- మంచి స్పందన వొచ్చింది
- మార్చి 29 నుండి ఏప్రిల్ 9 వరకు ఆరోగ్య శిబిరాలు
- సంపూర్ణ ఆరోగ్యం అందించాలని ముఖ్యమంత్రి సంకల్పం
- జిల్లా కేంద్రాలలో కూడా మహిళా జర్నలిస్టులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు
- కాంప్రహెన్సివ్ హెల్త్ చెకప్లో భాగంగా 36 పరీక్షలు
హైదరాబాద్, మార్చి 31 : హైదరాబాద్లోని మాసాబ్ ట్యాంక్లోని సమాచార శాఖ ప్రధాన కార్యాలయమైన సమాచార్ భవన్లో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న గుర్తింపు పొందిన మహిళా జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరానికి మంచి స్పందన వొచ్చింది. ఆరోగ్య శిబిరాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బుధవారం ప్రారంభించారు. సమాచార శాఖ కమిషనర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ, ఆరోగ్య శాఖ కమీషనర్ శ్వేతా మహంతి, సమాచార శాఖ డైరెక్టర్ రాజమౌళి ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ…రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత ఆరోగ్య పరీక్షల శిబిరాలు నిర్వహించి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సంకల్పించారన్నారు. రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి కె తారక రామారావు మహిళా దినోత్సవం మహిళా జర్నలిస్టులకి బారీ స్థాయిలో వైద్య పరీక్షలను నిర్వహించాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు ఈ ఆరోగ్య శిబిరం ప్రారంభిస్తున్నామని ఆమె తెలిపారు. ఉచిత ఆరోగ్యపరీక్షల ఫలితంగా మహిళా జర్నలిస్టులకు ఆర్ధిక భారం లేకుండా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ సదావకాశాన్ని మహిళా జర్నలిస్టులు వినియోగించుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు. ఈ కార్యక్రమం నిర్వహణ పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కెసిఆర్ కిట్, కంటివెలుగు పరీక్షలు, ఉచిత ఆరోగ్య శిబిరాలు లాంటి ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నందున దేశంలో తెలంగాణ రాష్ట్రం మాతా, శిశు మరణాల రేటును తగ్గించడంలో ముందున్నదని ఆమె పేర్కొన్నారు.
కంటి వెలుగు మొదటి దశ కార్యక్రమంలో కోటిన్నర మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి 45 లక్షల మందికి కంటిఅద్దాల పంపిణీ చేయడం జరిగిందని ఆమె తెలిపారు. రెండవ దశ కంటి వెలుగు కార్యక్రమంలో ఒక కోటి 70 లక్షల మందికి కంటి పరీక్షలు చేయాలని సంకల్పించామని ఆమె అన్నారు. అక్రిడిటెడ్ మహిళా జర్నలిస్టులు, ఆర్గనైజేషన్ గుర్తింపు కార్డులు ఉన్న మహిళా జర్నలిస్టుల కోసం మాసబ్ ట్యాంక్లోని సమాచార పౌరసంబంధాల శాఖ ప్రధాన కార్యాలయం సమాచార భవన్లో పది రోజుల పాటు నిర్వహించే ఉచిత వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మహిళా జర్నలిస్టులకు సూచించారు.
పదిరోజుల పాటు వైద్య శిబిరం నిర్వహణ…
ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఉదయం 7.00 గంటల నుండి మధ్యాహ్నం 2.00 గంటల వరకు నిర్వహించనున్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ ప్రధాన కార్యాలయంలో నిర్వహించే ఈ శిబిరంలో రాష్ట్ర స్థాయి అక్రిడిటేటేడ్ మహిళా జర్నలిస్టులతో పాటు హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నుండి అక్రిడిటేషన్ పొందిన మహిళా జర్నలిస్టులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ కోరారు. జిల్లాలకు చెందిన అక్రిడిటేటేడ్ మహిళా జర్నలిస్టులకు ఆయా జిల్లా కేంద్రాలలో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
ఈ కాంప్రహెన్సివ్ హెల్త్ చెకప్లో రక్త పరీక్ష(సిబిపి), బ్లడ్ షుగర్, డయాబెటిక్ పరీక్షలు, లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్, కాల్షియం, మూత్ర పరీక్షలు, విటమిన్ బి12, డి3 మొదలైన డయాగ్నోస్టిక్స్ పరీక్షలు , ఇసిజి, ఎక్స్-రే, అల్ట్రాసోనోగ్రఫీ, మామోగ్రామ్, పాప్ స్మియర్, స్క్రీనింగ్ పరీక్షలు, మెడికల్ ఆఫీసర్ ఎగ్జామినేషన్, కంటి స్క్రీనింగ్, దంత పరీక్షలు, గైనకాలజీ పరీక్షలు మొదలైన పరీక్షలు చేస్తున్నారు. ఈ పరీక్షల రిపోర్ట్లు అదే రోజు అందజేయనున్నారు.
– కమిషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ, హైదరాబాద్ వారిచే జారీ చేయనైనది.
– కమిషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ, హైదరాబాద్ వారిచే జారీ చేయనైనది.