బిఆర్ఎస్ను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేదు
పూర్తి అభద్రతాభావంతో కేసీఆర్ వ్యాఖ్యలు
అక్కసు వెళ్లగక్కేలా ఎల్కతుర్తిలో కెసిఆర్ ప్రసంగం
నేను సిఎం అయిన రెండో రోజే గుండె పగిలిన కెసిఆర్
జానారెడ్డి నివాసంలో సిఎం రేవంత్ రెడ్డి చర్చలు
హైదరాబాద్,ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : తాను సీఎం అయినా రెండో రోజే కేసీఆర్ గుండె పగిలిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో గులాబీ బాస్ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రసంగంలో పసలేదని..
ప్రభుత్వంపై ఆయన అక్కసంతా వెళ్లగక్కారని విమర్శించారు. కేసీఆర్ పదేళ్లలో రాష్ట్ర ఖజానా ఖాలీ చేసి మాపై నిందలు వేస్తున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఎన్ని చెప్పినా.. బీఆర్ఎస్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ అభద్రతాభావంతో మాట్లాడారన్నారు. కేసీఆర్ ప్రసంగంలో స్పష్టతే లేదన్నారు. మా పిల్లలనే అసెంబ్లీలో ఎదుర్కోలేకపోతున్నారని కేసీఆర్ అంటున్నారు.. వాళ్ల పిల్లలు అని తెలిశాక మరీ అసెంబ్లీకి ఎందుకు పంపిస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. మేం కక్ష సాధింపు చర్యలకు దిగమని.. తాను ఇంకో 20 ఏండ్లు రాజకీయాల్లో ఉంటానని తెలిపారు. కేటీఆర్ కేసు అయినా.. ఫోన్ ట్యాపింగ్ కేసు అయినా చట్టపరంగానే ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ మాదిరిగా చట్టానికి వ్యతిరేకంగా కేసులు పెట్టి జైల్లో వేయించమన్నారు. బీఆర్ఎస్ నేతల అరెస్టులపై డిమాండ్లు వొస్తున్నాయని.. కానీ చట్టప్రకారమే నడుచుకుంటామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వొచ్చిన ఏడాదిన్నర పథకాల ప్లానింగ్ కే సరిపోయిందని.. ఇకపై పథకాల గ్రౌండింగ్ పై ఫోకస్ పెడతామని చెప్పారు. కేసీఆర్ మాదిరిగా లాంఛింగ్.. క్లోజింగ్ స్కీములు ఉండవని..
ఏదైనా ఒక పథకం ప్రారంభిస్తే అర్హులకు అందేవరకు పని చేస్తానని అన్నారు. రేవంత్ రెడ్డి చెప్పింది చేస్తాడు అనే నమ్మకం కలిగేలా పనిచేస్తానని పేర్కొన్నారు. ఎల్కతుర్తిలో జరిగిన భారాస రజతోత్సవ సభపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ ప్రసంగంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ప్రసంగం అక్కసుతో కూడుకున్నదని ఆరోపించారు.‘కేసీఆర్ ఖజానాను ఖాలీ చేసి మాపై నిందలు వేస్తున్నారు. బీఆర్ఎస్ను నమ్మే స్థితిలో ప్రజలు లేరు. కేసీఆర్ అభద్రతాభావంతో మాట్లాడారు. ఆయన ప్రసంగంలో స్పష్టత లేదు. రాహుల్గాంధీకి, నాకు గ్యాప్ ఉందనడం అవాస్తవం. రాహుల్కు, నాకు ఉన్న అనుబంధం ప్రపంచానికి చెప్పనవసరం లేదు. అవసరాలను బట్టి కేసీఆర్, మోదీ మాటలు మారుస్తున్నారు. దేశానికి ఇందిరాగాంధీ లాంటి ప్రధాని కావాలని రేవంత్రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లాలి. ఎమ్మెల్యేలు వెళ్తేనే.. ప్రజల్లోకి పథకాలు వెళ్తాయి. పార్టీలో ఓపికగా ఉంటే పదవులు వొస్తాయి.
ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే పార్టీ నేతలే నష్టపోతారని రేవంత్ హెచ్చరించారు. కేసీఆర్ సభకు అవసరమైనన్ని బస్సులు సమకూర్చినప్పటికీ, గతంలో ఖమ్మంలో రాహుల్ గాంధీ సభకు బస్సులు ఇవ్వకపోవడం మోసపూరిత చర్య అని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసుల గురించి రేవంత్ మాట్లాడుతూ.. చట్టం మేరకే చర్యలు తీసుకుంటామని, కేసీఆర్ లాగా నేను చట్టాన్ని అతిక్రమించను అని ఆయన అన్నారు. కేటీఆర్ మీద ఉన్న కేసులు కూడా చట్ట ప్రకారమే సాగిస్తామని స్పష్టం చేశారు. కాగా, అసెంబ్లీ సమావేశాల్లో తాను చేసిన వ్యాఖ్యలే కేసీఆర్ సభలో పునరావృతం చేశారని విమర్శించారు. కొంత మంది అధికారుల పని తీరు తెలిసినా, అవసరంగా ఉన్న కారణంగా వారి సేవలను కొనసాగించాల్సి వొస్తోందన్నారు. కలెక్టర్ల మార్పు వేరే విషయమని, అవసరమైన మార్పులు చేసుకుంటామని వివరించారు. నన్ను నమ్ముకున్న వారిని నేను ఎప్పటికీ మర్చిపోనని, నన్ను నమ్మిన వారిలో ఒకరైన దయాకర్కు ఎమ్మెల్సీ పదవి వొచ్చిందని చెప్పారు. ఓపికగా ఉన్న వారికే తన నుండి బాధ్యతలు వస్తాయని, బయటకి వెళ్లి విమర్శలు చేస్తే తనపై బాధ్యత ఉండదని అన్నారు.