జ్యూడిషియల్‌ విచారణతో కెసిఆర్‌ పరేషాన్‌

ఏం మాట్లాడాలో తెలియడం లేదు
మూడు పిల్లర్లు కుంగితే డ్యామ్‌ ఉంటుందా
మిషన్‌ భగీరథ ఓ ఫెయిల్యూర్‌ పథకం
కెసిఆర్‌ తీరుపై మండిపడ్డ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 13 : కాళేశ్వరం, యాదాద్రి పవర్‌ ప్రాజెక్టులపై, విద్యుత్‌ కొనుగోలుపై జ్యూడిషరీ ఎంక్వయిరీ వేయడంతో కేసీఆర్‌ పరేషాన్లో పడ్డారని కాంగ్రెస్‌ ఎమెల్సీ జీవన్‌ రెడ్డి అన్నారు. మూడు పిల్లర్లు దెబ్బతింటే అయిపోయిందా అని కేసీఆర్‌ అంటుండని.. గుండె పోయిన తర్వాత మనిషి బతుకుతాడా..అంటూ ఆయన ప్రశ్నించారు. సభకు రాకుండా టీవీ ముందుకు వొస్తా అంటుండని, ఆయనను ఎవరైనా అవుతున్నారా? అని జీవన్‌ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఏం మాట్లడుతుండో ఆయనకే తెలియాలని ఎమెల్సీ జీవన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ..ఖరీఫ్‌ సాగు నీరు అందకపోవడానికి కేసీఆరే కారణమని అన్నారు. కరువుకు కేసీఆరే కారణమని విమర్శించారు. మిషన్‌ భగీరథ ఫెయిల్యూర్‌ ప్రాజెక్టని అన్నారు.

కమిషన్ల కక్కుర్తితోనే మిషన్‌ భగీరథ ప్రాజెక్టు తీసుకొచ్చారని ఆరోపించారు. ఆ సలహా ఇచ్చిన అధికారిని ఉరి తీయాలని తాను సభలోనే చెప్పానన్నారు. పంటలు తడి ఆరకుండా చూడాలన్నారు. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ ప్రభుత్వమైన ఏర్పడిన 100 రోజుల్లో హావిూలను అమలు చేసిన సందర్భం లేదని, బీఆర్‌ఎస్‌ 10 ఏళ్లల్లో చెయ్యలేనివి రేవంత్‌ రెడ్డి మూడు నెలల్లో చేసి చూపారన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత బీజేపీ కూడా కనుమరుగవుతుందని, ఇక భాష గురించి కేసీఆరే మాట్లాడాంలటూ ఎద్దేవా చేశారు.. బీఆర్‌ఎస్‌ నేతలకు ఇన్ని రోజులు కేసీఆర్‌ మాట్లాడితే వినసొంపుగా ఉందని, ఇప్పుడు రేవంత్‌ రెడ్డి మాట్లాడితే సీసం పోసినట్లు ఉందా అంటూ ప్రశ్నించారు. తమ పార్టీ సెంట్రల్‌ ఆఫీస్‌ దిల్లీలో ఉందని, సమావేశాలకు వెళాల్సిన అవసరం తమకు ఉంటుందని, మహారాష్ట్ర బీఆర్‌ఎస్‌ నాయకులు హైదరాబాద్‌ ఎందుకు వొస్తున్నారుని జీవన్‌ రెడ్డి నిలదీశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *