హెచ్‌ఎండీఏలో విజిలెన్స్‌ సోదాలు

హెరైజ్‌ అనుమతులపై కీలక ఫైళ్లు స్వాధీనం
ఫైళ్లను సీజ్‌ చేసిన విజిలెన్స్‌ అధికారులు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : హెచ్‌ఎండీఏలో విజిలెన్స్‌ సోదాలతో కలకలం నెలకొంది. కార్యాలయంలో బుధవారం ఉదయం నుంచి 50 మంది స్పెషల్‌ టీమ్‌తో సోదాలు చేపట్టారు. గత ప్రభుత్వంలో అనుమతి ఇచ్చిన ఫైల్స్‌ను విజిలెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మైత్రీవనం నాలుగో అంతస్తులో ఉన్న అన్ని ఫైల్స్‌ను విజిలెన్స్‌ సీజ్‌ చేసింది. స్వర్ణజయంతి కాంప్లెక్స్‌లోని ఏడో అంతస్తులో కూడా తనిఖీలు చేస్తున్నారు. అరెస్ట్‌ వారెంట్‌తో వెళ్లిన విజిలెన్స్‌ నిఘా టీమ్‌..హెచ్‌ఎండీఏ ఇద్దరు డైరెక్టర్లు గతంలో అనుమతించిన ఫైల్స్‌పై ఆరా తీశారు. ఆన్‌లైన్‌ డేటా నుంచి చెరువులు మాయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. నాలుగు రోజుల క్రితమే దాడులు జరుగుతాయని జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అధికారులను ముందే హెచ్చరించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 3,500 చెరువుల డాటా ఆన్‌లైన్‌లో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇప్పటికే చెరువుల పరిరక్షణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డ అధికారులపై చర్యలకు రంగం సిద్ధమైంది. అక్రమ లే`అవుట్‌, బిల్డింగ్‌ అనుమతులపై దర్యాప్తు చేస్తున్నారు. హెచ్‌ఎండీఏలో కొన్ని రోజుల క్రితం ఏసీబీ కూడా దాడులు నిర్వహించింది. ఫైళ్లను పరిశీలించే క్రమంలో హెచ్‌ఎండీఏలోని ఘట్‌కేసర్‌, శంషాబాద్‌, శంకర్‌పల్లి జోన్‌లకు చెందిన ప్లానింగ్‌ అధికారులు, ఏపీఓలను తమ వద్దకు రప్పించి పలు అనుమతులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ముఖ్యంగా 2018 నుంచి 2023 వరకు పని చేసిన హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివ బాలకృష్ణ హయాంలో ఇచ్చిన హై రైజ్‌ భవనాల అనుమతులపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. ఒకవైపు విజిలెన్స్‌ సోదాలు కొనసాగుతుండగానే..మరోవైపు హెచ్‌ఎండీఏపై సీఎం రేవంత్‌రెడ్డి సవిూక్ష నిర్వహించడం గమనార్హం. విజిలెన్స్‌ విచారణతో నిగ్గు తేల్చాలని నిర్ణయం తీసుకున్న సీఎం.. సవిూక్ష సందర్భంగా దాడులపై ఆరా తీశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *