పార్టీ నుంచి బహిష్కరిస్తూ నోటీస్
పదిరోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అగస్ట్ 23 : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్పై సస్పెన్షన్ వేటు పడింది. బీజేపీ హైకమాండ్ రాజాసింగ్పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేసింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో..సెప్టెంబర్ 2లోగా వివరణ ఇవ్వాలని రాజాసింగ్ను పార్టీ ఆదేశించింది. అంతేగాక బీజేఎల్పీ పోస్ట్ నుంచి రాజాసింగ్ను అధిష్టానం తప్పించింది. సోషల్ మీడియాలో రాజాసింగ్ పోస్టు చేసిన ఒక వీడియో వివాదాస్పదమై వైరల్ కావడంతో దుమారం చెలరేగింది. దీంతో ఒక వర్గం సోమవారం రాత్రి నుంచి ఆందోళనకు దిగింది. అనంతరం ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్పై పలు స్టేషన్లకు వరుస ఫిర్యాదులు అందిన విషయం తెలిసిందే. ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై పార్టీ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన చేసిన వ్యాఖ్యలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పార్టీ క్రమశిక్షణ సంఘం భావించింది. ఈ మేరకు రాజాసింగ్ను సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పార్టీకి సంబంధించిన బాధ్యతల నుంచి రాజాసింగ్ను తక్షణమే తప్పిస్తున్నట్లు ప్రకటించింది.




