సిఎం సలహాదారు వేమ్‌తో మాజీమంత్రి మల్లారెడ్డి భేటీ

అల్లుడి భవనాల కూల్చివేత క్రమంలో అత్యవసర భేటీ

మేడ్చల్‌, ప్రజాతంత్ర, మార్చి 7 : ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ రెడ్డి గురువారం సీఎం సలహాదారు వేమ్‌ నరేందర్‌ రెడ్డితో సమావేశం అయ్యారు. దుండిగల్‌ చెరువును ఆక్రమించి నిర్మించిన..మర్రి రాజశేఖర్‌ రెడ్డికి చెందిన భవనాలను ఉదయం నుంచి  కూల్చి వేస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు..అక్రమ కూల్చివేతలని అంటున్నారు. వారం రోజుల కిందటే నోటీసులు ఇచ్చారని కనీసం తమకు సమాధానం చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదని అంటున్నారు. ఈ క్రమంలో వారు సీఎం సలహాదారుతో సమావేశం కావడం రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఉదయం నుంచి కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, మల్కాజిగిరి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి కాలేజీకి చెందిన భవనాలను అధికారులు కూల్చివేశారు. దుండిగల్‌లోని చిన్న దామరచెరువు ఎఫ్‌టీఎల్‌ బఫర్‌ జోన్‌లో మర్రి రాజశేఖర్‌రెడ్డికి సంబంధించిన ఐఏఆర్‌ఈ, ఎంఎల్‌ఆర్‌ఐటీఎం కళాశాలలకు చెందిన రెండు శాశ్వత భవనాలు, 6 తాత్కాలిక షెడ్లు కూల్చివేశారు.

మొత్తం 8.24 ఎకరాల చెరువు (ఎఫ్‌టీఎల్‌ బఫర్‌ జోన్‌) ఆక్రమించి పార్కింగ్‌ కోసం రోడ్లు, భవనాలు నిర్మించినట్లు నీటిపారుదల శాఖ, రెవెన్యూ అధికారులు గతంలో గుర్తించారు. ఈ మేరకు వారం రోజుల క్రితం యాజమాన్యానికి నోటీసులిచ్చారు. తాజాగా మేడ్చల్‌ కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఇరిగేషన్‌, రెవెన్యూ, పోలీసుల ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు. మల్లారెడ్డికి ఇటీవలే అధికారులు షాక్‌ ఇచ్చారు. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలో హెచ్‌ఎండీఏ  లే అవుట్‌ లో ఆయనకు సంబంధించిన కాలేజీ రోడ్డును అధికారులు తొలగించారు. ఇక్కడ 2,500 గజాల భూమిని ఆయన ఆక్రమించి రోడ్డు నిర్మించారని ఆరోపణలున్నాయి. దీనిపై గతంలో మేడ్చల్‌ మల్కాజిగిరి ఎంపీగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్‌ రెడ్డి అప్పట్లో అధికారులకు ఫిర్యాదు చేశారు. తన కాలేజీ కోసమే అప్పట్లో మల్లారెడ్డి రోడ్డు వేసుకున్నారని ఆరోపించారు. కాగా, కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన తర్వాత ఈ భూమి అంశం మరోసారి తెరపైకి వొచ్చింది. ఈ మేరకు హెచ్‌ఎండీఏ స్థలం ఆక్రమణలపై కలెక్టర్‌ దృష్టి సారించారు. అక్రమంగా వేసిన రోడ్డును తొలగించాలని అధికారులను ఆదేశించగా.. ఆ రోడ్డును అధికారులు తొలగించారు. అయితే, అధికారులు తన కాలేజీ రోడ్డును తొలగించడంపై మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. తనను కావాలనే కొంత మంది టార్గెట్‌ చేశారని అన్నారు.

ప్రభుత్వం తనపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని మండిపడ్డారు. హెచ్‌ఎండీఏ అధికారుల అనుమతి తీసుకునే అప్పట్లో కాలేజీకి రోడ్డు వేశామని స్పష్టం చేశారు. 2,500 గజాల స్థలానికి ప్రత్యామ్నాయంగా స్థలాన్ని మున్సిపాలిటీకి ఇచ్చామని చెప్పారు. మరో వైపు మర్రి రాజశేఖర్‌ రెడ్డిపై పోలీసులు కేసులు పెట్టారు. ఉచిత ఎల్‌ఆర్‌ఎస్‌ను అమలు చేయాలంటూ.. బీఆర్‌ఎస్‌ శ్రేణులు అల్వాల్‌ సర్కిల్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అక్కడ పోలీసు అధికారితో వాగ్వాదానికి దిగడంతో  ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించారంటూ..ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ రెడ్డిపై కేసు నమోదు చేశారు. అల్వాల్‌ సర్కిల్‌ కార్యాలయానికి ఉదయాన్నే వెళ్లిన డీసీ శ్రీనివాస్‌ రెడ్డిని ధర్నా చేస్తున్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ రెడ్డి విధులకు ఆటకం కలుగజేయడంతో పాటు పౌరుష పదజాలాలతో మాట్లాడటంతో పాటు దూషించారని డీసీ ఫిర్యాదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ రాహుల్‌ దేవ్‌ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *