వెంకటాపూర్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18: ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న భూ సమస్యలకు భూ భారతితో చెక్ పడనుందని, రైతుల కళ్లలో ఆనందం చూడటానికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నూతన చట్టాన్ని తీసుకొచ్చిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గత పాలకులు కుట్ర పూరితంగా పార్ట్ -బి లో పెట్టిన 18 లక్షల ఎకరాలలో ఆరు నుంచి ఏడు లక్షల వరకు వ్యవసాయ భూములు ఉన్నాయని ఈ భూములకు ఈ భూభారతి చట్టంతో పరిష్కారం చూపిస్తామని స్పష్టం చేశారు. భూ భారతి పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ఎంపిక చేసిన ములుగు జిల్లా వెంకటాపుర్ మండలంలో నూతన చట్టాలను మంత్రులు ధనసరి సీతక్క, కొండా సురేఖ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రైతులను నట్టేట ముంచిన ధరణిని బంగాళాఖాతంలో కలిపి ప్రజలకు, రైతులకు అన్ని విధాలా మేలు చేసే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామన్నారు.
భూ సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, ఇకపై రైతులు భూ సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే చెప్పులు అరిగేలా అధికారుల చుట్టూ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇంతవరకు డాక్యుమెంట్లు లేని అబాదీ ఇల్లు అని పిలుచుకునే నివాస గృహాలకు డాక్యుమెంట్లు ఇచ్చే దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. భూ భారతి సమస్యల పరిష్కారానికి గాను తమ కార్యాలయం, సిసిఎల్ఎ కార్యాలయంను అనుసంధానించే టోల్ ఫ్రీ నెంబరును త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. గిరిజన, గిరిజనేతరులు ఉండే ప్రాంతంలో భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఒక కమిటీని నియమిస్తామని మంత్రి వెల్లడించారు. ఆర్వోఆర్ చట్టాన్ని మళ్లీ తీసుకొచ్చి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న 9.24 వేల లక్షల దరఖాస్తులను పరిష్కరిస్తామన్నారు. అదే విధంగా ధరణి పార్ట్ బి లో ఉన్న ఆరు నుంచి ఆరున్నర లక్షల ఎకరాల పేదవారి భూములకు భూభారతి 2025 చట్టం ద్వారా పరిష్కారం దొరుకుతుందని తెలిపారు.
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
పేదల సంక్షేమ ధ్యేయంగా రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని, తల్లి బిడ్డకు ఎలాంటి సంబంధం ఉంటుందో అదే తరహాలో భూమికి రైతుకు సంబంధం ఉంటుందని మంత్రి సీతక్క అన్నారు. గత ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకొచ్చి రైతులు ఆత్మహత్యలకు కారకులు అయ్యారని, నేడు రైతుల భూ సమస్యను పరిష్కరించడానికి సీఎం ఏనుముల రేవంత్ రెడ్డి భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చారని అన్నారు. కాస్తూలో ఉన్న నిజమైన రైతులకు భూమి హక్కు పత్రాలు కల్పించాలని ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు పోతున్నదని, భూమి రైతుకు ఆదాయం బలమని అన్నారు. ధరణి పేరుతో గత పాలకులు రైతులను దగా చేశారని, అధికారులను బెదిరించి గత ప్రభుత్వ నాయకులు అక్రమంగా వందల ఎకరాల భూములు వారి పేరు మీద నమోదు చేసుకొని కోట్లాది రూపాయల రైతుబంధు దిగమింగారిని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దలారులను నమ్మి మోసపోవద్దు..
రైతులందరికీ తల్లి లాంటి భూభారతి చట్టాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేశారని, రైతులు ఎవరు మధ్యవర్తుల మాటలు నమ్మి మోసపోవద్దు అని మంత్రి కొండ సురేఖ అన్నారు. స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అన్నారు. రైతును రాజు చేయాలనే ఉద్దేశంతోనే ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుందని పేర్కొన్నారు.చట్టాల అమలులో అధికారుల పాత్ర కీలకంగా ఉంటుందని అన్నారు. తప్పులు చేసే అధికారులపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, ప్రిన్సిపాల్ సెక్రటరీ ఫైనాన్స్ రామకృష్ణ రావు, భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, వర్ధన్నపేట శాసన సభ్యులు నాగరాజు, ప్రిన్సిపాల్ సెక్రటరీ సిసిఎల్ఏ రెవెన్యూ బుద్ధ ప్రకాష్, జిల్లా కలెక్టర్ దివాకర్, ఏ ఎస్ పి శివం ఉపాధ్యాయ, అదనపు కలెక్టర్ రెవెన్యూ సి హెచ్ మహేందర్ జి, డి ఎఫ్ ఓ రాహూల్ కిషన్ జాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, రెవెన్యూ సదస్సుల ప్రత్యేక అధికారి కిరణ్ ప్రకాష్, ఆర్ డి ఓ వెంకటేష్, జిల్లా అధికారులు, మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు, సాస్కృతిక కళాకారులు, రైతులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం నాడు ములుగు జిల్లా వెంకటాపూర్ లో మంత్రులు కొండ సురేఖ, సీతక్కతో కలిసి భూభారతి పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి . తర్వాత ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం పుసాయ్ గ్రామంలో భూభారతి చట్టంపై జరిగిన అవగాహన కార్యక్రమంలో మంత్రిగారు పాల్గొని ప్రసంగించారు