“న్యాయస్థానం తీర్పు శిరసావహిస్తాం..”

ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా రెండు వ్యవస్థల మధ్య పరస్పరం పరిష్కరించుకోలేని వివాదం తలెత్తినప్పుడు న్యాయ స్థానాన్ని ఆశ్రయించడం ..చట్టం పై గౌరవముంది  ..న్యాయ స్థానం తీర్పును శిరసావహిస్తాం అనడం రాజ్యాంగం పై ఉన్న విశ్వాసం ..ప్రజాస్వామ్య స్ఫూర్తికి  అడ్డం పడుతుంది. అది సామాన్య పౌరులకు న్యాయ వ్యవస్థ పై ఉన్న అపారమైన విశ్వాసం. ప్రజల చే ఎన్నుకోబడ్డ  శాసన వ్యవస్థ చేసిన చట్టాలను న్యాయ వ్యవస్థ పరిరక్షిస్తుందని, కోర్టులు తప్పుడు తీర్పులు ఇవ్వవనీ  ప్రజల నమ్మకం.  కానీ దేశ అత్యున్నత పదవి లో ఉన్న ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్ పర్సన్ జగదీప్ ధన్ ఖడ్ సుప్రీమ్ కోర్టు రాష్ట్రపతి కి గవర్నర్ పంపిన బిల్లుల పై నిర్ణయానికి  నిర్ణీత గడువు విధించడం పై అభ్యంతరం తెలుపుతూ  ..ఇంకాస్త ముందుకు పోయి న్యాయవ్యవస్థను నేరుగా “న్యూక్లియర్ మిస్సైల్”తో పోల్చడం రాజ్యాంగ వ్యవస్థ పై నమ్మకమున్న వారిని తీవ్ర ఆందోళనకు గురి చేసింది.

భారత రాజ్యాంగ నిర్మాణంలో మూడు ముఖ్యమైన భాగాలు – శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. వీటిలో న్యాయ వ్యవస్థ ఒక స్వతంత్ర స్థంభం. కానీ ఇటీవల ఈ స్థంభంపై  తీవ్ర రాజకీయ దాడి సాగుతోంది. ప్రజల వోట్లతో ఎన్నికైన పార్లమెంటు సభ్యులే న్యాయ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయడం కేవలం వ్యవస్థల మధ్య విభేదం కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి. భారత న్యాయవ్యవస్థను ఇతర వ్యవస్థల నుండి భిన్నంగా ఉండేలా రాజ్యాంగం ఏర్పాటు చేసింది. ముఖ్యంగా సుప్రీం కోర్టు మరియు హైకోర్టులకు ప్రభుత్వ హస్తక్షేపం లేకుండా పనిచేసే స్వేఛ్చ  కల్పించింది. కానీ తాజాగా ఉపరాష్ట్రపతి చేసిన వ్యాఖ్యలు – “సుప్రీంకోర్టు తీసుకున్న కొన్ని తీర్పులు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నాయి” అనే భావన – న్యాయవ్యవస్థను నేరుగా “న్యూక్లియర్ మిస్సైల్”తో పోల్చడం దురదృష్టకరం.

ఒక రాజ్యాంగబద్ధ సంస్థగా ఉన్న సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు ప్రభుత్వ చట్టాలను రాజ్యాంగానికి అనుగుణంగా ఉందో లేదో పర్యవేక్షించాల్సిన బాధ్యత కలిగి ఉంటుంది. కానీ అధికార పార్టీకి చెందిన ఒక  సభ్యుడు  సుప్రీంకోర్టు తీర్పులను “అరాచకత్వానికి” ప్రేరణగా, “మత యుద్ధాన్ని” ప్రారంభించేలా ఉన్నాయని విమర్శించడమంటే ప్రజలను న్యాయవ్యవస్థ మీద నమ్మకాన్ని కోల్పోయేలా చేయడమే. ఇది ప్రభుత్వానికి అనుకూలంగా  తీర్పు రాలేదని న్యాయవ్యవస్థపై ప్రచారం చేయడం తప్ప మరొకటి కాదు.ఈ దాడులలో ముఖ్యంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైనా వ్యక్తిగత దూషణలు మొదలయ్యాయి. ట్రోలింగ్ బృందాల ద్వారా ఆయనను  లక్ష్యంగా చేసుకొని సామాజిక మాధ్యమాల్లో  వ్యక్తిత్వ హననం  చేసే ప్రయత్నం గమనించవొచ్చు. ఇది కేవలం ఒక న్యాయమూర్తిని కాకుండా మొత్తం న్యాయ వ్యవస్థను భయపెట్టే కుట్రగా భావించాలి.

పార్లమెంట్  సభ్యులు దేశ ప్రజల ప్రతినిధులు. వారు న్యాయవ్యవస్థపై మాట్లాడే భాష  బాధ్యతతో ఉండాలి. కానీ ప్రభుత్వం తరఫున మాట్లాడుతూ కొంతమంది సభ్యులు కోర్టులపై అప్రతిష్ట కలిగించేలా వ్యాఖ్యలు చేయడం అనైతికం మాత్రమే కాదు, రాజ్యాంగబద్ధ వ్యవస్థల నిర్వీర్యానికి  దారి తీస్తుంది. ఇలాంటి సందర్భాల్లో  న్యాయవాద సంఘాలు, సీనియర్ న్యాయవాదులు కోర్టును సమర్థించాల్సిన అవసరం ఉంది. కానీ కొందరు మాత్రమే స్పందిస్తూ, మెజారిటీ మౌనంగా ఉండటం తటస్థత కాదు, భయానికి సంకేతం. న్యాయ వ్యవస్థపై దాడి జరిగితే, ప్రజలకు న్యాయ వ్యవస్థ పై ఉన్న విశ్వాసం సన్నగిల్లుతుంది అన్న  దృష్టితో న్యాయ వృత్తిలో ఉన్నవారు ముందుకు రావాల్సిన సమయం ఇది.

ప్రతిపక్షాలు, పౌరసమాజం తరపున కోర్టులు ఇచ్చిన తీర్పులపై న్యాయపూర్వకంగా విశ్లేషణ జరిగితే అది ఆరోగ్యకరం. ప్రభుత్వం చేసిన   చట్టాలపై కోర్టు ప్రశ్నలు వేసిందని కోర్టులే ప్రజాస్వామ్యానికి విఘాతం అని అధికార పార్టీ  వాదించడం  హాస్యాస్పదం. రాజ్యాంగాన్ని రక్షించడమే న్యాయ వ్యవస్థ బాధ్యత – అది అధికార పార్టీ ఆలోచనలు రాజ్యాంగ పరిధిలో లేవని కోర్టులు భావిస్తే  న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా బాధ్యతలు నిర్వహిస్తుందని అర్థం. ప్రభుత్వం చేసిన  చట్టాలను  కోర్టులు ప్రశ్నించకూడదు అన్న   అహంకారం రాజ్యాంగానికి వ్యతిరేకం. ఇది ప్రజా స్వామ్యానికి ముప్పు. ఇంకా ముఖ్యంగా, ట్రోల్ బృందాలు న్యాయమూర్తులపై వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో వారి పరువు తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది గౌరవప్రదమైన న్యాయ వ్యవస్థను కించపరచే కుట్ర.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page