ఎనిమిదేళ్లలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ

  • కళ్లముందే ఎన్నో ఘన విజయాలు
  • వార్షిక వృద్ధి రేటులో అగ్రస్థానంలో..
  • జాతీయం కంటే 86 శాతం అధికంగా రాష్ట్ర తలసరి ఆదాయం
  • నాడు దండుగ నుంచి నేడు పండుగగా వ్యవసాయం
  • సామాజిక ఉద్యమంగా దళితబంధు
  • ఉచితంగా డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లు
  • విద్యారంగ వికాసం కోసం గురుకుల విద్య
  • ఆరోగ్య రంగంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట
  • భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలు
  • వృత్తులకు ప్రోత్సాహం
  • మైనారిటీల సంక్షేమానికి కృషి
  • సంస్కరణలతో పాలన పరుగులు
  • పారిశ్రామిక వేత్తలకు స్వర్గధామంగా రాష్ట్రం
  • ప్రతి గ్రామంలో ‘తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం’
  • కేంద్రం వివక్షపై నిరంతర పోరాటం
  • విద్వేష రాజకీయాలతో దేశం విలవిలలాడుతున్నది
  • మత పిచ్చి తప్ప వేరే చర్చ లేదు
  • రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సిఎం కెసిఆర్‌
image.png
image.png
image.png
‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,  జూన్‌ 2 : 75 ‌సంవత్సరాలలో దేశంలో ఏ రాష్ట్రం సాధించని విజయాలను ఎనిమిదేళ్లలో తెలంగాణ సాధించిందని,ఈ స్వల్పకాలంలో రాష్ట్రం సాధించిన ప్రగతిని విశ్లేషించుకుంటే సాధించిన ఘన విజయాలెన్నో కళ్ళముందు సాక్షాత్కరిస్తాయని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ ‌రావు అన్నారు. ప్రతీ విషయంలో రాష్ట్రం అవతరించే నాటికి, నేటి స్థితిగతులకు అసలు పోలికే లేదన్నది జగమెరిగిన సత్యమని, ఆర్థికవృద్ధిలో, తలసరి ఆదాయం పెరుగుదలలో, విద్యుత్తు సరఫరాలో, తాగునీరు సాగునీటి సదుపాయంలో, ప్రజా సంక్షేమంలో, పారిశ్రామిక ఐటి రంగాల ప్రగతిలో ఇలా అనేక రంగాలలో మన రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలవడం మనందరికీ గర్వకారణమని తెలిపారు. గురువారం పబ్లిక్‌ ‌గార్డెన్స్‌లో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో ఆయన మాట్లాడుతూ.. అస్తిత్వం కోసం 60 సంవత్సరాలు పోరాడిన తెలంగాణ నేడు అభివృద్ధిలో శిఖరాగ్రానికి చేరి ప్రపంచం ముందు సగర్వంగా నిలిచిందని అన్నారు. 2014 నుంచి 2019 వరకు 17.24 శాతం సగటు వార్షిక వృద్ధిరేటుతో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో నిలిచిందని, ఎన్ని అవరోధాలు ఎదురైనా, కొరోనావంటి విపత్తులు తలెత్తుతున్నా రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకుపోతుందని అన్నారు. కొరోనా సృష్టించిన సంక్షోభం నుంచి అతి త్వరగా   తెలంగాణ కోలుకున్నదని భారత ఆర్థిక సర్వే 2020-21 అభినందించడం తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణా దక్షతకు దక్కిన గుర్తింపని అన్నారు. 2013-14లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు రాష్ట్ర జీఎస్‌డిపి,  5 లక్షల 5 వేల 849 కోట్ల రూపాయలు కాగా, 2021-22 నాటికి 11 లక్షల 54 వేల 860 కోట్ల రూపాయలకు చేరిందని, పెరిగిన ఆదాయంలో ప్రతి  పైసా సద్వినియోగం అయ్యే విధంగా ప్రభుత్వం జాగ్రత్తగా, ప్రణాళికాబద్ధంగా పెట్టుబడి వ్యయం చేస్తున్నదని అన్నారు.
