నాలుగు మండలాల్లో 5,905 దరఖాస్తులు
మే మొదటివారంలో మరో 28 మండలాల్లో భూభారతి పైలట్
ప్రతి సోమవారం బిల్లుల చెల్లింపు
200 దరఖాస్తులకు ఒక గెజిటెడ్ అధికారి పర్యవేక్షణ
రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : ప్రభుత్వ ఆలోచనలు , ప్రాధాన్యతలకు అనుగుణంగా పనిచేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకమైన ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి చట్టం అమలుపై కలెక్టర్లు మరింత ప్రత్యేక శ్రద్ద వహించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుంచి మంగళవారం చీఫ్ సెక్రటరీ శాంతికుమారితో కలిసి భూభారతి , ఇందిరమ్మ ఇండ్లు, ఎల్ ఆర్ ఎస్ తదితర అంశాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన చిరస్మరణీయమైన భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని ఈ చట్టాన్ని అమలుచేయవలసిన బాధ్యత కలెక్టర్లదేనని స్పష్టం చేశారు. భూభారతి చట్టంపై పైపైనే కాకుండా లోతుగా అధ్యయనం చేసి ప్రజల్లోకి వెళ్లాలని కలెక్టర్లకు సూచించారు. భూభారతి పైలట్ ప్రాజెక్ట్ అమలుచేస్తున్న నాలుగు మండలాల్లోని 56 రెవెన్యూ గ్రామాలకు గాను 16 గ్రామాల్లో ఈనెల 17వ తేదీ నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించామని, ఇప్పటివరకు ఈసదస్సుల్లో భూ సమస్యలకు సంబంధించి ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో 1076, నారాయణపేట జిల్లా మద్దూర్ లో 233, కామారెడ్డి జిల్లా లింగంపేట 810 ,ములుగు జిల్లా వెంకటాపురంలో 3786 మొత్తం 5,905 దరఖాస్తులు వొచ్చాయని తెలిపారు.
ఈనెల 30వ తేదీలోగా పైలట్ మండలాల్లో రెవెన్యూ సదస్సులను పూర్తిచేయాలని కలెక్టర్లకు సూచించారు. ఈ నాలుగు పైలట్ మండలాల్లో వచ్చిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మే మొదటి వారంలో హైదరాబాద్ మినహా మిగిలిన 28 జిల్లాల్లోని ఒక్కో మండలాన్ని పైలట్ మండలంగా తీసుకొని 28 మండలాల్లో భూభారతి చట్టాన్ని అమలు చేస్తామని తెలిపారు. దీనికిముందు ఆ నాలుగు మండలాల్లోని తహశీల్దార్ నేతృత్వంలోని అధికారుల బృందం, ఈ 28 మండలాల్లోని తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్, మరో ఇద్దరు అధికారులకు భూభారతి చట్టంపై వర్క్షాపు నిర్వహించడం జరుగుతుందన్నారు.రాష్ట్రంలో 605 మండలాలకు గాను 159 మండలాల్లో భూభారతిపై అవగాహనా సదస్సులు నిర్వహించడం జరిగిందన్నారు. సిసిఎల్ఎ స్ధాయిలో పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తులను కూడా పైలట్ మండలాల్లోని రెవెన్యూ సదస్సులలో చేర్చాలని సూచించారు.
యుద్ధప్రాతిపదికన ఇందిరమ్మ లబ్దిదారుల ఎంపిక
వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని యుద్దప్రాతిపదికన ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను మే మొదటివారంలోగా పూర్తిచేసి నిర్మాణాలను వేగవంతం చేయాలని మంత్రిగారు కలెక్టర్లను ఆదేశించారు. నియోజకవర్గానికి 3500 ఇండ్ల చొప్పున లబ్దిదారులను ఎంపిక చేయాలని, 200 దరఖాస్తులకు ఒక గెజిటెడ్ అధికారిని నియమించి అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు అందేలా చూడాలని, అనర్హులను ఎంపిక చేస్తే ఆ గెజిటెడ్ అధికారిదే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఇందిరమ్మ ఇండ్లను 400 చదరపు అడుగులకు తగ్గకుండా 600 చదరపు అడుగులకు మించకుండా నిర్మాణం జరిగితేనే డబ్బులు విడుదల చేయాలని సూచించారు. నిర్మాణదశలను బట్టి లబ్దిదారులకు ప్రతిసోమవారం నాడు వారి ఖాతాలోనే నేరుగా డబ్బులను జమచేయాలని సూచించారు.
లబ్దిదారులకు తక్కువ ధరకు స్టీల్ సిమెంట్ ఇచ్చేవిధంగా త్వరలో పరిశ్రమల శాఖామంత్రి శ్రీధర్బాబుతో కలిసి ఆయా పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. ఆదిలాబాద్ , జగిత్యాల , నిజామాబాద్ వనపర్తి మంచిర్యాల గద్వాల మొత్తం 11 జిల్లాల్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక ఆశించిన స్ధాయిలో లేదని మంత్రి గారు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఎల్ఆర్ఎస్. గడువు పెంచబోం
ఎల్ ఆర్ ఎస్ కు గడువు ఈనెల 30 వ తేదీతో ముగుస్తుందని మరో సారి గడువు పెంచే ఆలోచన ప్రభుత్వానికి లేదని మంత్రిగారు స్పష్టం చేశారు. మరో వారంరోజుల వ్యవధి మాత్రమే ఉందని ప్రభుత్వం కల్పించిన 25 శాతం రాయితీని ఉపయోగించుకోవాలన్నారు. ఎల్. ఆర్ .ఎస్ అమలులో కలెక్టర్ల పనితీరు అభినందనీయమన్నారు. ఈసమావేశంలో స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ ఐజీ జ్యోతి బుద్దప్రకాష్, ఎమ్ ఎ యూడీ మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి దానకిశోర్, హౌసింగ్కార్పోరేషన్ ఎండీ విపి గౌతమ్, సిసిఎల్ ఎ డైరెక్టర్ మకరంద్, తదితరులు పాల్గొన్నారు.