త్వరలో కల సాకారం కాబోతున్నది

మహిళా బిల్లుకు బిఆర్‌ఎస్‌ ‌సంపూర్ణ మద్దతిస్తుందన్న ఎంఎల్‌సి కవిత

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 19 : అధికారంలో సగం కావాలన్న మహిళల కల సాకారం కాబోతున్నదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక బీఆర్‌ఎస్‌ ‌కృషి ఉందన్నారు. మహిళా బిల్లుకు బీఆర్‌ఎస్‌ ‌సంపూర్ణ మద్దతు ఇస్తుందని సామాజిక మాధ్యమం ఎక్స్(‌ట్విట్టర్‌) ‌వేదికగా వెల్లడించారు. మహిళా రిజర్వేషన్‌కు సంబంధించి కేంద్ర కేబినెట్‌ ఒక మంచి నిర్ణయం తీసుకుందన్నారు. కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని సాగతిస్తున్నామని చెప్పారు. అధికారంలో సగం కావాలన్న మహిళ కల సాకారం కాబోతున్నదని, ఇది దేశంలోని ప్రతిఒక్క మహిళ విజయమన్నారు.

దేశ పౌరులందరికీ ఈ సందర్భంగా కవిత శుభాకాంక్షలు తెలిపారు. 2014లో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే అసెంబ్లీలో 33 శాతం మహిళా రిజర్వేషన్‌, ఓబీసీ రిజర్వేషన్లను ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపిందన్నారు. తొమ్మిదేండ్ల జాప్యం తర్వాత మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లుపై కేంద్రం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే ఓబీసీ, మహిళా రిజర్వేషన్లపై ప్రధాని మోదీకి లేఖలు రాశారని గుర్తుచేశారు. లోక్‌సభలో అధికార పార్టీకి పూర్తిస్థాయి మెజారీటీ ఉండటంతో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఈ బిల్లును ఆమోదించేలా చూడాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *