ప్రయాణికులతో మాటా మంతి
మరో వెయ్యి బసులు అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడి
మరో వెయ్యి బసులు అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 3 : సచివాలయంలో తన విధులు, జిల్లాల్లో సమావేశాలతో నిత్యం బిజీగా ఉండే మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆకస్మికంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ వెళ్తున్న బస్సులో ఆదివారం రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. నారాయణపేట బస్సులో ప్రయాణికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నందిగామ నుండి షాద్ నగర్ వరకు ఆయన ప్రయాణం చేశారు. మంత్రి వెంట దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి సైతం ఉన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు అందుతున్న ఉచిత ప్రయాణం.. ప్రయాణం వల్ల ఆదా అవుతున్న డబ్బులు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా..బస్సులోని ప్రయాణికులు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మంత్రి స్పందిస్తూ త్వరలోనే మరో వెయ్యి కొత్త బస్సులు వొస్తున్నాయని ఎవరికి ఇబ్బందులు ఉండవని హామీ ఇచ్చారు. అలాగే ఆర్టీసి కండక్టర్ తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. త్వరలోనే పీఆర్సీ అమలుకు చర్చిస్తున్నమని.. ఆర్టీసిలో ఉద్యోగ నియామకాలు చేపడుతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.





