వీఆర్వో, వీఏవోలకు మరో అవకాశం
రెవెన్యూ ఉద్యోగ సంఘాలతో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి భేటీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 5: గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్ధను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక గ్రామ పరిపాలనాధికారి (జీపీవో)ను నియమిస్తున్నామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సచివాలయంలో రెవెన్యూ కార్యదర్శి డిఎస్ లోకేష్ కుమార్తో కలిసి రెవెన్యూ సంఘాలతో మంత్రి పొంగులేటి శనివారం సమావేశమై ప్రతి రెవెన్యూ గ్రామానికి రెవెన్యూ అధికారిని నియమించడంపై సుదీర్ఘంగా చర్చించారు. గతంలో వీఆర్వో, వీఏవోగా పనిచేసిన వారికి జీపీవోలుగా అవకాశం కల్పించడానికి ప్రత్యేక పరీక్ష నిర్వహించగా 3,454 మంది అర్హత సాధించారన్నారు. రెవెన్యూ ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు వారికి మరో అవకాశం కల్పించి ఇందుకు సంబంధించి అర్హత పరీక్ష త్వరలో నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడిరచారు. రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం లక్ష్యంగా భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చామని, అదేవిధంగా సామాన్య ప్రజలకు రెవెన్యూ సేవలను చేరువ చేయడానికి ప్రజా కోణంలో నిర్ణయాలు తీసుకొని గ్రామ పాలనాధికారుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టామన్నారు. మీ అందరి సహకారంతో రెవెన్యూ సదస్సులు విజయవంతమయ్యాయని సంతృప్తి వ్యక్తం చేశారు. భూ భారతి ఫలితాలు ప్రతి పేదవాడికి చేరేలా చట్టం అమలుకు క్షేత్రస్ధాయిలో పనిచేయాలని కోరారు. పదవులు శాశ్వతం కాదని పదవిలో ఉన్నప్పుడు తీసుకున్న సంస్కరణలు, విధానపరమైన నిర్ణయాలు పదిమందికి మేలు జరిగేలా ఉండాలన్నారు. సమావేశంలో తెలంగాణ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వంగా రవీందర్రెడ్డి, కె.గౌతమ్ కుమార్, తెలంగాణ డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.లచ్చిరెడ్డి, కె. రామకృష్ణ, తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.రాములు, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.రామ్రెడ్డి,వి. భిక్షం, ట్రెసా అసోసియేట్ అధ్యక్షుడు పి.రాజ్కుమార్, ఉపాధ్యక్షుడు నిరంజన్, రాష్ట్ర నాయకులు రమణరెడ్డి, రామకృష్ణా రెడ్డి, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ సిసిఎల్ఎ యూనిట్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్.రాంబాబు, క్రిష్ణచైతన్య, తెలంగాణ గ్రామ పాలనాధికారుల అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.ఉపేందర్ రావు. లక్ష్మీనరసింహ తదితరులు పాల్గొన్నారు.