‘ఆన్‌లైన్‌’లో అన్నీ ఇంటికే !

  • ధ్వంసమైపోతున్న వికేంద్రీకృత ఆర్థిక వ్యవస్థ  
  •  విదేశీ సంస్థల చేతుల్లో  మన జీవన వ్యవహారం  
తినడం మనుగడ కోసం అన్నది పాతకథ. తినడం మానవ జీవన ప్రధాన లక్ష్యంగా మారి ఉండడం నడుస్తున్న వ్యథ.. కొనగలవారు రోజంతా తింటూనే ఉన్నారు. కొనలేనివారు పండ్లు గింజుకొని పస్తులుంటున్నారు. వాణిజ్య ‘ప్రపంచీకరణ’ గ్లోబలైజేషన్‌ మన నెత్తికెత్తిన వైపరీత్యం ఇది. వండనవసరం లేదు, వండడం కోసం వంగి లేచి శ్రమ పడనవసరం లేదు. వండేవారు వేరుగా ఉన్నారు, వడ్డించేవారు వేరుగా ఉన్నారు. రోజంతా ఎప్పుడు పడితే అప్పుడు ఏది కావలసివస్తే అది తింటూ ఉండడమే కొనేందుకు డబ్బున్న ప్రతివాని పని.. కొత్త సిద్ధాంతాలు చెబుతున్నారు. ‘ఇళ్లలో ఇకపై వంట చేయనక్కరలేదు..’ ఇదీ బహుళ జాతీయ వాణిజ్య సంస్థల యజమానులు ప్రచారం చేస్తున్న కొత్త సిద్ధాంతం. కాగితం లేని కార్యాలయాల వలె ‘వంటగది లేని ఇళ్ల’ నిర్మాణం కూడ కొనసాగబోతోంది. నట్టింట ఒక ‘రిఫ్రిజరేటర్‌’ శీతల పేటిక  ఉంటే చాలు! బజారు నుంచి చెత్త సరుకంతా  పిజ్జాలు, బజ్జీలు, చాక్లెట్లు, ఐస్‌క్రీమ్‌లు, కట్‌లెట్లు ఇంకా ఎన్నోరకాల తినుబండారాలు కొని తెచ్చి శీతల పేటికలో నింపవొచ్చు  రాత్రి పన్నెండు  గంటల సమయంలోను, తెల్లవారుజామున మూడుగంటల సమయంలోను ‘నోళ్లు ఆడుతూనే ఉన్నాయి’.
మూడుగంటల నుంచి ఉదయం వైపు కాలప్రస్థానం జరగడం పాతకథ. తెల్లవారుజామున మూడుగంటల వరకు తింటూ ఉండి, వీడియో గేములాడుతూ ఉండి, అప్పుడు నిద్రకు ఉపక్రమించడం కొత్తకథ. రాత్రి తొమ్మిది గంటలలోపు భుజించి నిద్రపోవడం తెల్లవారుజామున మూడు గంటల నుంచి నాలుగు గంటల మధ్య నిద్రలేవడం భారతదేశంలో యుగాలనాటి సంప్రదాయం. ప్రపంచీకరణ జరిగిపోయిన తరువాత జనం తెల్లవారుజామున మూడుగంటల వరకు మేలుకునే ఉంటున్నారు. అప్పుడు నిద్రపోయి ఉదయం పదకొండు గంటలకు నిద్రలేవడం  సెలవురోజుల జీవన విలాసం  ఫ్యాషన్‌  అయిపోయింది.  ఇలాంటి కుటుంబ వ్యవస్థల సౌకర్యం కోసం  బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు  భోజనాలను ఇళ్లకు సరఫరా చేస్తున్నాయి.
image.png
యాబయి రూపాయల ఖర్చుతో ఇంట్లో భోజనం వండుకోవచ్చు. కానీ  బహుళ జాతీయ సంస్థలు  భోజనం సరఫరా చేస్తున్నాయి. ‘సేవా శుల్కం’  సర్వీస్‌ ఛార్జి  యాబయి నుంచి నూరు రూపాయలు ‘భోజనం’ వెల అదనం. అది మూడు వందల రూపాయల నుంచి పైపైకి పెరుగుతోంది. శాకాహారం నుంచి మాంసాహారం వైపుగా ఈ పెరుగుదల.. లక్షలు సంపాదిస్తున్న  కొత్త సంపన్నులు ఇళ్లలో భోజనం వండనక్కర లేదు.  ‘వండుకునే సమయం’ వారికి ఆదా అవుతోందట.  అలా ‘సమయాన్ని ఆదాచేయడానికే’ తాము భోజనాలను ఇళ్లకు పంపిణీ చేస్తున్నట్టు ప్రాసెస్‌ వెంచర్స్‌ అనే అమెరికా బహుళ జాతీయ సంస్థ నిర్వాహకులలో ఒకడు ఇటీవల సెలవిచ్చాడట. ఆ ఒకని పేరు లర్రీ ఇల్లిగ్‌! ‘వంటగది లేని ఇళ్లు’..  కిచెన్‌లెస్‌ హవుస్‌..  సిద్ధాంత ప్రచారకర్తలలో ఇతగాడు ఒకడు.. ఇంటిలో వంట చేసుకొనడం భారతీయ కుటుంబ జీవన వ్యవహారంలో అతి ప్రధానమైన వ్యవస్థ.

