హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1 : కెసిఆర్ బిహార్ పర్యటన విజయవంతం కావడం టీఆర్ఎస్లో జోష్ నింపింది. ఉత్తరాది రాష్ట్రాల్లో మరిన్ని పర్యటనలకు శ్రీకారం చుట్టబోతున్నారు. తదుపరి టార్గెట్గా యూపిని ఎంచుకున్నట్లు తెలుస్తుంది. అక్కడ ఎస్పీ నేత అఖిలేశ్తో కలసి పోరాడాలని చూస్తుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో ఉత్తరప్రదేశ్ పర్యటనకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. యూపిలో బిజెపి సర్కార్ను ఇరుకున పెట్టేలా లక్షలాది మందితో భారీ బహిరంగసభ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు అఖిలేశ్తో చర్చిస్తున్నట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వొచ్చే అవకావశం ఉంది. కలిసివచ్చే పార్టీల నేతలతో సీఎం కేసీఆర్ సమాలోచనలు జరుపుతున్నారు.
బిహర్ పర్యటనలో నితిష్ కుమార్తో కేసీఆర్ ఇదే అంశాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. బీజేపీ పాలిత ప్రభుత్వాలు అధికారంలో ఉన్న ప్రాంతాల్లో రైతుల మద్దతు తీసుకుని భారీ బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. ప్రధాని మోదీ విధానాలతోపాటు, దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రతి అంశాన్ని ప్రజా వేదికగా నిలదీయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్ ఇటీవల జాతీయ రైతు సంఘాల నేతలతో ప్రగతి భవన్లో రెండు రోజులు సమావేశాలు నిర్వహించారు. దేశంలో వ్యవసాయం ఏదుర్కుంటున్న పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లఖీంపూర్ ఖేరి ఘటన ఆధారంగా బిజెపిని నిలదీయాలన్నది కెసిఆర్ వ్యూహంగా ఉంది. అక్కడి రైతు సంఘాల నేతలు కూడా ఇందుకు సంసిద్ధంగా ఉన్నట్లు సమాచారం.




