- హైదరాబాద్లో జరిగే జి-20 సమావేశాలకు పటిష్ట భద్రత
- డిజిపి అంజనీకుమార్ ఉన్నత స్థాయి సమావేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 17 : హైదరాబాద్లో జనవరి 28 నుండి జూన్ 17వ తేదీ మధ్యలో జరుగనున్న అత్యంత ప్రతిష్టాత్మక జి-20 వర్కింగ్ గ్రూప్ సమావేశాలను విజయవంతంగా నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలని జి-20 సెక్యూరిటీ కోఆర్డినేషన్ కమిటీలో నిర్ణయించారు. డీజీపీ అంజనీ కుమార్ అధ్యక్షతన మంగళ వారం ఉదయం డీజీపీ కార్యాలయంలో జి-20 సెక్యూరిటీ సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర సీనియర్ పోలీస్ అధికారులతోపాటు, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, రీజినల్ పాస్పోర్ట్ ఆఫీస్, ఎన్.డి.ఆర్.ఎఫ్, ఎస్.ఆర్.డి.ఎఫ్, సి.ఐ.ఎస్.ఎఫ్, ఎన్.ఎస్.జి తదితర భద్రతా సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్బంగా డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ, ప్రపంచంలో మూడింటా రెండవ వంతు జనాభాను కవర్ చేయడంతోపాటు, ప్రపంచంలోని 85 శాతం జిడిపి, 75 శాతం గ్లోబల్ వాణిజ్యాన్ని శాసించే 29 దేశాలు సభ్యులుగా ఉన్న అత్యంత ప్రతిష్టాత్మక జి-20 దేశాల అధినేతల అత్యున్నత సమావేశం దేశప్రధాని నేతృత్వంలో సెప్టెంబర్ మాసంలో జరుగనుందని తెలిపారు.
ఈ అత్యున్నత సమావేశానికి ముందస్తుగా దేశంలోని 56 నగరాల్లో 215 వర్కింగ్ గ్రూపు సమావేశాలు నిర్వహిస్తున్నారని అన్నారు. దీనిలో భాగంగా హైదరాబాద్లో ఆరు సమావేశాలు జరగనున్నాయని వెల్లడించారు. జనవరి 28న తొలి సమావేశం జరగనుండగా, మార్చ్ 6 , 7 తేదీలలో, ఏప్రిల్ 26 ,27 ,28 తేదీలలో, జూన్ 7 ,8 ,9 తేదీలు, జూన్ 15 , 16 ,17 తేదీలు, జూన్ 17 తేదీల్లో వివిధ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరుగుతాయని తెలియ చేశారు. ఈ సమావేశాలకు మంత్రులు, కార్యదర్శులు, జాయింట్ సెక్రెటరీ స్థాయి అధికారుల నుండి స్వచ్చంద సంస్థల ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశాలు సజావుగా, ఏవిధమైన భద్రతా పరమైన అవాంతరాలు లేకుండా నిర్వహించేందుకు వివిధ భద్రతా విభాగాల మధ్య సమన్వయము అవసరమని అంజనీ కుమార్ అన్నారు. ఈ సమావేశాలకు హాజరయ్యే ఉన్నత స్థాయి ప్రతినిధులు నగరంలో ప్రముఖ పర్యాటక ప్రాంతాలను కూడా సందర్శించే అవకాశమున్నందున ఆయా ప్రాంతాల్లో విస్తృత భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ విషయంలో సమర్ధవంతమైన సమన్వయం కోసమై అంతర్గత వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించాలని తెలిపారు. ఈ సమావేశాలకు హాజరయ్యే ప్రతీ ఒక్కరి యాంటిడేన్స్లను పక్కాగా పరిశీలించాలని కోరారు.
ప్రధానంగా ఎయిర్పోర్ట్, ప్రతినిధులు బస చేసే హోటళ్లు, సమావేశాలు జరిగే ప్రాంతాల్లో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేయాలని హైదరాబ్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లను ఆదేశించారు. ఎయిర్పోర్ట్ తోపాటు నగరంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ డీజీలు అభిలాష బిస్త్, సంజయ్ కుమార్ జైన్, స్వాతి లక్రా, విజయ కుమార్, నాగిరెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, హైదరాబాద్ అడిషనల్ సి. పి. విక్రమ్ సింగ్ మాన్,డీ.ఐ.జి తఫ్సీర్ ఇక్బాల్, ట్రాఫిక్ అడిషనల్ సి.పి సుధీర్ బాబు, హోమ్ మంత్రిత్వ శాఖ ఎస్.ఐ.బి డీడీ సంబల్ దేవ్, రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ సి.ఎస్.ఓ భారత్ కందార్,డిప్యూటీ పాస్ పోర్ట్ ఆఫీసర్ ఇందు భూషణ్ లెంక, ఎన్.డి.ఆర్.ఎఫ్. దామోదర్ సింగ్, సి.ఐ.ఎస్.ఎఫ్ కు చెందిన సింగన రామ్, ఎన్.ఎస్.జి కి చెందిన కల్నల్ అలోక్ బిస్త్, జీఏడీ ప్రోటోకాల్ అధికారి కె.నాగయ్య తదితర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.