రాష్ట్ర తలసరి ఆదాయం 2014-15లో1 లక్షా 24 వేల 104 రూపాయలు కాగా, 2021-22 నాటికి 2 లక్షల 78 వేల 833 రూపాయలకు పెరిగిందని, జాతీయ సగటు ఆదాయమైన 1 లక్ష 49 వేల 848 రూపాయలకంటే ఇది 86 శాతం అధికమని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాడున్న కరెంటు కష్టాలకు చరమగీతం పాడి ఈనాడు అన్ని రంగాలకూ నిరంతరాయంగా, రైతులకు ఉచితంగా, 24 గంటలూ నాణ్యమైన విద్యుత్‌ ‌సరఫరా చేస్తున్న దేశంలోని ఏకైక రాష్ట్రమని చెప్పడానికి తాను గర్విస్తున్నానని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రం ఏర్పడిన నాడు విద్యుత్‌ ‌కోతలతో, పవర్‌ ‌హాలిడేలతో ఉక్కిరిబిక్కిరైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడేనాటికి ఉన్న స్థాపిత విద్యుత్‌ ‌సామర్థ్యం కేవలం 7,778 మెగావాట్లు అయితే..నేడు ప్రభుత్వం చేసిన కృషి ఫలితంగా నేడు మన రాష్ట్రం కలిగి ఉన్న స్థాపిత విద్యుత్‌ ‌సామర్థ్యం 17,305 మెగావాట్లకు పెరిగిందని, సోలార్‌ ‌విద్యుదుత్పత్తిలో రాష్ట్రం గత ఎనిమిదేళ్ళలో 74 మెగావాట్ల నుండి 4,478 మెగావాట్ల రికార్డు స్థాయి పెరుగుదల సాధించిందని, తలసరి విద్యుత్‌ ‌వినియోగంలో దేశంలోని పెద్ద రాష్ట్రాలలో తెలంగాణ ప్రథమస్థానంలో నిలిచిందని సిఎం అన్నారు. తాగునీటి కోసం పల్లెలు తల్లడిల్లిన స్థితి, నల్లగొండ జిల్లాను ఫ్లోరైడ్‌ ‌భూతం పట్టి పీడించే స్థితిని అధిగమించడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వెనువెంటనే తాగునీటి సమస్య పరిష్కారానికి యుద్ధప్రాతిపదికపై మిషన్‌ ‌భగీరథ పథకాన్ని ప్రారంభించి నేడు రాష్ట్రంలోని 100 శాతం ఆవాసాలలో ఇంటింటికీ స్వచ్ఛమైన, సురక్షితమైన మంచినీరు సరఫరా కావడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడా మంచినీరు దొరకని ప్రాంతం లేదని, నీటికోసం బిందెలతో మహిళలు బారులుతీరిన దృశ్యాలు లేవని, మంచినీటి యుద్ధాలు లేవని, ప్రజల దాహార్తి తీర్చాలన్న ప్రభుత్వ అంకిత భావానికి ఇది ప్రబల నిదర్శనమని కెసిఆర్‌ ‌తెలిపారు.
వ్యవసాయం నేడు పండుగ
సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయ రంగం కుదేలైపోయిందని, సాగునీరు లేక బోర్లపై ఆధారపడదామంటే కరెంటు ఉండేది కాదని, పెట్టుబడికి రైతులు అష్టకష్టాలు పడేవారని, అందుకే, స్వరాష్ట్ర సాధన అనంతరం వ్యవసాయరంగంపైనా, రైతుల సంక్షేమంపైన తాను ప్రత్యేక దృష్టిని సారించానని, రైతు సంక్షేమం కోసం అనేక సంస్కరణలు, పథకాలూ అమలులోకి తేవటంతో నేడు మన రాష్ట్రం ‘సజల సుజల సస్యశ్యామల తెలంగాణ’ గా మారిందని సిఎం కెసిఆర్‌ అన్నారు. రైతన్నల రుణభారం తగ్గించడానికి రైతురుణ మాఫీ, 24 గంటల ఉచిత విద్యుత్తు, మిషన్‌ ‌కాకతీయతో చెరువుల పునరుద్ధరణ, సకాలంలో ఎరువులు, విత్తనాల పంపిణీ, కల్తీ విత్తనాల నియంత్రణ కోసం కఠిన చర్యలు తీసుకోవటం, ప్రతీ ఐదువేల ఎకరాలను ఒక వ్యవసాయ క్లస్టర్‌గా విభజించి వ్యవసాయ విస్తరణాధికారులను నియమించటం, రైతువేదికల నిర్మాణం, పంటకల్లాల నిర్మాణం, రైతుబంధు సమితిల ఏర్పాటు, పంటకాలంలో పెట్టుబడి సాయం కోసం రైతుబంధు, విధివశాత్తూ  అసువులు బాసిన రైతుల  కుటుంబాల్ని ఆదుకునేందుకు  రైతుబీమా, ప్రాజెక్టులు  నిర్మించి  సమృద్ధిగా సాగునీరు అందించడం, నీటి తీరువా బకాయిల రద్దు చేయటం, ప్రాజెక్టుల ద్వారా ఉచితంగా సాగునీటి సరఫరా చేయటం ద్వారా నేడు వ్యవసాయం దండుగ కాదు, పండుగ అని నిరూపించగలిగామని అన్నారు.
