విశ్వవిద్యాలయ పట్టాలకు ఉద్యోగాభిషేకాలు ఎన్నటికీ..?

అధికారిక గణాంకాల ప్రకారం 2018లో దేశవ్యాప్తంగా 64.7 లక్షల విద్యార్థినీవిద్యార్థులు డిగ్రీ పట్టాలు పొందగా, 20 లక్షల యువత పీజీ పట్టాలు పొందారు. డిగ్రీ పొందిన యువతలో సాంప్రదాయ బిఏ, బికాం, బియస్సీ, లా, ఇంజనీరింగ్‌, ‌మెడిసిన్‌, ‌మేనేజ్‌మెంట్‌ ‌లాంటి కోర్సులు పొందడం గమనించారు. డిగ్రీ, పీజీ పట్టాలు పొందిన యువ భారతీయులు ఉద్యోగ ఉపాధులు కొరవడి డిగ్రీ సర్టిఫికెట్లు వ్యర్థ కాగితాలుగా మారి యువతను ఎగతాళిగా, జాలిగా చూస్తున్నాయి. ప్రతి ఏట దేశంలో దాదాపు 14 లక్షల వరకు ఇంజనీరింగ్‌ ‌పట్టాలు పొందిన యువత మార్కెట్‌లో ఉద్యోగాల వేటలో విఫలయత్నాలు చేస్తూ అలసి పోతున్నారు.
ప్రతి ఏట 60-70 లక్షల యువత డిగ్రీలు పొందునప్పటికీ వేలల్లో కూడా ఉద్యోగాలు దొరకడం లేదు. అర్హతకు తగిన ఉద్యోగాలు కరువైనప్పటీ కనీసం అటెండర్‌, ‌గుమాస్తా లాంటి తక్కువ వేతనం, అర్హత కలిగిన ఉద్యోగాలు కూడా లభించడం లేదు. సాలీనా కొన్ని కోట్ల విద్యార్థులు కేంద్ర, రాష్ట్ర బోర్డు పరీక్షల ద్వారా సర్టిఫికేట్లు పొందుతూ, అందులో 50 శాతం యువత ఉన్నత చదువులు చేయలేక ఉద్యోగ ఉపాధుల వేటలో వ్యర్థ జీవితాలు గడుపుతున్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయ అర్హత కలిగిన బి ఏడ్‌, ‌డి ఏడ్‌ ‌పట్టాలు పొందిన యువత ఉప్పటికీ అందులో కొద్ది శాతానికి కూడా ఉద్యోగాలు లభించడం లేదు, ఒకవేళ లభించినా కనీసం 10,000/- నెలసరిలా వేతనం కూడా కరువైంది. ఉన్న కొద్ది పాటి ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో ఆశ్రిత పక్షపాత రాజకీయ జోక్యం, అవినీతి రాక్షస క్రీడలో జ్ఞాన సంపన్న అర్హులకు ఈ ఉద్యోగాలు దొరకడం లేదు. ఈ విషయాన్ని నేడు పశ్చిమ బెంగాల్‌లో బయటపడ్డ ఉపాధ్యాయ ఉద్యోగాల ఎంపికలో వందల కోట్ల అక్రమాలు జరిగినట్లు తేలిడం విచారకరం.
