‘కాళేశ్వరం’ పరిశీలనకు ఐదుగురు సభ్యులతో కేంద్ర కమిటీ

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు, లోపాలపై అధ్యయనం
నాలుగు నెలల్లో నిపుణుల కమిటీ నివేదిక  

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 3 : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాన్ని పరిశీలించేందుకు నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ ఆదివారం నిపుణుల కమిటీని నియమించింది. కేంద్ర జల సంఘం మాజీ ఛైర్మన్‌ జె.చంద్రశేఖర్‌ అయ్యర్‌ సారథ్యంలో ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో యుసి విద్యార్థి, ఆర్‌ పాటిల్‌, శివకుమార్‌ శర్మ, రాహుల్‌ కుమార్‌ సింగ్‌ సభ్యులుగా నియమించింది. ఎన్డీఎస్‌ఏ డైరెక్టర్‌ (టెక్నికల్‌) అమితాబ్‌ మీనా ఈ కమిటీకి మెంబర్‌ సెక్రెటరీగా వ్యవహరిస్తారు. ఈ కమిటీ నాలుగు నెలల్లో తన నివేదిక ఇవ్వనుంది. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు.

మూడు బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాల తీరును, డ్యామేజీకి గల కారణాలను పూర్తి స్థాయిలో ఈ కమిటీ పరిశీలించనుంది. మేడిగడ్డ బ్యారేజీలోని ఫిల్లర్లు కుంగిపోవడంతో అప్రమత్తమైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై సమగ్రంగా విచారణ జరపాలని ఫిబ్రవరి 13న నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీకి లేఖ రాసింది. మూడు బ్యారేజీల డిజైన్లతో పాటు నిర్మాణాలను నిపుణుల ఆధ్వర్యంలో అన్ని కోణాల్లో పరిశీలించాలని ఎన్డీఎస్‌ఏకు విజ్ఞప్తి చేసింది. దీనిపై స్పందించిన నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ..ఈ మూడు బ్యారేజీలపై కమిటీని నియమిస్తూ  శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. బ్యారేజీలను పరిశీలించి, కుంగుబాటుకు, పగుళ్లకు కారణాలను విశ్లేషించాలని, ఇప్పుడున్న పరిస్థితుల్లో చేపట్టాల్సిన ప్రత్యామ్నాయాలను సిఫారసు చేయాలని ఈ కమిటీకి సూచించింది. నాలుగు నెలల్లోపు తమ రిపోర్టును అందజేయాలని కమిటీకి నిర్ణీత గడువును విధించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *