- ఏడేండ్లు కరువు వొచ్చినా ఢోకా లేదు
- 2072 నీటి అవసరాల మేరకు లభ్యత
- వంద కిలోవి•ర్ల పరిధి వరకు నీటి సరఫరా
- దేశానికి అసెట్ కానున్న హైదరాబాద్
- కెసిఆర్ లాంటి దార్శనిక నేతతో సమస్యలకు పరిష్కారం
- సుంకిశాల లిఫ్ట్కు శంకుస్థాపనలో మంత్రికెటిఆర్ హామీ
నల్లగొండ, ప్రజాతంత్ర, మే 14 : హైదరాబాద్ నగరానికి 2072 వరకు తాగునీటికి ఇబ్బందుల్లేకుండా ముందుచూపుతో ప్రణాళికలు రూపొందించామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. వరుసగా ఏడేండ్లు కరువు వొచ్చినా తాగునీటికి తిప్పలు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హైదరాబాద్ చుట్టు కూడా వాటర్ పైప్ లైన్లను ఏర్పాటు చేశారు. భవిష్యత్లో హైదరాబాద్ నగరం 100 కిలోవి•టర్ల విస్తరించినా తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు వెలుపలా, బయట ఉన్న ప్రాంతాలకు కూడా తాగు నీటిని అందించేలా ప్లాన్ చేశామన్నారు.
హైదరాబాద్ మహానగరం తెలంగాణకు రాజధాని అయినప్పటికీ..భారతదేశానికి ఒక అసెట్ అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అలాంటి హైదరాబాద్ మహానగరాన్ని భవిష్యత్ తరాలకు బ్రహ్మాండమైన అసెట్గా అందించాలని, భవిష్యత్ భారతావనికి ఒక దిక్సూచిగా ఉండే విధంగా భాగ్యనగరంలో కార్యక్రమాలు చేయాలని, ఆ విధంగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ తమకు ఎప్పుడూ చెప్తుంటారని కేటీఆర్ వెల్లడించారు. కేసీఆర్ లాంటి దార్శనిక ముఖ్యమంత్రి ఉండటం వల్ల ఏడేండ్లలో ఎన్నో సమస్యలను పరిష్కారం అయ్యాయని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ తాగునీటి అవసరాల నిమిత్తం.. శనివారం నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ వద్ద సుంకిశాల ఇన్టెక్ వెల్ పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల ప్రజలకు నిజంగా ఇవాళ శుభదినం అని పేర్కొన్నారు. మెట్రో వాటర్ సప్లై, సీవరేజ్ బోర్డు ఆధ్వర్యంలో రూ. 6 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ప్రస్తుత హైదరాబాద్లో నీటి అవసరాలు 37 టీఎంసీలు..2072 వరకు ఆలోచిస్తే ఇది పెరిగి మరో 34 టీఎంసీల అవసరం ఉంటుంది. దాదాపు 71 టీఎంసీల నీరు అవసరం ఉండే అవకాశం ఉంది. 2035 నాటికి 47 టీఎంసీలు, 2050 నాటికి 58 టీఎంసీలు, 2065 నాటికి 67 టీఎంసీలు, 2072 నాటికి 70.97 టీఎంసీల నీరు అవసరం ఉంటుందని అంచనా వేశామన్నారు. సుంకిశాలలో 1450 కోట్ల అంచనా వ్యయంతో తాగునీటి అవసరాల నిమిత్తం పంపులు, మోటార్లతో పాటు అదనంగా 16 టీంఎసీలు లిప్ట్ చేయడానికి పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. రాబోయే ఎండకాలం నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేసి హైదరాబాద్ ప్రజలకు తాగునీరు అందిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగరమని అన్నారు.
భౌగోళికంగా హైదరాబాద్కు చాలా అనుకూలతలు ఉన్నాయన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు వెలుపులా, బయట ఉన్న ప్రాంతాలకు కూడా తాగు నీటిని అందించేలా ప్లాన్ చేశామన్నారు. సిటీ ఎంత విస్తరించినా నీటి కొరత లేకుండా సుంకిశాల ప్రాజెక్టును చేపడుతున్నామన్నారు. రూ.1450 కోట్లతో ఈప్రాజెక్టును నిర్మిస్తున్నామన్నారు. మోటార్లు పెట్టి నీటిని పంపింగ్ చేసేలా కూడా సివిల్ వర్కస్ జరుగుతున్నా యన్నారు. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, జిల్లాల ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరమన్నారు. దేశంలో వేగంగా ఎదుగుతున్న మహానగరం ఏదంటే హైదరాబాద్ అని చెప్పొచ్చు. హైదరాబాద్ శర వేగంగా పెరుగుతున్నది, విస్తరిస్తున్నదని తెలిపారు.15 సంవత్సరాల కాలంలో ఢిల్లీ తర్వాత హైదరాబాద్ రెండో అతిపెద్ద నగరంగా ఆవిర్భవిస్తుందంటే.. ఇది అతిశయోక్తి కాదననారు. తాను చెప్పేది ఏదో కల్పన కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎందుకంటే మనం ఇప్పటికే ఎయిర్ ట్రాఫిక్లో నాలుగో స్థానానికి చేరుకున్నాం. ఢిల్లీ, ముంబై, బెంగళూరు తర్వాత మనమే ఉన్నాం. చెన్నై, కోల్కతాను దాటిపోయామని కేటీఆర్ పేర్కొన్నారు. మిగతా ఏ నగరాలకు లేని భౌగోళిక, పర్యావరణ అనుకూలతలు హైదరాబాద్కు ఉన్నాయి. నాలుగు వైపులా నగరం పెరుగుతోందని కేటీఆర్ స్పష్టం చేశారు. భారతదేశంలోని ఇతర మహానగరాల్లో రకరకాల కారణాల వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని కేటీఆర్ గుర్తు చేశారు. రైలు ట్యాంకర్లలో నీళ్లు తెచ్చే దుస్థితి ఒక నగరంలో ఉంది. పెరుగుతున్న ధరల కారణంగా మరో నగరం విస్తరించే అవకాశం లేదు. మరొక నగరంలో పొల్యూషన్ సమస్య, ఇంకో నగరంలో ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంది. ఇలా అనేక సమస్యలతో దేశంలో నగరాలు సతమతమవుతున్న వేళ.. కానీ హైదరాబాద్కు అన్ని రకాల అనుకూలతలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్,శ్రీనివాస గౌడ్,మహ్మూద్ అలీ,మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.