ఆ వ్యవస్థను ప్రపంచీకరణధ్వంసం చేయడానికి పథకం సిద్ధం చేసింది. సంపన్న దేశాల నుంచి ఇతర ప్రవర్ధమాన దేశాలలోకి, మన దేశంలోకి చొరబడి ఉన్న బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు పంపిణీ రంగాన్ని కైవసం చేసుకున్నాయి. అంతర్జాల సాంకేతిక ప్రసార ఆన్‌లైన్‌  వ్యవస్థద్వారా ‘వేడి వేడి భోజనాల’ను ఇళ్లకు సరఫరా చేస్తున్నాయి. ఈ ‘గృహప్రసార’  హోమ్‌ డెలివరీ  వ్యవస్థను మొత్తం తానే స్వాధీనం చేసుకొనడానికి విజాతీయ, విదేశీయ వాణిజ్య సంస్థల మధ్య మాత్రమే మన దేశంలో భీకరయుద్ధం నడుస్తోంది. స్వదేశీయ వాణిజ్య సంస్థలు గతమైపోయాయి. వాటిని విదేశీయ సంస్థలు దిగమింగేశాయి, కొనేశాయి. పోటీని తట్టుకోలేని పెద్దపెద్ద స్వదేశీయ సంస్థలే విదేశీయ సంస్థలకు అమ్ముడుపోయాయి. ఇక చిల్లర వర్తకుల వ్యథ చెప్పనక్కరలేదు. కిరాణా దుకాణాలు క్రమంగా మూతపడుతున్నాయి. ఎందుకంటే  ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’ ఇంటింటికీ ‘కిరాణం’, ‘భోజనం’ ‘సర్వం సమస్తం’ చేరవేస్తున్నాయి. అందువల్ల నడుములు బలిసినవారు, నడుములు వంగనివారు, నడవలేనివారు ‘ఆన్‌లైన్‌’లో అన్నింటినీ ఇంటికే తెప్పించుకుంటున్నారు. ఈ ‘ఆన్‌లైన్‌’ సౌకర్యం పాపం భారతీయులైన చిల్లర వర్తకులకు లేదు. అందువల్ల క్రమంగా వారి చిల్లర దుకాణాలు మూతపడుతున్నాయి.

image.png
ఇదంతా ‘ప్రపంచీకరణ’! ఈ తతంగం మొత్తం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితో జరిగిపోతోంది! ఇలా చిల్లర దుకాణాలు మూతపడి వికేంద్రీకృత ఆర్థిక వ్యవస్థ ధ్వంసమైపోయి విదేశీయ ఘరానా సంస్థలు మన జీవన వ్యవహారాన్ని నిరంతరం నియంత్రించాలన్నదే కేంద్ర ప్రభుత్వం లక్ష్యం, అధికాధిక రాష్ట్రాల ప్రభుత్వాల లక్ష్యం… బహుశా!!
వందేళ్ల క్రితం ఎవరి బట్టలువారే కుట్టుకునేవారు, ఎవరి వంటవారే చేసుకునే వారు, ఇప్పుడు ఎవరి బట్టలు వారు కుట్టుకోవడం లేదు, అలాగే భవిష్యత్తులో ఎవరి ఇళ్లలోవారు వండుకునే వ్యవస్థ ఉండదు..  అని ఈ లర్రీ ఇల్లిగ్‌ సిద్ధాంతీకరించాడు.. చరిత్ర పరిజ్ఞానం లేనివాడు! ఈ ‘ప్రాసెస్‌ వెంచర్స్‌’అనే సంస్థ మన దేశంలోని ‘స్విగ్గీ’అనే సంస్థలో ప్రధాన భాగస్వామ్యం వహిస్తోందట. ‘స్విగ్గీ’లో ‘లర్రీ ఇల్లిగ్‌’ సంస్థకు ‘వాటాల’విలువ క్రమంగా పెరుగుతోందట. ఈ ‘స్విగ్గీ’ సంస్థ, ‘జొమాటో ’అనే మరో సంస్థ మన దేశంలోని దాదాపు ఐదువందల నగరాలలో ‘ఆన్‌లైన్‌’ద్వారా ‘వండని’ సోమరిపోతుల ఇళ్లకు భోజనాలను చేరవేస్తున్నాయట. ఇళ్లలో వంటచేసుకొని భోజనం చేయడం మన కుటుంబం పట్ల మనకున్న మమకారంలో భాగం, తాదాత్మ్యస్థితికి మాధ్యమం. కుటుంబంలోనివారు అందరూ కలసి ‘కూర్చుని’ భోంచేయడం భారతీయత. ‘ఆన్‌లైన్‌’ద్వారా ‘భోజనాలు’ ‘విచిత్ర వికృత రూపాల, రుచుల’ తినుబండారాలు తెప్పించుకొని ఎవరికివారు ఎక్కడో అక్కడ ‘నిలబడి’ మెక్కేయడం ‘ప్రపంచీకరణ’. భారతీయ జీవన నందనవన ‘కుటుంబ’వృక్షాలను నరికివేస్తున్న ‘‘ప్రపంచీకరణ’’ మహాపిశాచం చేతి ‘గొడ్డళ్లు’ బహుళ జాతీయ వాణిజ్యసంస్థలు.