2022లో సిబియస్‌సి ఉత్తీర్ణత పొందిన విద్యార్థులు 19.77 లక్షలు ఉన్నారు. 2020-21లో కరోనా విజృంభణతో అందరు విద్యార్థులకు పరీక్షలు పెట్టకుండానే పాస్‌ ‌చేయడం జరిగింది. పరీక్షలు పెట్టినా దాదాపు అన్ని రాష్ట్రాల్లో 10, 12 తరగతుల్లో 90 శాతం కన్న అధికంగా పాస్‌ ‌కావడం జరుగుతోంది. దేశంలో ఉన్నత విద్య పొందిన యువత దాదాపు 37.4 మిలియన్లు ఉండగా, ప్రతి ఏట 1.5 లక్షల విద్యార్థులు యంబిబియస్‌ ‌పట్టాలను పొందుతున్నారు. యంబిబియస్‌ ‌పూర్తి చేసిన యువతలో కొద్ది మంది పీజీ కోర్సుల్లో, కొద్ది మంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ఎక్కువ మంది వైద్యులు ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో తక్కువ వేతనానికి పని చేస్తున్నారు. ప్రతి ఏట 1.5 మిలియన్ల యువత ఇంజనీరింగ్‌ ‌పూర్తి చేస్తుండగా అందులో దాదాపు 33 శాతం ఇంజనీర్లు నిరుద్యోగులుగా నీరస పడుతున్నారు. ఇటీవల ఓ అంతర్జాతీయ సంస్థ వివరాల ప్రకారం రానున్న రోజుల్లో యువ భారత్‌లో నిరుద్యోగ సంక్షోభం రానుందని కూడా హెచ్చరించింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బోర్డులు నాణ్యమైన విద్యను అందించడంలో విఫలం అవుతునే ఉన్నాయి. విద్యకు, ఉద్యోగాలకు సంబంధం లేకుండా పోయింది. విద్యలో నాణ్యత లోపంతో పాటు నైపుణ్యం కరువవడంతో నిరుద్యోగాలు కోట్లలో చేరుతున్నాయి. ఉద్యోగ సాధన, ఉద్యోగంలో నిలదొక్కుకునే సాంకేతిక నైపుణ్యాలు కరువై యువత నిరుత్సాహ సంద్రంలో ఊపిరాడకుండా మునిగి పోతున్నారు. అసంబద్ధ పారిశ్రామిక ప్రగతి, నిరంతర వలసలు ఉద్యోగాల కల్పనలో విఫలం అవుతున్నాయి. అనుభవ యువత కావాలని పరిశ్రమలు, ఉద్యోగం కల్పించని యెడల అనుభవం ఎలా వస్తుందని యువత వారి వారి వాదనలు చేస్తున్నారు. నిరుద్యోగ యువత నిరాశలో పడితే, దేశంలో సామాజిక అశాంతి విష మ్నెక్కలు మొలవడం ప్రారంభమవుతుంది.
యువభారతంలో యువశక్తి నైపుణ్య నిధిగా మారితే పారిశ్రామిక రంగం దినదిన ప్రవర్థమానంగా వెలుగొందుతుందనేది వాస్తవం. మేధో వలసతో భారతీయ యువత విదేశాల్లో కూడా రాణించడం, స్థిరపడడం చూస్తున్నాం. 2030 నాటికి కనీసం 90 మిలియన్ల ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వాలు పథక రచనలు చేయాల్సి ఉంటుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒక మిలియన్‌ ‌ఖాళీ ఉద్యోగాలను 2023 నాటికి నింపనుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్‌ ‌పథం ద్వారా యువతను అగ్నివీరులుగా రక్షణశాఖలో తీసుకోవాలనే నిర్ణయానికి కొంత వ్యతిరేకత కనిపించినా కొద్ది రోజుల్లోనే రికార్డు స్థాయిలో దరాఖాస్తులు చేసుకున్నారు. ప్రైవేట్‌ ‌రంగంలో ఊబర్‌/ఓలా డ్రైవర్స్, ‌జూమోటో/అమెజాన్‌/‌ఫ్లిప్‌కార్ట్ ‌డెలివరీ వర్కర్స్ ‌లాంటి ఈ-కామర్స్‌ల ద్వారా  పలురకాల తక్కువ వేతన ఉద్యోగాలు కల్పించబడి గిగ్‌ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి పోస్తున్నాయి. నీతి ఆయోగ్‌ అం‌చనాల ప్రకారం 2029-30 నాటికి 23.5 మిలియన్ల గిగ్‌ ‌వర్కర్స్ ఉద్యోగాలు పొందనున్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు ఉద్యోగ ప్రకటనలు చేయడం జరిగినా భర్తీ ప్రక్రియ పూర్తి చేయడానికి కావలసిన సత్వర చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతున్నాయి. దేశ ఉత్పత్తిరంగం, మౌళిక వసతుల కల్పన, అవినీతి రహిత వ్యవస్థలు, విదేశీ నిధుల ఆకర్షణ, ఉన్న ఖాళీలను గుర్తించడం లాంటివని సత్వర అవసరంగా గుర్తించాలి. యువత అత్యధికంగా ఉన్న యువభారతం ప్రపంచ దేశాలకు దీపస్తంభం కావాలి, పట్టాలు కలిగిన యువశక్తికి పట్టాభిషేకం చేయాలి.
image.png
డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
 కరీంనగర్‌ – 994970003

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *