- పని చేసే అధికారులపై ఎప్పుడూ గౌరవం ఉంటుంది
- పార్టీ కార్యకర్తలే నాకు సెక్యూరిటీ
- రియల్ భూమ్ ఒక నాటకం… భూములు కొన్నది బిఆర్ఎస్ నాయకులు, కెసిఆర్ బినామీలే
- మీడియాతో చిట్చాట్లో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : అధికారులకు రాజకీయాలతో సంబంధం ఏమిటని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి నిలదీశారు. అయితే ప్రజల కోసం పని చేసే అధికారులపై తనకెప్పుడూ గౌరవం ఉంటుందని, ప్రభుత్వ అధికారులుగా ఉంటూ వొచ్చే ఎన్నికల్లో కెసిఆర్ గెలుస్తారని అంటున్న వాళ్ల విషయంలో సైలెంట్గా ఎలా ఉంటానని, వాళ్లే తన టార్గెట్ అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం గాంధీ భవన్లో మీడియాతో చాట్చాట్లో ఆయన మాట్లాడుతూ…కోర్టు ఆదేశించినా రాష్ట్రంలోని బిఆర్ఎస్ ప్రభుత్వం తనకు సెక్యూరిటీని కల్పించడం లేదన్నారు. ఎంపిగా, జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న తనకు సెక్యూరిటీ తొలగిస్తారా అంటూ ప్రశ్నించారు. అయితే తాను ప్రజల మనిషిని అయినందున తనకు సెక్యూరిటీతో పని లేదని రేవంత్ రెడ్డి అన్నారు. తాను సెక్యూరిటీ లేకుండా ఎక్కడికైనా వెళ్లగలనని, సెక్యూరిటీ లేకుండా కెసిఆర్ ఉస్మానియా, కాకతీయా యూనివర్సిటీలకు రాగలరా లని ప్రశ్నించారు. తనను ఓడించడానికి కెసిఆర్ పోలీసులను వాడుకుంటున్నాడని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
సెక్యూరిటీని ఉపసంహరించి భయపెడితే తాను భయపడేవాడిని కాదని, అక్షలాది మంది కార్యకర్తలే తన సైన్యమని, వాళ్లే తనకు సెక్యూరిటీ అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ, మైనారిటీ అనే తేడా ఉండదని రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలు అనేకులు ఉన్నత పదవులలో ఉన్నారన్నారు. బిఆర్ఎస్ మైనారిటీలకు చేసిందేమీ లేదని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లల్లో ఒక్క పర్సెంట్ కూడా మైనారిటీలకు దక్కలేదన్నారు రేవంత్. కారు ఇక్కడి నుంచి బయలు దేరి దిల్లీ వేళ్లేసరికి కమలంగా మారిపోతున్నదని అన్నారు.
బిఆర్ఎస్ పార్టీకి వోటేస్తే బిజేపికి వోటేసినట్టేనని, కెసిఆర్ మైనార్టీ వోట్లను బిజెపికి అమ్ముకుంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మైనిరిటీలందరూ కాంగ్రెస్ వైపే చూస్తున్నారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. తాము బిజెపికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని గుడి, మజీదు, చర్చ్ ఎక్కడిపైనా వొచ్చి చెప్పగలమని, బిఆర్ఎస్ వాళ్లు అలా చెప్పగలరా అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఇక రియల్ బూమ్ అనేది ఒక నాటకమని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కోకాపేట్, బుద్వేల్లో భూములు కొన్న సంస్థల పేర్లు ఎందుకు చెప్పడం లేదని ఆయన ప్రశ్నించారు. అక్కడ కొన్నది బిఆర్ఎస్ నాయకులు, కెసిఆర్ బినామీలేనని ఆయన ఆరోపించారు.




