ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
మంథని పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

మంథని, ప్రజాతంత్ర, జూలై 5 : విద్యార్థులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సూచించారు. మంత్రి శ్రీధర్‌బాబు కలెక్టర్‌ కోయ శ్రీహర్షతో కలిసి శనివారం మంథనిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్య, వైద్య రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు. పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందుతుందని నమ్మకం కలిగిస్తూ బడి బాట కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని అన్నారు. మంథని జడ్పీహెచ్‌ఎస్‌ బాలికల పాఠశాలలో 25మంది కొత్త విద్యార్థులు ప్రైవేట్‌ పాఠశాల నుంచి వొచ్చి చేరడం చాలా సంతోషకరమని అన్నారు. మెగా డీఎస్సీ నిర్వహించి నూతనంగా 10 వేలపైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని చెప్పారు. 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలను మొదటి ఏడాదిలోనే భర్తీ చేశామని, ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు ఎక్కడా ఎలాంటి ఆరోపణలు రాకుండా పారదర్శకంగా పూర్తిచేసామని వివరించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు నూతన సాంకేతికతను నెర్పించాలనే లక్ష్యంతో మంథని బాలికల పాఠశాలలో రూ.58 లక్షలతో డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. ప్రైవేట్‌ పాఠశాలల కంటే మెరుగ్గా కంప్యూటర్‌ ల్యాబ్‌, లైబ్రరీ అందుబాటులో ఉన్నాయన్నారు. నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో డిజిటల్‌ తరగతులను ఏర్పాటు చేయాలని, దీని కోసం సిఎస్‌ఆర్‌ నిధులు వినియోగిస్తామని అన్నారు. రోబోటిక్స్‌, డ్రైవర్‌ లెస్‌ కార్లు వంటి సాంకేతిక అంశాలు పిల్లలకు నేర్పాలని అధికారులకు సూచించారు. మంథనిలో ఉన్న ఫొటో టైపింగ్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ను విద్యార్థులు వాడుకోవాలని మంత్రి సూచించారు. ఏఐ టూల్స్‌ (కృత్రిమ మేధస్సు) పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోందని పేర్కొన్నారు. టీచర్స్‌కు కూడా ఏఐ బోధనపై శిక్షణ అందిస్తామన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు ఇంగ్లీష్‌ స్పీకింగ్‌ స్కిల్‌ రావాల్సిన అవసరం ఉందని, దీని కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మంథని పాఠశాలలో టీచర్లకు డిజిటల్‌ స్టాఫ్‌ రూమ్‌ ఏర్పాటు చేస్తామన్నారు. మంథని పట్టణంలో చిన్న సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఏర్పాటు చేశామని, 30మంది యువతకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. స్థానిక యువతకు, విద్యార్థులకు నైపుణ్యాలు పెంచితే పరిశ్రమలు కూడా ఇక్కడ అధికంగా వస్తాయన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అన్నయ గౌడ్‌, ఆర్డీవో సురేష్‌ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page