కాళేశ్వరం అవినీతిపై కదలిక

మేడిగడ్డ కుంగుబాటుపై విజిలెన్స్‌ విచారణ
ఇంజనీర్‌ కార్యాలయంలో సోదాలు

హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి9: కాళేశ్వరంలో అవినీతిపై విచారణ చేయిస్తామని కొద్ది రోజులుగా ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు కార్యరూపంలోకి వచ్చాయి. ముందస్తుగా మేడిగడ్డ కుంగుబాటుపై విచారణను విజిలెన్స్‌ కు అప్పగించారు. జలసౌధలోని ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ కార్యాలయంలో విజిలెన్స్‌ అధికారులు సోదాలు చేపట్టారు. మేడిగడ్డ కుంగుబాటుకు కారణాలేమిటో తేల్చాలని విజిలెన్స్‌ ను ఆదేశించామని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. మొత్తం పన్నెండు చోట్ల సోదాలు జరుగుతున్నాయని చెప్పారు. మేడిగడ్డ కుంగుబాటుకు కారణాలు.. ఇతర అంశాలను తేల్చాలని ఆదేశాల్లో పేర్కొన్నట్లుగా తెలిపారు. జ్యుడిషియల్‌ ఎంక్వయిరీ చేసేందుకు సిద్ధం అవుతున్న తరుణంలో ఆలోపు బ్యారేజీ కుంగుబాటుకు కారణాలు, బాధ్యులైన అధికారులను విజిలెన్స్‌ విచారణలో గుర్తించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఇరిగేషన్‌ శాఖ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు ఘటనను రేవంత్‌ రెడ్డి సర్కార్‌ సీరియస్‌గా తీసుకుంది. ఈ వైఫల్యం వెనుక కేసీఆర్‌ సర్కార్‌లో బాధ్యత ఎవరు అనేదానిపై ఫోకస్‌ పెట్టింది. ఇటీవలే మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన మంత్రుల బృందం అక్కడే పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ సైతం ఇచ్చింది. ఈ క్రమంలో విజిలెన్స్‌ విచారణకు ఆదేశించడం ఆసక్తికర పరిణామంగా మారింది.

కాళేశ్వరం అవినీతిపై న్యాయవిచారణ చేయిస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. తర్వాత ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పలుమార్లు అదే ప్రకటన చేశారు. మంత్రుల బృందం ఇటీవల మేడిగడ్డను సందర్శించింది.    మేడిగడ్డ ప్రాజెక్ట్‌  నిర్మాణానికి రూ.4600 కోట్లు ఖర్చు చేసినట్లు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు.  ఒక పిల్లర్‌ 1.2 విూటర్లు కుంగిందని.. మరో మూడు పిల్లర్లపై ఆ ప్రభావం పడిరదని పరిశీలన చేసిన తర్వాత వెల్లడిరచారు.  మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడంపై విచారణలో తప్పు చేసినట్లుగా తేలిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.గత ప్రభుత్వంలో ఇరిగేషన్‌ శాఖలో గోప్యత, రహస్య జీవోలు, అవినీతి జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. వీటిపై విచారణ చేసి.. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ఇరిగేషన్‌ శాఖలో పారదర్శకత ఉండాలని ఆయన చెబుతున్నారు  కాళేశ్వరంపై విచారణ కోట్లాది ప్రజలు విశ్వాసంతో ముడిపడి ఉన్న అంశమన్నారు.అంతా పారదర్శకంగా జరుగుతుందని చెబుతున్నారు. మేడిగడ్డ ప్రాజెక్ట్‌ కుంగుబాటుకు కారణాలు, బాధ్యులను గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయాల్లో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తనిఖీలు చేపట్టారు. మహాదేవపూర్‌ ఇరిగేషన్‌ డివిజన్‌ కార్యాలయంలో రికార్డులను విలువైన పత్రాలను అధికారుల బృందం పరిశీలిస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ, కన్నేపల్లి పంప్‌ హోస్‌లకు సంబంధించిన కార్యాలయాల్లో అధికారుల బృందాలు తనిఖీలు చేపట్టారు. పది ప్రత్యేక బృందాలతో దాడులు కొనసాగు తున్నాయి.

విజిలెన్స్‌ అధికారుల తనిఖీలపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌ మాట్లాడుతూ.. మేడిగడ్డపై విజిలెన్స్‌ విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. మేడిగడ్డ కారణాలేంటో తేల్చాలని విజిలెన్స్‌ అధికారులను ఆదేశించామని.. మొత్తం 12 చోట్ల తనిఖీలు జరుగుతున్నాయని ఉత్తమ్‌ తెలిపారు. తెలంగాణ సర్కార్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీబ్యారేజీ వంతెన కుంగిన వార్త రాష్ట్రంలో పెను దుమారాన్ని రేపింది. బ్యారేజీలోని బీ బ్లాక్‌ పరిధిలో గల 18,19, 20, 21 పిల్లర్ల వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మేడిగడ్డ ప్రాజెక్ట్‌ కుంగడంపై అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ సహా ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తిపోశాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కోసం కోట్లు ఖర్చుపెట్టామని చెప్పి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిర్మించారని ఆరోపించారు.

అప్పట్లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సైతం ప్రస్తుత సీఎం రేవంత్‌ రెడ్డితో కలిసి కుంగిన మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. అప్పటి బీఆర్‌ఎస్‌ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. అనంతరం కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు మేడిగడ్డకు సంబంధించి పూర్తి వివరాలను నీటిపారుదల శాఖ అధికారులు అందజేశారు. ఇటీవలే మంత్రులు కూడా మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు. కాళేశ్వరం అంశం రాజకీయంగానూ కలకలం రేపుతోంది. సీబీఐ విచారణకు సిఫారసు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ విచారణకు డిమాండ్‌ చేసిందని గుర్తు చేస్తున్నారు. అయితే కాంగ్రెస్‌ పార్టీ మాత్రం.. తామే విచారణ చేస్తామని.. లోగుట్టు మొత్తం  బయటకు తీస్తామని ప్రకటించింది. ఈ క్రమంలో విజిలెన్స విచారణ ప్రారంభం కావడం రాజకీయవర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *