- వారి అభివృద్ధికి సిఎం కేసీఆర్ కృషి
- రూ.17,800 కోట్లతో 2 లక్షల మందికి దళిత బంధు
- ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా రాష్ట్రంలో విద్యా వ్యవస్థ
- అంబేడ్కర్ జయంతి సభలో మంత్రి హరీష్రావు
సిద్ధిపేట, ఏప్రిల్ 14(ప్రజాతంత్ర బ్యూరో) : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్.అంబేడ్కర్ మార్గదర్శకాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో దళితులకు అన్ని రంగాలలో సమాన అవకాశాలు కల్పిస్తూ దళితుల అభివృద్ధికి సిఎం కేసీఆర్ కృషి చేస్తున్నాడనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు అన్నారు. అంబేడ్కర్ 131వ జయంతిని పురస్కరించుకుని గురువారం సిద్ధిపేటలో అంబేడ్కర్ విగ్రహంకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీష్రావు మాట్లాడుతూ… భారత రాజ్యాంగం ద్వారా విద్య, ఉద్యోగం, ఉపాధి రంగాలలో అన్ని వర్గాల వారు ఎదిగేందుకు సమాన అవకాశాలను కల్పిస్తున్నానని వీటిని ఉపయోగించుకొని అభివృద్ధి సాధించాల్సిన బాధ్యత ముందుతరాల వారిదన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులు ల్యాబ్ కాకుండా దళితుల సంక్షేమం కోసం ఉపయోగిస్తున్నామనీ, దేశానికి దళితబంధు ఆదర్శంగా నిలిచిందన్నారు. 17వేల 800కోట్ల రూపాయలతో ఈ సంవత్సరం చివరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల మంది దళితులకు దళితబంధు అందించేందుకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. విడతల వారీగా ప్రతి పేద దళిత కుటుంబానికి రైతుబంధు అందజేస్తామన్నారు. దళితబంధు లబ్ధిదారుల కుటుంబాల కోసం దళిత సంరక్షణ నిధిని కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నిజంగా మీ జీవితంలో వెలుగు రావాలి. ఈ పథకం ఉద్దేశ్యం సార్థకత ఉండాలన్నదే దీని ఉద్దేశ్యమనీ, మీ భవిష్యత్ కోసమే ఈ దళితబంధు. మీ జీవితంలో ఒక వెలుగు రావాలి.. ఈ పథకానికి ఒక సార్థకత ఉండాలన్నదే మా తపన అన్నారు.
మీ కాళ్ల మీద మీరు నిలబడాలన్నదే మా కోరిక. మా ప్రయత్నం మీకు భవిష్యత్తు మార్గం చూపాలన్నదే మా కోరిక అన్నారు. మా ఉద్దేశ్యం మీకు మేలు చేయాలన్నదే అందుకే ప్రతి ఒక్క లబ్ధిదారుకు 10 లక్షల రూపాయల సాయం అందిస్తున్నామన్నారు. మీరంతా ఇవాళ ఒక చిన్న ప్రతిజ్ఞ చేయాలని, ఇవాళ్టి నుంచి చెడు అలవాట్లు వద్దని, మానేయాలని, డబ్బు విలువ తెలుసుకుని, ప్రతీ రూపాయికి రూపాయి జమ చేయాలని లబ్ధిదారులకు మంత్రి హరీష్రావు మార్గనిర్దేశం చేశారు. వ్యాపార వృద్ధి సాధించి.. అన్ని రంగాలలో ఆదర్శంగా నిలవాలనీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు, అంబేద్కర్ కలలను సాకారం చేసేందుకు దళిత బంధు పథకంకు శ్రీకారం చుట్టామన్నారు. సిఎం కేసీఆర్ దళితబంధును ప్రభుత్వ పథకంగా కాకుండా ఉద్యమంలా భావించి అమలు చేస్తున్నారన్నారు. తెలంగాణ సాధించిన తర్వాత రాష్ట్రంలో ఎస్సీ రెసిడెన్షియల్ స్కూళ్లను రెట్టింపు చేశామనీ, 50 మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలను నెలకొల్పామనీ, మహిళా రెసిడెన్సియల్ పిజి, లా కాలేజీలను నెల కొల్పామన్నారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు.
దళిత విద్యార్థుల విదేశీ విద్యకు ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద 20 లక్షల రూపాయలు గ్రాంటు ఇస్తున్నామనీ, ఇంజనీరింగ్ నిర్మాణాలలో ఎస్సీలకు 16 శాతం రిజర్వేషన్ జివో తీసుకువచ్చామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 56దవాఖానల్లో ఎస్సీలకు డైట్, సానిటేషన్ పనులలో రిజర్వేషన్ కల్పించామనీ, డాక్టర్ అజయ్ని వైద్య విధాన పరిషత్ కమిషనర్గా నియమించామన్నారు. అంబేద్కర్ భవన్లలో ఎస్సి విద్యార్థులు చదువుకునేందుకు లైబ్రరీ ఏర్పాటు చేసేందుకు సంఘాలు ముందుకు వస్తే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అంబేద్కర్ భవనాలలో ఫిబ్రవరిలో ఏర్పాటుకు లక్ష రూపాయల నిధులిచ్చి ప్రోత్సహిస్తామన్నారు. సిద్దిపేట తాత్కాలిక జిల్లా కలెక్టరేట్ ఏర్పాటుకు సహకరించి సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ భవనాన్ని అందించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ కోటి రూపాయలతో అంబేద్కర్ భవన్ను అభివృద్ధి చేసేందుకు మున్సిపాలిటీ ద్వారా చర్యలు చేపడతామన్నారు.
వచ్చే విద్యా సంవత్సరం నుండి అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం విద్యనందిస్తున్నామనీ, 7300 కోట్ల రూపాయలతో మన ఊరు-మన బడి కార్యక్రమాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం సిద్దిపేట పట్టణంలో సొంత ఇంటి జాగ కలిగిన 500 మందికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహకారం అందిస్తామన్నారు. ఈ సందర్భంగా సిద్ధిపేట నియోజకవర్గంలోని దళితబంధు లబ్దిదారులకు పట్టణంలోని పరేడ్ గ్రౌండ్లో దళితబంధు పథకం కింద మంజూరు పత్రాలు, యూనిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్దిదారులు పాల్గొన్నారు.