రోహిత్ వేముల చట్టాన్ని రూపొందించండి
కర్ణాటక సిఎం సిద్దరమాయ్యకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ
న్యూదిల్లీ,ఏప్రిల్18: . గతంలో పలు కారణాలతో హెచ్సీయూలో ఆత్మహత్యకు పాల్పడ్డ దళిత విద్యార్థి రోహిత్ వేముల పేరును చాలా కాలం తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రస్తావించారు. విద్యావ్యవస్థలో నేటికి బలహీన వర్గాలు కుల వివక్షను ఎదుర్కొంటున్నాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దళిత విద్యార్థులెవరూ అటువంటి వివక్షను ఎదుర్కోకుండా ఉండాలంటే ‘రోహిత్ వేముల’ చట్టాన్ని రూపొందించాలని.. రాష్ట్రంలో ఈ చట్టాన్ని అమలు చేయాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కు సూచించారు. ఈ మేరకు కర్ణాటక సీఎంకు రాహుల్ గాంధీ లేఖ రాశారు. నేటికి కూడా మన విద్యావ్యవస్థలో దళిత, ఆదివాసీ, ఓబీసీ వర్గాలకు చెందిన లక్షలాది మంది విద్యార్థులు ఇటువంటి వివక్షను ఎదుర్కోవడం సిగ్గుచేటు. వెనుకబడిన వర్గాల బిడ్డగా అంబేడ్కర్ ఎదుర్కొన్న కష్టాన్ని మరే బిడ్డా ఎదుర్కోకుండా చర్యలు తీసుకోవాలి. కొందరు వ్యక్తులు చూపిన వివక్షతో రోహిత్ వేముల, పాయల్ తడ్వి, దర్శన్ సోలంకి వంటి మంచి భవిష్యత్తు ఉన్న యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఇకనైనా ఈ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని రాహుల్ గాంధీ లేఖలో పేర్కొన్నారు. వేముల రోహిత్ 2016లో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్యకు యూనివర్సిటీ అధికారులు, ఇతర విద్యార్థి సంఘాలే కారణమనే ఆందోళనలు సాగాయి.
దేశవ్యాప్తంగా అనేక రాజకీయపార్టీలు స్పందించాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ రెండుసార్లు హైదరాబాద్కు వచ్చి వెళ్లారు. పోలీసులు దర్యాప్తు చేసి 2023 నవంబరులో తుది నివేదిక రూపొందించారు.గతేడాది మార్చి 21న దర్యాప్తు అధికారి ఆ నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు. అతని ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని హైకోర్టుకు పోలీసులు తెలియజేశారు. అలాగే అతను ఎస్సీ అనేందుకు ఎటువంటి ఆధారాలు కూడా లేవని, బీసీ వడ్డెర కులానికి చెందినవాడని పేర్కొన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు పలు పిటిషన్లలో విచారణను ముగించింది.
అనంతరం అధికారంలోకి వొచ్చిన రేవంత్ సర్కార్ ఈ కేసుపై పునఃదర్యాప్తు కొనసాగించాలని ఆదేశించింది. పోలీసులు విచారణ ప్రారంభించారు.ఈ క్రమంలో రాహుల్ కర్నాటక సిఎం సిద్దరామయ్యకు లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. వెనుకబడిన వర్గాల బిడ్డగా అంబేడ్కర్ ఎదుర్కొన్న కష్టాన్ని మరే బిడ్డా ఎదుర్కోకుండా చర్యలు తీసుకోవడానికి సిద్ధరామయ్య కృషి చేస్తారని తాను నమ్ముతున్నట్లు రాహుల్ పేర్కొన్నారు. కొందరు వ్యక్తులు చూపిన వివక్షతో రోహిత్ వేముల, పాయల్ తడ్వి, దర్శన్ సోలంకి వంటి మంచి భవిష్యత్తు ఉన్న ఎందరో యువకులు ప్రాణాలు కోల్పోయారని.. ఇకనైనా ఇటువంటి హత్యలకు ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైందని రాహుల్ అన్నారు.