మీరు మనుషులా…రాక్షసులా…?

మైనర్‌ ‌బాలికపై అఘాయిత్యం చేస్తే కనీసం స్పందించరా?
తక్షణమే అరెస్ట్ ‌చేసి నిందితులను కఠినంగా శిక్షించాలి
లేనిపక్షంలో బీజేపీ ఉద్యమ ధాటికి తట్టుకోలేరు
టీఆర్‌ఎస్‌ ‌ఫ్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌ ‌కుమర్‌ ‌ఫైర్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 3 : ‘‘‌మీరు మనుషులా…రాక్షసులా…మైనర్‌ ‌బాలికపై అఘాయిత్యం చేస్తే నిందితులను అరెస్ట్ ‌చేయరా?…ఎఫ్‌ఐఆర్‌లో నిందితుల పేర్లు నమోదు చేయరా? సీసీ టీవీ కెమెరాలున్నదెందుకు?..’’ అంటూ జూబ్లిహిల్స్ ‌మైనర్‌ ‌బాలికపై అఘాయిత్వం జరిగి 5 రోజులైనా నిందితులను ఇంతవరకు అరెస్టు చేయకపోవడం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో పోలీసుల తీరును, ప్రభుత్వ వైఖరిని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. శుక్రవారం సంజయ్‌ ‌మీడియాతో మాట్లాడుతూ…‘‘బాలికను తీసుకెళుతున్న కారులో టీఆర్‌ఎస్‌, ఎంఐఎం ‌నాయకులున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆ పుటేజీల ఆధారంగా నిందితులను ఇప్పటి వరకు ఎందుకు విచారించలేదు? చంచల్‌ ‌గూడ జైల్లో ఉంచాల్సిన నిందితులను సేఫ్‌గా దాచిపెడతారా? కేసు నుండి వారిని తప్పించేందుకు కష్టపడుతున్న పోలీసులు చట్టాన్ని రక్షించేవాళ్లా… భక్షించేవాళ్లా? రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌, ఎంఐంఎం ‌నాయకులు ఏదైనా చేయొచ్చు… కాపాడటానికి పోలీసులు రడీగా ఉన్నారనే సంకేతాలను పంపుతున్నారా?’’ అని పోలీసుల తీరుపై ధ్వజమెత్తారు.

కొందరు పోలీసులు వ్యవహరిస్తున్న తీరువల్ల ప్రజలకు మొత్తం పోలీస్‌ ‌వ్యవస్థపైనే నమ్మకం పోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న చిన్న ఘటనలకు స్పందించి హడావుడి చేసే పోలీసులు ఆడబిడ్డపై ఆఘాయిత్యం జరిగితే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ‘‘రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాల వెనుక టీఆర్‌ఎస్‌, ఎంఐఎం ‌నేతల హస్తమున్నట్లు అనేక వార్తలొస్తున్నా…..సీఎం కేసీఆర్‌ ఏం ‌చేస్తున్నట్లు? ఆ పార్టీ నేతల ప్రమేయమున్నట్లు తేలినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఫాంహౌజ్‌లో పడుకుని ఫిడేల్‌ ‌వాయిస్తున్నారా? ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కనీసం స్పందించాలనే ఆలోచన కూడా లేని సీఎం దేశంలో కేసీఆర్‌ ‌మాత్రమే’’ అని మండిపడ్డారు.

టీఆర్‌ఎస్‌ ‌పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని బండి సంజయ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ ‌నడిబొడ్డున ఆడబిడ్డకు న్యాయం చేయలేకపోతే, మారుమూల పల్లెల్లో ఏం న్యాయం చేస్తారని సంజయ్‌ ‌ప్రశ్నించారు. హత్యలు, డ్రగ్స్, అఘాయిత్యాలతో హైదరాబాద్‌ ‌ప్రతిష్టను మంట కలుపుతున్నారని అన్నారు. జూబ్లిహిల్స్ అఘాయిత్యం ఘటనలో తక్షణమే నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. లేనిపక్షంలో బీజేపీ చేపట్టే ఉద్యమ ధాటికి టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం తట్టుకోలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page