వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా ముందస్తు ప్రణాళిక
మూసీ నది అభివృద్ధికి అటంకాలు కలుగకుండా చర్యలు
మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 07 : ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్కు ఉన్న ఇమేజ్ మరింత పెరిగే విధంగా ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు పోవడంతోనే సాధ్యమవుతుందని రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి హైదరాబాద్ జిల్లా ఇంఛార్జి మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో జిహెచ్ఎంసిపై మేయర్, కమిషనర్లతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ…రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జిహెచ్ఎంసిలో రానున్న వేసవి కాలంలో త్రాగు నీటి ఎద్దడి లేకుండా ఇప్పటి నుంచి ముందస్తు ప్రణాళికను తయారు చేయాలని మెట్రో వాటర్ వర్క్స్ అధికారులను ఆదేశించారు. ప్రతిపక్షాలు హైదరాబాద్కు రానున్న రోజుల్లో నీటి ఎద్దడి ఎదురవుతుందని ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో అలాంటి ఆరోపణలు రాకుండా అధికారులు త్రాగు నీటి సమస్య ఉండదని జోనల్ స్థాయిలో ప్రజలకు వివరించాలన్నారు. సాగునీటి ప్రాజెక్టులలో త్రాగు నీటికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి వివరించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రానున్న వేసవి లో తాగునీటి సమస్య రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ ఇమేజ్ ఏమాత్రం తగ్గకుండా అభివృద్ధికి కోసం కృషి చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖ చూస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని పోవడం జరుగుతుందని తెలిపారు. జిహెచ్ఎంసి అభివృద్ధికి ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు.
మూసీ నది అభివృద్ధికి ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు ఉంటాయని అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తామన్నారు. రాష్ట్రంలో పట్టణాల అభివృద్ధి కోసం కేంద్ర సహకారం తీసుకుని సఖ్యతతో కలుపుకొని పోతామన్నారు. జిహెచ్ఎంసిలో అధికారులు సమస్యల పరిష్కారంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వేసవిలో ఇతర పండుగ కార్యక్రమాలకు త్రాగు నీటి సమస్యలు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఎదురయ్యే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్పై ప్లానింగ్తో ముందుకు పోవాలన్నారు. అభివృద్ధికి అవసరమైన ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులకు మాత్రమే పూర్తి చేసే విధంగా నిధులు సమకూర్చడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 40 నుండి 50 వేల కోట్ల బిల్లులు పెండిరగ్లో ఉన్నాయని. గత ప్రభుత్వం 1 లక్ష 90 వేల కోట్ల విలువ గల పనులకు ప్రొసీడిరగ్స్ ఇచ్చారని తెలిపారు. జిహెచ్ఎంసి లో ప్రాజెక్టు పనులకు 2 వేల కోట్లు అవసరం ఉందని అధికారులు చెబుతున్నారని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ జిహెచ్ఎంసిలో చేపడుతున్న పనులను విభాగాల వారీగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. రానున్న వర్షాకాలంలో నగరంలో వరద ముంపు లేకుండా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఎస్.ఎన్.డి.పి ద్వారా జిహెచ్ఎంసి పరిధిలో నాలా పనులు చుట్టూ పట్టణ ప్రాంతంలో నాలా అభివృద్ధి చేయడం జరిగిందన్నారు.
కోర్టు కేసులు ప్రాంతాల్లో తప్ప మిగతా ప్రాంతాల్లో పనులు పూర్తి చేసినట్లు కమిషనర్ మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా ఇంచార్జి మంత్రులకు జిల్లాల సమస్యల పరిష్కారానికి 10 కోట్ల రూపాయల నిధులు కేటాయించారని, అత్యవసర పనులు పూర్తి చేసేందుకు అధికారులు కూడా తెలియజేయవచ్చునన్నారు. నగర అభివృద్ధికి మేయర్, డిప్యూటీ మేయర్, పాలకమండలి సభ్యులు కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తో పాటు జిహెచ్ఎంసి ఉద్యోగులకు కూడా ప్రతి నెల 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు జీతభత్యాలు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిహెచ్ఎంసి అంశాలు అడ్రస్ చేయడానికి ప్రత్యేకంగా ఓఎస్డిని నియమించనున్నట్లు మంత్రి వివరించారు.ఈ సమావేశంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ…జిహెచ్ఎంసిలో అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇవ్వడంతో మంత్రి కి ధన్యవాదాలు తెలిపారు.
రానున్న రోజుల్లో హైదరాబాద్ ఇమేజ్ మరింత పెంచే యోచనలో ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరించడం జరుగుతుందని అన్నారు. అధికారులు కూడా నగర అభివృద్ధి కృషి కి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, ఈవిడిఎం డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి, అడిషనల్ కమిషనర్లు స్నేహ శబరీష్, శివ కుమార్ నాయుడు, జయరాజ్ కెన్నెడీ, సరోజ, ఉపేందర్ రెడ్డి, యాదగిరిరావు, సి ఈ దేవానంద్, కిషన్, సురేష్ కుమార్, జోనల్ కమిషనర్లు అభిలాష అభినవ్, రవి కిరణ్, పంకజ, వెంకన్న, ఎస్.ఈ లు రత్నాకర్, చిన్నారెడ్డి, సి.ఎం.ఓ.హెచ్ డాక్టర్ పద్మజ, చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ అబ్దుల్ వకీల్, చీఫ్ ఎంటమాలజి డాక్టర్ రాంబాబు, హౌసింగ్ ఎస్.ఈ విద్యాసాగర్, జోనల్ వెటర్నరీ, జోనల్ హౌసింగ్, జోనల్ ఎంటమాలజి, ఆయా విభాగాల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.





