లంగాణ గడ్డ..టీఆర్ఎస్ అడ్డ్డా
జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి హరీష్ రావు
సంగారెడ్డి, ప్రజాతంత్ర, జూలై 22 : బీజేపీ అంటేనే బేకార్, జూటా పార్టీ అని, తన పేరును సార్థక నామధేయంగా చేసుకుందని ట్రబుల్ షూటర్ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావ్ అన్నారు. శుక్రవారం నారాయణఖేడ్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంబోత్సవాలు, శంఖుస్థాపనలు నిర్వహించడానికి గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్తో కలిసి నారాయణఖేడ్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఖేడ్ మండలంలోని నిజాంపేట్ వద్ద నియోజకవర్గ ఎమ్మెల్యే ఎం.భూపాల్ రెడ్డి, గ్రామ సర్పంచ్ జగదీశ్వర్ చారీలు, ప్రజాప్రతినిధులు మంత్రులకు పూలబొకేలతో స్వాగతం పలికారు. అనంతరం కంగ్టి మండలంలో రూ,1.65 కోట్లతో దెగుల్వాడి నుండి దెగుల్ వాడి తండా వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..కర్ణాటకలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం తెలంగాణలో అమలవుతుమ్మ పథకాలను ఎందుకు అమలుచేయడం లేదని ప్రశ్నించారు. కల్యాణా లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బీమా, రైతు బంధు, రూ.2016 లు పింఛన్ ఎందుకు అమలుచేయడం లేదన్నారు. ఇతర రాష్ట్రాలలాగా తెలంగాణలో కూడా అబద్ధపు, మాయదారి, జూటా మాటలు చెబితే నమ్మడానికి ఇక్కడ ఎవ్వరు సిద్ధంగా లేరన్నారు. కల్ల్ళబొల్లి మాటలతో రాష్ట్రంలో తిష్ఠవేయడానికి ప్రయత్నించొద్దన్నారు.
తెలంగాణ గడ్డ టీఆర్ఎస్ అడ్డా అన్నారు. కాంగ్రెస్ హయాంలో నాణ్యత లేని పనులు చేసి బిల్లులు డ్రా చేసేవారని, కానీ టిఆర్ఎస్ హయాంలో నాణ్యతతో కూడుకున్న పనులు చేపడుతున్నామన్నారు. గత 5 ఏళ్లలో నారాయణఖేడ్ నియోజకవర్గంలో రు.36 కోట్లతో రోడ్లు ఏర్పాటు చేశామని, 54 తండాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసుకున్నామన్నారు. మిగిలిన రోడ్లను కూడా త్వరలో బీటీ రోడ్లుగా మారుస్తామన్నారు. గతంలో కొన్ని తాండాలకు విద్యుత్ అంటేనే తెలియదని ప్రస్తుతం ప్రతి తాండాకు త్రీ ఫేస్ కరెంటు వొస్తుందన్నారు. 70 స్వాతంత్య్రంలో ఖేడ్లో ఒక్క గిరిజన గురుకులం లేదని, భూపాల్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాక నాలుగు గిరిజన గురుకులాలు ఏర్పాటు చేసుకున్నామన్నారు. గురుకులాలలో విద్యానభ్యసించిన గిరిజన బిడ్డలు చాలామంది డాక్టర్లు, ఇంజినీర్లు అయ్యారన్నారు. మంచినీళ్ళ కోసం ఇక్కడి ప్రజలు ఎంతో ఇబ్బంది పడేవారని, నీళ్ళు మోసి భుజాలు కాయలు కాసేవని, సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి మంచి నీరు అందిస్తున్నామన్నారు. రైతులకు ఎలాంటి కష్టం ఉండకూడదని పంట పెట్టుబడి సాయం ఇస్తున్నామని తెలిపారు. కర్ణాటకలో ఏ ఒక్క పథకం కూడా అమలుకావడం లేదని, కర్ణాటక, మహారాష్ట్రల నుండి తెలంగాణ రాష్ట్రంలో కలపాలంటూ సరిహద్దు గ్రామాల ప్రజలు తెలంగాణ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారన్నారు. గతంలో ఖేడ్ ప్రభుత్వ హాస్పిటల్ కాలగర్భంలో కలిసిపోవడంతో పురిటినొప్పులతో బాధపడుతూ మహిళలు ప్రసవాల కోసం పక్కనే ఉన్న బీదర్కు వెళ్ళేవాళ్లన్నారు.
రాష్ట్రం ఏర్పాటు జరిగాక నారాయణఖేడ్లో రూ.6 కోట్లతో 100 పడకల హాస్పిటల్ నిర్మించామని, ప్రస్తుతం 50 పడకల మాతా శిశు సంరక్షణ హాస్పిటల్ నిర్మాణం పూర్తి కావొచ్చిందన్నారు. ఇప్పుడు కర్ణాటక నుండి ఖేడ్ ప్రభుత్వ హాస్పిటల్కి రోగులు వొస్తున్నారన్నారు. భవిష్యత్తులో ఖేడ్లో డయాగ్నొస్టిక్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ..తెలంగాణ రాకముందు గిరిజన తాండాలు వెలవెల బోయేవాని, రాష్ట్ర ఏర్పాటు అనంతరం కళకళలాడుతున్నాయన్నారు. రాష్ట్రంలోని అన్నిగూడెంలు, తండాలను గ్రామపంచాయతీలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రికి దక్కిందన్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 3146 మంది ఎస్టీలు కొత్తగా సర్పంచులు అయ్యారన్నారు. ఎస్టీ సంక్షేమం కోసం బడ్జెట్లో రూ,600 కోట్లు ప్రణాళిక వేసుకున్నామని, త్వరలో అన్ని తండాలకు రోడ్లు వేస్తామన్నారు. ముఖ్యమంత్రికి గిరిజనులు అంటే మక్కువ ఎక్కువ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్పర్సన్ మంజూశ్రీ జైపాల్ రెడ్డి, కలెక్టర్ శరత్,అదనపు కలెక్టర్ రాజర్షి షా, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, పార్టీ అధ్యక్షులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.



