- మండుటెండలతో భీతిల్లుతున్న ప్రజలు
- రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18 : మండుటెండలతో రాష్ట్రంలోని పలు జిల్లాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. భానుడి ప్రతాపానికి ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఏప్రిల్లోనే ఎండలు అధికంగా ఉండడంతో వొచ్చే మే నెలలో పరిస్థితిని ఊహించుకుని జనం భీతిల్లుతున్నారు. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు గరిష్ఠం 42 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. దీంతో ప్రధాన రహదారులు, వీధులన్నీ బోసిపోయి కర్వ్యూను తలపిస్తున్నాయి.
ఉపాధిహావ్ని, ఇతరత్రా పనులకు వెళ్లే కూలీలు ఎండ వేడిమికి తాళలేక ఇబ్బందులు పడుతున్నారు. తీవ్ర ఎండలకు తోడు వేడిగాలులు వీస్తుండడంతో జనం ఆందోళన చెందుతున్నారు. రోజురోజుకు అధికమవుతున్న ఉష్ణోగ్రతలతో నిప్పుల కుంపటిని తలపిస్తుంది. మధ్యాహ్నం 11 గంటల తర్వాత జనం బయటకు రావాలంటే బెంబేలెత్తుతున్నారు. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎండ తీవ్రత తగ్గకపోవడంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై చిరువ్యాపారులు సైతం సూర్యుడి ధాటికి బయటకు రావడం లేదు. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు జనం శీతలపానీయాలు సేవిస్తున్నారు. దీంతో జ్యూస్పాయింట్లు కిక్కిరిసి కనిపిస్తున్నాయి.
భానుడి భగభగలకు జనం ఇంటికే పరిమితమవుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో ఏసీలు, కూలర్ల వాడకం పెరిగిపోయింది. కొందరు పాత వాటిని బయటకు తీసి వాడుతుండగా, లేనివారు షాపులకు వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. తద్వారా జిల్లాల్లో విద్యుత్ వాడకం కూడా రోజురోజుకూ పెరుగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎండలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత అధికంగా ఉంటోంది. ఇక మధ్యాహ్నం పరిస్థితి ఊహికందడం లేదు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో నెత్తిమాడు పగిలిపోతుందా అన్నట్లుగా ఎండ తీవ్రత ఉంటుంది. సూర్యుడి ప్రతాపానికి తోడు వడగాల్పులు వీస్తుండడంతో ప్రజలు బయట ఎక్కువ సేపు ఉండలేక పోతున్నారు.
నగరంలో మధ్యాహ్నం రోడ్లు బోసిపోతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు రావాలనుకునే జనం గొడుగులు, టోపీలు, స్కార్పస్ ధరిస్తున్నారు. అయినా పలు సమస్యలు ఎదుర్కోవాల్సి వొస్తోందని వాపోతున్నారు. ఎండ తీవ్రత ధాటికి ప్రజలు చల్లటి పానీయాల కోసం పరుగులు తీస్తున్నారు. చెరుకు, నిమ్మకాయ, బత్తాయి, కొబ్బరి బొండాలు, ఇతరత్రా పండ్ల రసాలు అధికంగా సేవిస్తున్నారు. వడగాలులు వీస్తుండడంతో డయేరియా, డీహైడ్రేషన్ లాంటి రోగాల బారిన పడే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువసేపు ఎండలో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్, నల్లగొండ, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉందని అంటున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగనుంది.