75 ఏళ్ళ స్వతంత్ర భారతదేశ చరిత్రలో 50 వేల కోట్ల రూపాయలు రైతులకు పంట పెట్టుబడిగా అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, దేశంలో మరే రాష్ట్రంలోనూ  రైతన్నలకు ఇంతటి సౌకర్యాలు లేనేలేవంటే అతిశయోక్తి కాదని,  నేడు ఇతర రాష్ట్రాలు కూడా మన పథకాలను ఆదర్శంగా తీసుకుంటున్నాయని అన్నారు.  కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం  దేశ చరిత్రలోనే ఒక అపూర్వఘట్టం. కేవలం మూడేళ్ళలో ఈ ప్రాజెక్టును  పూర్తిచేసి ప్రపంచాన్ని నివ్వెరపరిచామని, చైనా వంటి దేశాల్లో మాత్రమే సాధ్యమనుకునే వేగంతో ప్రపంచంలో అతిపెద్దదైన ఎత్తిపోతల ప్రాజెక్టును రికార్డు సమయంలో నిర్మించుకున్నామని, ఈ ప్రాజెక్టులో భాగమైన అన్నపూర్ణ, రంగనాయక సాగర్‌, ‌మల్లన్న సాగర్‌, ‌కొండపోచమ్మ సాగర్‌ ‌రిజర్వాయర్ల నిర్మాణంతో ఆయా ప్రాంతాలకు సమృద్ధిగా  సాగునీరు లభిస్తుందని, బస్వాపూర్‌ ‌రిజర్వాయర్‌ ‌నిర్మాణ పనులు చివరిదశకు చేరుకున్నాయని, ప్రపంచంలోని ఎత్తిపోతల ప్రాజెక్టుల్లో అతిపెద్దదైన రిజర్వాయర్‌ ‌మల్లన్న సాగర్‌ ‌ద్వారా కొమురవెల్లి మల్లన్న పాదాలు అభిషేకించి మొక్కు తీర్చుకున్నామని సిఎం కెసిఆర్‌ ‌తెలిపారు. రాష్ట్రంలో 2014 నాటికి 20 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీటి సౌకర్యం ఉండేదని, 2021 నాటికి ప్రభుత్వం 85.89 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించిందని తెలిపారు.
సామాజిక ఉద్యమంగా దళితబంధు
దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో దళితబంధు పథకాన్ని ఒక సామాజిక ఉద్యమంగా అమలు పరుచుకుంటున్నామని, దళితులను ఆర్థికంగా బలోపేతంచేసి, సామాజిక వివక్ష నుంచి వారికి విముక్తి కల్గించాలని, దళితులంతా స్వశక్తితో, స్వావలంబనతో జీవించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని,  ఆ లక్ష్య సాధనకోసం తానే స్వయంగా దళితబంధు పథకానికి రూపకల్పన చేశానని, ఈ పథకం కింద ప్రభుత్వం ప్రతి దళిత కుటుంబానికి రుణం కాకుండా తిరిగి చెల్లించే పనిలేకుండా, పూర్తి గ్రాంటుగా, ప్రభుత్వం 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నదని, ప్రభుత్వం ఇచ్చిన పెట్టుబడితో తమకు నచ్చిన, తమకు వొచ్చిన పనిని లబ్దిదారుడు స్వేచ్ఛగా ఎంచుకోవచని తెలిపారు. దళితబంధు పథకం ద్వారా అందించే ఆర్థిక సాయానికి అదనంగా ప్రభుత్వం లబ్ధిదారుల భాగస్వామ్యంతో ‘దళిత రక్షణ నిధి’ కూడా ఏర్పాటు చేస్తున్నదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరికీ దశలవారీగా దళితబంధు ప్రయోజనాన్ని ప్రభుత్వం అందజేస్తుందని, ఈ ఏడాది దళితబంధు అమలు కోసం బడ్జెట్‌లో 17,700 కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు.
ఉచితంగా డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లు
దేశంలో  పేదలకు డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లు పూర్తిగా ఉచితంగా నిర్మించి ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, ప్రభుత్వం ఇప్పటివరకు 2 లక్షల 91 వేల ఇండ్లు మంజూరు చేసిందని, ఇందుకోసం 19,126 కోట్ల రూపాయలు కేటాయించిందని, స్వంత స్థలం కలిగిన వారికి డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌టి నిర్మాణానికి దశలవారీగా 3 లక్షల రూపాయలు మంజూరు చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని, ఇది నిరంతర పక్రియ అని, చివరి లబ్ధిదారునికి అందే వరకూ ఈ పథకం అమలవుతుందని సిఎం తెలిపారు.
విద్యారంగ వికాసం కోసం గురుకుల విద్య
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ వికాసం కోసం మొదటిదశలో గురుకుల విద్యకు ప్రాధాన్యత ఇచ్చిందని, దేశంలో అత్యధికంగా 978 గురుకుల విద్యాలయాలు  కలిగిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే విధంగా విద్యార్థినీ, విద్యార్థులకు సమగ్ర శిక్షణనిస్తూ ఈ గురుకులాలు అత్యుత్తమ ఫలితాలను సాధిస్తున్నాయని సిఎం కెసిఆర్‌ ‌తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ ‌పాఠశాలలకు దీటుగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ‘‘మన ఊరు-మన బడి’’ అనే బృహత్తర కార్యక్రమానికి నాంది పలికిందని, వర్తమాన కాల అవసరాలకు తగినట్టుగా పాఠశాలల్లో  అధునాతన మౌలిక వసతుల కల్పనను పెద్దఎత్తున చేపట్టిందని, రాష్ట్రవ్యాప్తంగా 7,289 కోట్ల రూపాయల వ్యయంతో దశలవారీగా అన్ని పాఠశాలల్లో అభివృద్ధిపనులు చేపడతున్నదని, మొదటి దశలో మండలాన్ని యూనిట్‌గా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా 9,123 పాఠశాలల్లో 3,497 కోట్ల రూపాయల వ్యయంతో కార్యాచరణ ప్రారంభించిందని తెలిపారు. ఉన్నత విద్యలో మహిళలు ముందుండాలనే భావనతో రాష్ట్రంలో మొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేస్తున్నదని, రాష్ట్రంలో కొత్తగా అటవీ విశ్వవిద్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు కెసిఆర్‌.
ఆరోగ్య రంగంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట
ప్రజల ఆరోగ్య పరిరక్షణకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో కృషిచేస్తుందని, ప్రజావైద్యం, ఆరోగ్య రంగాలలో రోజురోజుకూ గుణాత్మక పురోగతిని సాధిస్తుందని, నిరుపేదలకు కూడా మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి తేవాలన్న దృఢసంకల్పంతో ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని, ముందుగా ప్రభుత్వ హాస్పటిళ్ళలో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచిందని,  అధునాతన వైద్యపరికరాలు సమకూర్చిందని, 57 వైద్యపరీక్షలు ఉచితంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతి జిల్లాలో డయాగ్నోస్టిక్‌ ‌కేంద్రాలు ఏర్పాటు చేసిందని, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడేవారి కోసం 42 ఉచిత డయాలసిస్‌ ‌సెంటర్లను ఏర్పాటుచేసిందని, దేశంలో మరే రాష్ట్రం చేయని విధంగా రాష్ట్రం లోని అన్ని బెడ్స్‌ను ఆక్సీజన్‌ ‌బెడ్స్‌గా మార్చిందని, వివిధ హాస్పిటళ్లలో హార్ట్ ‌సర్జరీల కోసం  క్యాథ్‌ ‌ల్యాబ్‌ ‌సేవలు కూడా అందుబాటులోకి తెచ్చిందని, నేడు ప్రభుత్వ హాస్పిటళ్లలో మోకీలు మార్పిడి ఆపరేషన్లు సైతం చేస్తున్నారని, ఉత్తమ వైద్యసేవలతోపాటు రోగులకు మంచి పౌష్టికాహారం అందించడానికీ, పారిశుధ్య ప్రమాణాలు