- మోసపూరిత కంపెనీలకు బ్రాండ్గా ఉండకండి
- అమితాబ్ను కోరిన తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జన్నార్
హైదరాబాద్, మార్చి 31 : మోసపూరిత కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం వల్ల ప్రజలు మోసపోతారని, అందువల్ల అటువంటి కంపెనీ యాడ్స్లో నటించవద్దని బిగ్బి అమితాబ్కు తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జన్నార్ విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా ఆమ్వే కంపెనీ యాడ్స్లో అమితాబ్ నటించడంపై సజ్జన్నార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కంపెనీలు తమ ప్రాడక్టస్ ను అమ్ముకోవడం కోసం ప్రముఖులతో యాడ్స్ తయారు చేయిస్తారు. కోట్లు పెట్టి సెలబ్రిటీలతో యాడ్స్ తీసి సొమ్ము చేసుకుంటాయి ఈ కంపెనీలు. సెలబ్రిటీలు కూడా ఆ కంపెనీలు ఉత్పత్తి చేసే వస్తువులు, ప్రొడక్టస్ మంచివా, హానికరమైనవా చూడకుండా ప్రకటనల్లో నటిస్తారు. తర్వాత చిక్కుల్లో ఇరుక్కుంటారు.
బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా అమెరికాకు చెందిన ఆమ్వే కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. అయితే ఇలాంటి యాడ్స్ చేయొద్దని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అమితాబ్ కి సూచించారు. ఆమ్వే లాంటి మోసపూరిత కంపెనీలకు సహకరించొద్దని ట్విట్టర్లో అభ్యర్థించారు. దేశ సామాజిక వ్యవస్థలను దెబ్బతీస్తున్న ఇలాంటి గొలుసు కట్టు సంస్థలను ప్రమోట్ చేయొద్దని సెలబ్రిటీలకు సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. ఆమ్వే కంపెనీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కామ్ కు పాల్పడుతోందని ఈడీ 2022 లో ఆరోపించింది. ఆమ్వే ఆస్తులను సీజ్ చేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది.