పట్నా,జూన్20(ఆర్ఎన్ఎ): బిహార్లో నీతీశ్ కుమార్ ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను 65 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పట్నా హైకోర్టు కొట్టివేసింది. ఈ పెంపు రాజ్యాంగ విరుద్ధమన్న న్యాయస్థానం.. 65శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ గురువారం సంచలన తీర్పు వెలువరించింది. బిహార్ వ్యాప్తంగా కులగణన చేపట్టి ఆ నివేది కను నీతీశ్ సర్కారు గతేడాది నవంబ రులో అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.
అదే సమయంలో విద్య, ఉద్యోగ రంగాల్లో కల్పిస్తున్న రిజర్వేషన్లను పెంచుతూ సవరణ బిల్లును తీసుకొచ్చారు. ఈ బిల్లుకు రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దాంతో ఎస్సీలు, ఎస్టీలు, ఇతర వెనకబడిన వర్గాలు, అణగారిన వర్గాల రిజర్వేషన్లు 50 శాతం నుంచి 65 శాతానికి పెరిగాయి. ఇక, ఆర్థికంగా వెనకబడినవారిని ఉద్దేశించిన 10శాతం రిజర్వేషన్లు కలిపితే మొత్తం రిజర్వేషన్లు 75 శాతానికి చేరాయి.
ఈ పెంపుతో ఎస్సీలకు 16 నుంచి 20 శాతం, ఎస్టీ లకు ఒక శాతం నుంచి రెండు శాతం, ఓబీసీ, ఈబీసీలకు కలిపి 30శాతం ఉన్న రిజర్వేషన్ 43 శాతానికి పెరిగింది. అ యితే, ఈ పెంపుపై కొన్నివర్గాల నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. ఈ క్రమంలోనే హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం ఈ ఏడాది మార్చిలో తీర్పును రిజర్వు చేసింది. తాజాగా 65శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ గురువారం తుది తీర్పు వెలువరించింది.