పెంచడానికి  బడ్జెట్‌ ‌కేటాయింపులు కూడా పెంచిందని, ప్రభుత్వం జిహెచ్‌ఎం‌సి పరిధిలోని 18 ప్రభుత్వ దవాఖానాలలో రోగుల సహాయకులకు కూడా ఐదు రూపాయలకే భోజనం అందజేస్తున్నదని సిఎం కెసిఆర్‌ ‌తెలిపారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో ప్రసవాల సంఖ్యను పెంచడంలోనూ తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచిందని అన్నారు. ప్రభుత్వం హైదరాబాద్‌ ‌బస్తీలలో నివసించే  పేదల సమీపంలోకి వైద్యసేవలను అందుబాటులోకి తెస్తూ ఇందుకోసం 350 బస్తీ దవాఖానాలను మంజూరు చేసిందని, వీటిలో 256 దవాఖానాలు ఇప్పటికే సేవలందిస్తున్నాయని, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మరో 60 బస్తీదవాఖానాలను కొత్తగా ప్రారంభించబోతున్నదని, బస్తీ దవాఖానాలు ఇచ్చిన స్ఫూర్తితో  గ్రామాలలో ప్రాథమిక వైద్య సేవలను అందించడం కోసం ప్రభుత్వం పల్లె దవాఖానాలను ఏర్పాటుచేస్తున్నదని తెలిపారు. నగరవాసులతో పాటూ ఇరుగుపొరుగు జిల్లాల ప్రజలకు కూడా అందుబాటులో ఉండేవిధంగా తెలంగాణ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ‌మెడికల్‌ ‌సైన్సెస్‌(‌టిమ్స్) ఆధ్వర్యంలో  హైదరాబాద్‌ ‌నగరం నాలుగుచెరగులా నాలుగు సూపర్‌ ‌స్పెషాలిటీ హాస్పిటళ్లనును ప్రభుత్వం  నిర్మిస్తున్నదని,  వరంగల్‌ ‌లో హెల్త్ ‌సిటీ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇప్పటికే కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిందని, వరంగల్‌ ‌నగరంలో అధునాతన వసతులతో రెండువేల పడకలతో సూపర్‌ ‌స్పెషాలిటీ హాస్పిటల్‌ ‌నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని సిఎం కెసిఆర్‌ ‌తెలిపారు. జిల్లాకి ఒక వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని, రాగల రెండేళ్లలో ఈ లక్ష్యం నేరవేరనుందని తెలిపారు. రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్య వివరాలు, డయాగ్నస్టిక్‌ ‌సెంటర్ల వివరాలు, పరీక్షల వివరాలు తమ మొబైల్‌ ‌ఫోన్లలో చూసుకొనే  విధంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ డయాగ్నస్టిక్‌ ‌మొబైల్‌ ‌యాప్‌ ‌ను అందుబాటులోకి తీసుకు వొచ్చిందని తెలిపారు.
భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలు
నీళ్ళు, నిధులు, నియామకాలు నినాదంగార్సడిన రాష్ట్రంలో మన నిధులు మనకే దక్కుతున్నాయని, రాష్ట్రం అవసరాలకు తగ్గట్టుగా ప్రాజెక్టులు నిర్మించుకుంటున్నామని, గడిచిన ఎనిమిదేళ్ళలో 1 లక్షా 33 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసుకున్నామని సిఎం కెసిఆర్‌ ‌వివరించారు. ప్రస్తుతం రాష్టప్రభుత్వం వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 91,142 ఉద్యోగాలను ఒకేసారి భర్తీచేస్తున్నదని, రాష్ట్రంలో ఇప్పటికే దీర్ఘకాలంగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న 11,103 మంది ఉద్యోగుల సేవలను మానవతా దృష్టితో క్రమబద్ధీకరించి, ఇంకా ఖాళీగా ఉన్న 80,039 ఉద్యోగాలను కొత్తవారితో భర్తీ చేస్తున్నదని తెలిపారు. ఇప్పటికే వివిధ శాఖలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల జారీ కూడా ప్రారంభమైందని, ఉద్యోగార్థులు అన్ని నియామక పరీక్షలలో పోటీపడేందుకు వీలుగా మధ్యమధ్యలో తగిన వ్యవధి ఇస్తూ నోటిఫికేషన్లు విడుదల చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించిందని, స్థానిక అభ్యర్థులకు సంపూర్ణంగా న్యాయం జరగడానికి కావల్సిన పటిష్టమైన వ్యవస్థను, విధానాన్ని ప్రభుత్వం  రూపొందించి అమలుచేస్తున్నదని సిఎం తెలిపారు.
