపకపోవడం. ఉదాహరణకు తెల్లాపూర్ – రామచంద్రపురం మార్గంలో పనులు పూర్తయినా రైల్వే రోజుకు ఒక్క రైలును మాత్రంఏ నడుపుతోంది.రాజకీయాలను పక్కన పెట్టి రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు చక్కని అవగాహనతో, పటిష్టమైన ప్రణాళికతో పనులు పూర్తి చేసి ప్రజాదరణ పొందదానికి కృషి చేయాలి.
– సి హెచ్ ప్రతాప్, 91368 27102




