- రాజకీయాలకు అతీతంగా ఉగ్రవాదంపై పోరాడాలి..
- పాకిస్థాన్ ను రెండు ముక్కలు చేయండి
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25: జమ్మూకశ్మీర్లోని పహల్గామ్ లో భారతీయ పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడులను ఖండిస్తున్నామని ఉగ్రమూకలకు కేంద్రం గట్టి జవాబివ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలన్నారు. హైదరాబాద్ లో కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాదంపై భారత ప్రభుత్వం చేపట్టే ప్రతీ చర్యకు మద్దతు పలికేందుకు అందరం సిద్ధంగా ఉన్నాం. అందరం ఏకమై తీవ్రవాదాన్ని అంతమొందించి దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలి . దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఉగ్రవాద దాడుల్లో మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం సానుభూతి తెలుపుతోందన్నారు.
ఆ కుటుంబాలకు అందరం అండగా నిలబడి మనోధైర్యాన్ని ఇవ్వాలన్నారు. 1967, 1971 లో ఇలాంటి దాడులు జరిగినపుడు ఇందిరాగాంధీ గట్టి జవాబు ఇచ్చారని సీఎం రేవంత్ గుర్తుచేశారు. ఒక్క దెబ్బతో పాకిస్తాన్ ను పాకిస్తాన్, బంగ్లాదేశ్ అని రెండు ముక్కలు చేశారు. ఆ సందర్భంలో ఇందిరాగాంధీని వాజ్ పేయ్ దుర్గామాతతో పోల్చారు. ప్రధాని మోదీ కూడా దుర్గామాత భక్తులుగా ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఉగ్రమూకలకు గట్టి జవాబు ఇవ్వాలని కోట్లాది మంది భారతీయులంతా మీకు మద్దతుగా ఉంటారు… ఒక్క దెబ్బతో పాకిస్థాన్ ను రెండు ముక్కలు చేయాలని కోరారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ లో కలపాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.