వృత్తులకు ప్రోత్సాహం
సమైక్యపాలనలో ధ్వంసమైన వృత్తులకు ప్రభుత్వం ఆర్థిక ప్రేరణనిచ్చి ఆదుకుంటున్నదని, మత్స్యకారుల కోసం ఉచితంగా చేప పిల్లల పంపిణీ  చేస్తున్నదని, గొల్ల కుర్మల సంక్షేమం కోసం భారీ ఎత్తున చేపట్టిన గొర్రెల పంపిణీ సత్ఫలితాలనిచ్చిందని, గౌడ సోదరుల సంక్షేమం కోసం ప్రభుత్వం తాటి చెట్లపై పాత పన్ను బకాయిలు మాఫీ చేయడమే కాకుండా, శాశ్వతంగా  చెట్ల పన్ను రద్దు చేసిందని, మరణించిన లేదా అంగవైకల్యానికి గురైన గీత కార్మికులకు  ఇచ్చే పరిహారాన్ని తెలంగాణ ప్రభుత్వం 50 వేల నుండి 5 లక్షల రూపాయలకు పెంచిందని, తాటిచెట్ల నుంచి ఉత్పత్తి అయ్యే నీరాను సాఫ్ట్ ‌డ్రింక్‌గా ప్రవేశపెట్టడం కోసం ప్రభుత్వం ప్రత్యేక పాలసీని అమలుచేస్త్తుందని, దోబీఘాట్లకు, లాండ్రీలకు, సెలూన్లకు ప్రభుత్వం 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందిస్తున్నదని, నేత కార్మికులకు బతుకమ్మ చీరల  తయారీ పనిని అప్పగించటంతోపాటూ నూలు, రసాయనాలపై 50 శాతం సబ్సిడీ ఇస్తున్నదని, వివిధ వృత్తులకు ప్రత్యేక ప్రేరణనిస్తూ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ఆయా వర్గాలవారి ఆదాయం గణనీయంగా పెరగడం తనకు సంతోషాన్నిస్తున్నదని సిఎం అన్నారు.
మైనారిటీల సంక్షేమం
తెలంగాణ ప్రాంతం సర్వమతాల, సంస్కృతుల సంగమస్థానమని, ప్రభుత్వం సకలమతాలను సమభావంతో ఆదరిస్తున్నదని, తెలంగాణా గంగా జమునా తెహజీబ్‌ ‌ను కొనసాగిస్తున్నదని, రాష్ట్రం ఏర్పడేనాటికి తెలంగాణ ప్రాంతంలో ఉన్న మైనారిటీ గురుకులాల సంఖ్య కేవలం 12 మాత్రమేనని, ప్రభుత్వం కొత్తగా 192 మైనారిటీ గురుకులాలను ఏర్పాటుచేసిందని, మైనారిటీ బాలికల కోసం 50 శాతం గురుకులాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిందని, దీనివల్ల మైనారిటీ బాలికల ఎన్‌ ‌రోల్‌ ‌మెంట్‌ ‌గతంలో 18 శాతంగా ఉంటే, నేడది 42 శాతానికి పెరిగిందని, బతుకమ్మ బోనాలు, రంజాన్‌, ‌క్రిస్మస్‌ ‌వంటి పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్నది. సకల జనులలో సంతోషాన్ని నింపుతున్నదని సిఎం అన్నారు.
సంస్కరణలతో పాలన పరుగులు
తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం పరిపాలన అవసరాలకు తగిన విధంగా ప్రభుత్వం వివిధ సంస్కరణలు చేపట్టిందని, ఈ సంస్కరణల ఫలితంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా అమలవుతున్నాయని సిఎం తెలిపారు. భూ రికార్డుల్లో పారదర్శకత కోసం ధరణి పోర్టల్‌,  ‌రాష్ట్రాన్ని 33 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించడం, ‘‘మా గూడెంలో మా పాలన-మా తండాలో మా పాలన’’, 30 జిల్లాల్లో అన్ని హంగులతో అధునాతన వసతులతో సమీకృత కలెక్టర్‌ ‌కార్యాలయాలను నిర్మాణం, శాసనసభ్యుల కోసం క్యాంపు కార్యాలయాల నిర్మాణం, రాష్ట్ర గౌరవాన్ని ప్రతిబింబించే విధంగా నూతన సచివాలయ భవన నిర్మాణం, పంచ నారసింహ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన యాదాద్రి క్షేత్రాన్ని అత్యంత రమ్యంగా, వైభవంగా తీర్చిదిద్దుకోవడం,   ప్రాజెక్టుల పరిధిలో ఉన్న జలాశయాలన్నింటినీ అద్భుతంగా తీర్చిదిద్దుతూ, పర్యాటకులకు సకల సౌకర్యాలు కల్పించడం వంటి అంశాలతో రాష్ట్రం ముందుకు పోతున్నదని సిఎం వివరించారు.
పారిశ్రామిక వేత్తలకు స్వర్గధామంగా రాష్ట్రం
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి, ప్రభుత్వం ఏర్పడిన తరువాత హైదరాబాద్‌ ‌మహానగరం బ్రాండ్‌ ఇమేజ్‌ ‌మరింతగా పెరిగిపోయిందని, అతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని, పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన టిఎస్‌ ఐపాస్‌ ‌చట్టం, నిరంతర విద్యుత్తు, నీటి సరఫరా, రాష్ట్రంలో పరిఢవిల్లుతున్న శాంతిభద్రతలు, సుస్థిర ప్రభుత్వం,  పారిశ్రామికవేత్తలకు అందిస్తున్న ప్రోత్సాహంతో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని, పారిశ్రామిక రంగంలో  ఈ ఎనిమిదేళ్ళలో మొత్తం 2 లక్షల 32 వేల 111 కోట్ల రూపాయల పెట్టుబడులు తరలి వచ్చాయి. 16 లక్షల 48 వేల 956 ఉద్యోగాల కల్పన జరిగిందని సిఎం కెసిఆర్‌ ‌తెలిపారు. ప్రపంచ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, ‌గూగుల్‌, ‌యాపిల్‌, ఐ.‌బి.ఎం, కాగ్నిజెంట్‌, అమేజాన్‌, ఒరాకిల్‌ ‌వంటి అనేక సంస్థలు హైదరాబాద్‌ ‌నుంచి తమ కార్యకలాపాలు  కొనసాగిస్తున్నాయని, తెలంగాణ ఐటి రంగ ఎగుమతుల విలువ 1 లక్షా 83 వేల  569 కోట్ల రూపాయలు కావడం గమనార్హమని అన్నారు.
ప్రతి గ్రామంలో ‘తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం’
పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను రూపొందించి అమలుపరచడం ద్వారా మన పల్లెలు, పట్టణాల రూపురేఖలే మారిపోయాయనడంలో అతిశయోక్తి లేదని, దేశంలోని ఏ రాష్ట్రంలో జరగని విధంగా గ్రామీణ, పట్టణాభివృద్ధి తెలంగాణలో జరిగిందని, గ్రామీణ స్థానిక సంస్థల నిర్వహణ కోసం ప్రభుత్వం  ప్రతి నెలా 256 కోట్ల 66 లక్షల రూపాయల నిధులు నేరుగా విడుదల చేస్తున్నదని, ప్రతీ గ్రామ పంచాయతీకి ట్రాక్టర్‌, ‌ట్రాలీ, ట్యాంకర్లను అందించి, చెత్త, ఇతర వ్యర్థాల నిర్వహణ కోసం  డంపు యార్డు, మృతులకు  సగౌరవంగా అంత్యక్రియల కోసం  ఆధునిక వసతులతో వైకుంఠధామాలను సైతం  ఏర్పాటు చేసిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని సిఎం కెసిఆర్‌ అన్నారు. భవిష్యత్‌ ‌తరాలు శరీర  దారుఢ్యంతో, మానసిక ఉల్లాసంతో ఎదిగేందుకు ప్రతి గ్రామంలో ‘తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం’ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని,  ఈ రోజు నుంచే ఎంపిక చేసిన కొన్ని గ్రామాలలో ఈ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నామని తెలియజేయడానికి తాను సంతోషిస్తున్నానని కెసిఆర్‌ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page