- తెలంగాణ ఆశలే శ్వాసగా ఆయన జీవనం
- వర్ధంతి సందర్భంగా సిఎం రేవంత్, మంత్రి పొంగులేటి, తదితరుల నివాళి
- ప్రత్యేక రాష్ట్రంలోనూ సార్ కలలు సాకారం కాలేదు : ప్రొ. కోదండరామ్ నివాళి
హైదరాబాద్,ప్జాతంత్ర, జూన్ 21 : తెలంగాణ కోసం జరిగిన మహోద్యమంలో ఆచార్య జయశంకర్ ఆద్యంతం అందరికీ స్ఫూర్తిగా నిలిచారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఆశలే శ్వాసగా ఆయన జీవితం గడిపారని అన్నారు. జయశంకర్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఆయనను స్మరించుకున్నారు. ఆయన చిత్రపటం వద్ద సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు నివాళి అర్పించారు. తెలంగాణ ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొన్నారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ భవన్లో మాజీమంత్రులు జగదీశ్ రెడ్డి తదితరులు జయశంకర్ విగ్రహం వద్ద నివాళి అర్పించారు. సమైక్య ఆంధప్రదేశ్ ఏర్పడిన సమయంలోనే తెలంగాణ ప్రాంతానికి జరగనున్న అన్యాయంపై ఆచార్య జయశంకర్ మాట్లాడారని చెప్పారు.
జీవితాంతం తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం, వివక్షపై తెలంగాణ ప్రజలను జాగృతం చేశారన్నారు. జయశంకర్ సార్ ఉద్యమ స్ఫూర్తితోనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నామని తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధన కోసం ఆయన స్ఫూర్తితోనే కెసిఆర్ కృషి చేసారన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వర్థంతి సందర్భంగా వరంగల్లో ఆచార్య జయశంకర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ భవన్ లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాధన కోసం జయశంకర్ సార్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. సార్ చూపిన బాటలో పయనిస్తామన్నారు.
ప్రత్యేక రాష్ట్రంలోనూ సార్ కలలు సాకారం కాలేదు : ప్రొ. కోదండరామ్ నివాళి
ప్రత్యేక రాష్ట్రం అందరి జీవితాల్లో వెలుగు నింపుతుందని ఆశించామని… అయితే కలలు మాత్రం నెరవేరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత పదేళ్లలో తెలంగాణ ఆకాంక్షలను తుంగగలో తొక్కారని అన్నారు.జయశంకర్ సార్ కలలు కన్న తెలంగాణ సాకారం కాలేదన్నారు. వర్ధంతి సందర్భంగా శుక్రవారం ప్రొఫెసర్ జయశంకర్కు కోదండరామ్ నివాళి అర్పించారు. కాంట్రాక్టుల్లో అవినీతి తారాస్థాయికి చేరిపోయిందని వెల్లడిరచారు.
ప్రజలు చైతన్యవంతమైతేనే సమాజం బాగుపడుతుందన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన యువత సహా రాష్ట్ర ప్రజలంతా అసంతృప్తితో ఉన్నారని అన్నారు. వ్యవసాయంతో నష్టపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా నిలిచేలా ముందుకు వొస్తుందని అన్నారు.




