-బాందనీ తలపాగాతో అకట్టుకున్న ప్రధాని
న్యూదిల్లీ,ఆగస్ట్15: 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎరుపు రంగుతో కూడిన సాంప్రదాయ రాజస్థానీ ‘బాంధనీ’ తలపాగాను ధరించి ఆకట్టుకున్నారు. ఈ తలపాగాకు జతగా తెల్లటి కుర్తా, చాక్లెట్ గోధుమరంగు వెస్ట్కోట్ జాకెట్ ధరించారు. దేశభక్తిని చాటేలా జేబులో జాతీయ జెండా రంగులైన కాషాయం, తెలుపు, ఆకుపచ్చతో కూడిన ‘పాకెట్ స్క్వేర్‘ను ప్రత్యేకంగా అలంకరించుకున్నారు. రాజస్థాన్, గుజరాత్లో బాంధనీ వస్త్ర కళకు ప్రత్యేక గుర్తింపు ఉంది. చిన్న చిన్న వస్త్రాలను దారంతో కట్టి (టై-అండ్-డై) రంగులు అద్దే విధానంలో ఈ డిజైన్లు రూపొందుతాయి. ఆ దారాలు తొలగించిన తర్వాత వస్త్రంపై చుక్కలు, ఆకృతులు కనిపిస్తాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మోదీ ధరించే తలపాగాలు ఏటా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. 2025లో ఆయన కాషాయ తలపాగా, తెల్లటి కుర్తాతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
ఒలింపిక్స్లో ప్రతి క్రీడలో భారత భాగస్వామ్యం ఉండాల్సిందే
స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ భారత క్రీడా రంగానికి ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించారు. 2036లో జరిగే ఒలింపిక్స్లో ప్రతి క్రీడలో భారత భాగస్వామ్యం ఉండేలా చూసుకోవాలన్నారు. ఇందులో భాగంగా ప్రతిభ ఉన్న వారిని గుర్తించి వారికి మెరుగైన శిక్షణ, సౌకర్యాలు అందించేందుకు జాతీయస్థాయిలో టాలెంట్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రామ్ను ప్రకటించారు. క్రీడా ప్రపంచంలో భారత్ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటోంది. ప్రపంచవేదికలపై మన జాతీయ గీతాన్ని తరచూ వింటుంటాం. మన మువ్వన్నెల జెండా ఎగరవేయడం చూస్తున్నాం. టాప్స్ గొప్ప విజయాన్ని సాధించింది. ఖేలో ఇండియా గేమ్స్, యూనివర్సిటీ గేమ్స్, బీచ్ గేమ్స్, వింటర్ గేమ్స్, స్పోర్టస్ మెడిసిన్, స్పోర్టస్ న్యూట్రిషన్ ఇలా ఏ రంగంలోనైనా భారతదేశం వేగంగా దూసుకుపోతోంది. 2036లో ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇచ్చేందుకు మనం కూడా పోటీపడుతున్నాం. 2030లో కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇస్తున్నాం. ఒలింపిక్స్లో దాదాపు 40 క్రీడాంశాలు, సుమారు 350 ఈవెంట్లు ఉంటాయి. అయితే చాలా క్రీడల్లో కనీస అర్హత సాధించలేక పోతున్నందున.. మూడింట రెండొంతుల గేమ్స్లో మనం పోటీ కూడా పడలేకపోతున్నాం. 2036లో మనం కనీసం మూడు వంతుల ఈవెంట్లలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాం. టాలెంట్ హంట్తో దేశంలోని ప్రతిచోట నుంచి 5 నుంచి 15 ఏళ్ల వయసు గల ప్రతిభావంతులను గుర్తిస్తాం. వారు ప్రత్యేక శిక్షణ పొందుతారు‘ అని మోదీ వెల్లడించారు.




