- భూపాలపల్లిలో 102 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
- జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల మంజూరు
- జిల్లా దవాఖానలో 650 పడకలు
- ప్రభుత్వ దవాఖానాల్లో నార్మల్ డెలివరీల శాతాన్ని పెంచాలి
- ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు
చిట్యాల (భూపాలపల్లి),ప్రజాతంత్ర, మే 09 : రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ మెరుగైన ఉచిత వైద్య సేవలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు స్పష్టం చేశారు. రూ.102 కోట్లతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో వైద్య శాఖకు సంబంధించి పలు అభివృద్ధి పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అధ్యక్షత వహించగా రాష్ట్ర మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ, మాజీ సభాపతి సిరికొండ మధుసూదనాచారి, వికలాంగుల చైర్మన్ వాసుదేవ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సభలో తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ గ్రామంగా ఉన్న భూపాలపల్లి దినదినాభివృద్ధి చెందుతూ జిల్లా కేంద్రంగా మారిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం వల్లనే భూపాలపల్లికి మహర్దశ వచ్చిందని అన్నారు. మారుమూల ప్రాంతమైన భూపాలపల్లిలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తన వంతు కృషి ఎప్పటికి ఉంటుందని స్పష్టం చేశారు.
వైద్య సేవల అందించడంతోపాటు భూపాలపల్లికి వైద్య కళాశాల కూడా మంజూరు అయిందని వివరించారు. ఈరోజు 102 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరిగాయని, నూతనంగా నిర్మించిన వంద పడకల దవాఖాన కి ప్రారంభోత్సవం జరిగిందని తెలిపారు. ప్రజలు రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని గమనించాలని ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టాలని ని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వైద్య రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, అయితే వైద్యులు, సిబ్బంది తమ పని విధానాన్ని మార్చుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా నార్మల్ డెలివరీల సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలని, ప్రస్తుతం నార్మల్ డెలివరీ ల సంఖ్య 34 శాతం మాత్రమే ఉందని, దాన్ని 70 శాతం వరకు పెంచేందుకు ప్రయత్నించాలని వైద్య సిబ్బందికి సూచనలు చేశారు. కొరోనా కష్టకాలంలో వైద్య సిబ్బంది సేవలు అభినందనీయమని ఈ సందర్భంగా సిబ్బందిని, ఆశావర్కర్లను ఆయన అభినందించారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అల్ట్రాసౌండ్ స్కానింగ్, మెమో గ్రఫీ తో పాటు మెరుగైన వైద్యం ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ప్రభుత్వం 56 రకాల పరీక్షలను ఉచితంగా చేసేందుకు కార్యాచరణ రూపొందించిందని వచ్చే నెలలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారని ఈ సందర్భంగా వివరించారు.
ఎమ్మెల్యే రమణారెడ్డి కోరికమేరకు డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు, 6 కోట్లతో చిన్న పిల్లల కోసం హాస్పిటల్ విభాగాన్ని, ప్రత్యేక వైద్య నిపుణులను ఏర్పాటు చేస్తామనీ అన్నారు. అదేవిధంగా సిటి స్కాన్ తదితర పరీక్షలను కూడా అందుబాటులోకి తీసుకువస్తామని ఈ సందర్భంగా తెలిపారు. వైద్య సిబ్బంది ఆశావర్కర్ల కోరికమేరకు గృహ సముదాయానికి రూ. 20 లక్షల చొప్పున 40 సెంటర్ ను మంజూరు చేస్తున్నట్లు ఎనిమిది కోట్ల రూపాయలు శాంక్షన్ ఇస్తున్నట్లు హరీష్ రావు వివరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పి చైర్ పర్సన్ జక్కు శ్రీ హర్షిని, జిల్లా పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, మాజీ జెడ్పీ చైర్మన్ సాంబారి సల్మా రావు, జిల్లా చెందిన వివిధ మండలాల జెడ్పీటీసీలు,ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, టిఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.