‘అమెజాన్‌’అనే మరో విదేశీయ సంస్థకూడ ‘భోజనాల’ను ఇళ్లకు సరఫరా చేయడానికి ఉవ్విళ్లూరుతోందట.  పోటీ మొత్తం రెండోమూడో విదేశీయ సంస్థల మధ్యనే కొనసాగుతోంది. భారతీయ సంస్థలైన ‘ప్లిప్‌ కార్ట్‌’వంటి పంపిణీ వ్యవస్థలను క్రమంగా అమెరికా తదితర విదేశీయ సంస్థలు కైవసం చేసుకుంటున్నాయి. ప్రభుత్వాలు ఇప్పటికైనా మేలుకొని ఈ విదేశీయ సంస్థలను నిరోధించి వెళ్లగొట్టకపోతే చరిత్ర పునరావృత్తం కాక తప్పదన్నది కనీస పరిజ్ఞానం..   అలా పునరావృత్తం కానున్న చరిత్ర ‘‘ఈస్టిండియా’’ తదితర ఐరోపా ‘వాణిజ్య సంస్థలు’ మన దేశంలోకి చొరబడిన నాటిది, క్రీస్తుశకం పదిహేడవ, పద్దెనిమిదవ శతాబ్దుల నాటిది.  ప్రభుత్వాలకు ఈ ‘కనీస పరిజ్ఞానం’ కలిగించవలసిన ప్రజలలో ప్రముఖులు ఈ విదేశీయ సంస్థల ద్వారా ‘ఆన్‌లైన్‌ భోజనాలను తెప్పించుకొని ఆరగిస్తున్నారు.
 ఆరగించి, ఆరగించి సూర్యోదయ శుభసమయంలో మత్తుగా నిద్రపోతున్నారు.. ఎవరు నిద్రలేపాలి? మన దేశంలో ఎప్పుడు కూడ గతంలో, ఎవరి బట్టలువారు కుట్టుకోలేదు.  బట్టలు నేయడం బట్టలు కుట్టడం వృత్తిగల జనసముదాయాలవారు మొత్తం ప్రజల అవసరాలు తీర్చారు.  ఇదంతా వికేంద్రీకృత స్వయం సమృద్ధ గ్రామవ్యవస్థలో భాగం.  అందువల్ల లర్రీ ఇల్లిగ్‌ వంటి- అనభిజ్ఞులు కావొచ్చు, దుర్బుద్ధితో అబద్ధాలు చెప్పే అక్రమ లాభార్జన వేత్తలు కావొచ్చు..  వారు వివరించే ‘‘చరిత్ర’’ నిజానికి లేదు.  ఇంటికి వస్తువులను చేరవేసే సంచార వర్తకులు లక్షలమంది మన దేశంలో నిరంతరం పర్యటించారు. ఈ సంచార వర్తకులు మారుమూల గ్రామాలలోని సామాన్య ప్రజల ఇళ్లకు సైతం నియతంగా నిత్యావసరాలను సరఫరాచేయడం చరిత్ర. లక్షలాది ‘సంచార వర్తకులు’ క్రమంగా అంతరించిపోవడం బ్రిటన్‌ బీభత్స ‘‘పాలన’  ఫలితం. ఈ ‘‘బీభత్సపాలన’’కు విస్తృతి వాణిజ్య ‘ప్రపంచీకరణ’.  లక్షలాది స్వదేశీయులు, చిన్న వ్యాపారులు జరిపిన శతాబ్దుల సహస్రాబ్దుల ‘హోమ్‌ డెలివరీ’ మరుగైపోయింది. రెండుమూడు విదేశీయుల ‘దోపిడీ’ ముఠాలు ఈ ‘హోమ్‌ డెలివరీ’ని కైవసం చేసుకోవడం దేశమంతటా విస్తరించింది.. సూర్యోదయ శుభవేళ గురకలు పెడుతూ నిద్రపోతున్న సోమరిపోతులకు ధ్యాసలేని వాస్తవమిది.
-కరిష్మా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *