వొచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నినాదం
రాహుల్తో పొంగులేటి, జూపల్లి భేటీ
అరగంటకు పైగా రాష్ట్ర వ్యవహారాలపై చర్చ
జూలై 2న ఖమ్మంలో భారీ బహిరంగ సభ…పార్టీలో చేరనున్న పొంగులేటి
కెసిఆర్ మాయ పథకాలతో బురిడీ కొట్టిస్తాడని ఆరోపణ
పాలమూరు సభలో పార్టీలో చేరనున్న జూపల్లి
న్యూ దిల్లీ, జూన్ 26 : ‘కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో’ నినాదంతో ముందుకు సాగాలని తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులకు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. సోమవారం దిల్లీలో రేవంత్ రెడ్డి, పలువురు రాష్ట్ర నేతల ఆధ్వర్యంలో రాహుల్ గాంధీతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు భేటీ అయ్యారు. వారివురూ ప్రత్యేకంగా అరగంటకుపైగా రాహుల్తో చర్చించారు. పార్టీలో చేరిక, ఇతర అంశాలపై వారు చర్చించారు. జులై 2న ఖమ్మం రావాలని రాహుల్ని పొంగులేటి ఆహ్వానించారు. దీంతో ఆ రోజు ఖమ్మంలో జరిగే సభలో రాహుల్ సమక్షంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అనంతరం జూలై 14 లేదా 16న పాలమూరులో జరిగే బిహిరంగ సభలో జూపల్లి కృష్ణా రావు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. వీరిద్దరూ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. కాగా తెలంగాణ నేతలతో రాహుల్ భేటీ సందర్భంగా ఫొటో సెషన్ ఏర్పాటు చేశారు. నేతలంతా గ్రూప్ ఫొటో దిగిన అనంతరం రాహుల్తో కలిసి పొంగులేటి మరోసారి ఏఐసీసీ కార్యాలయంలోకి వెళ్లారు. ఈ కార్యక్రమానికి పొంగులేటి, జూపల్లి అనుచరులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకే కాంగ్రెస్లో చేరుతున్నట్లు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు.
ఢిల్లీలో రాహుల్గాంధీ, మల్లిఖార్జున ఖర్గేతో సమావేశం అనంతరం పొంగులేటి వి•డియాతో మాట్లాడారు. పదవులు ఇవ్వలేదని బీఆర్ఎస్ నుంచి బయటకు రాలేదని.. బీఆర్ఎస్ను గద్దె దించేందుకే బయటకు వచ్చి కాంగ్రెస్లో చేరుతున్నట్లు వెల్లడించారు. అయినా తనకు పదవులు ముఖ్యం కాదని.. పదవుల కంటే తనకు ఆత్మాభిమానమే ముఖ్యమని చెప్పుకొచ్చారు. ఓ దశలో ప్రాంతీయ పార్టీ పెట్టాలని ఆలోచించానని.. పార్టీ పెట్టడంపై అభిప్రాయ సేకరణ కూడా చేసినట్లు వివరించారు. కొత్త పార్టీతో ప్రభుత్వ వ్యతిరేక వోటు చీలదని భావించి కాంగ్రెస్లో చేరాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఇక రాష్ట్రంలోని పరిస్థితులపై కూడా సర్వే చేయించానన్నారు. ప్రభుత్వ వ్యతిరేక వోటు అంతా ఒకవైపే కేంద్రీకృతమైందని వెల్లడించారు. ఇక కర్ణాటక ఫలితాల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగి.. బీజేపీ పరిస్థితి దిగజారిందని పేర్కొన్నారు. ఎన్నికలు వచ్చాయంటే కేసీఆర్ కొత్త స్కీములు పెడతారని.. గారడి మాటలు చెప్పడంలో కేసీఆర్ సిద్ధహస్తులు అని చెప్పుకొచ్చారు. మూడోసారి మాయమాటలతో ముఖ్యమంత్రి కావాలని కేసీఆర్ అనుకుంటున్నారని చెప్పారు. కానీ తెలంగాణ బిడ్డలు కోరుకున్నది మాత్రం ఇంకా నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు, యువత ఏం కోరుకుంటున్నారనేది పరిశీలించాం.. తెలంగాణ బిడ్డలు ఆత్మగౌరవం కోల్పోయారని పొంగులేటి వెల్లడించారు. జూలై 2 ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో రాహుల్ సమక్షంలో కాంగ్రెస్లో చేరుతున్నట్లు పొంగులేటి స్పష్టం చేశారు. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేతలను ఆహ్వానించినట్లు తెలిపారు.
భవిష్యత్తు కార్యాచరణపై ఎందరో మేధావులతో చర్చించామని, ప్రాంతీయ పార్టీ పెట్టడం కంటే ఏదో పార్టీలో చేరాలని మేధావులు సూచించారన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర కాంగ్రెస్ గ్రాఫ్ పెంచిందన్నారు. కర్నాటక విజయంతో కాంగ్రెస్ మరింత పుంజుకుందని, తెలంగాణలో బిజెపి పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని, సిఎం కెసిఆర్ను గద్దె దించాలంటే గట్టి పార్టీతో ప్రయాణించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. సిఎం కెసిఆర్ స్కీముల పేరుతో మాయ చేస్తున్నారని, గారడీలు చేయడంలో కెసిఆర్ సిద్ధహస్తుడు అని పేర్కొన్నారు. అన్ని పరిణామాలు బేరీజు వేసుకున్న తరువాత రాహుల్ను కలవాలని నిర్ణయం తీసుకున్నామని పొంగులేటి చెప్పారు. తెలంగాణ ఇచ్చినందుకు ప్రజలు కాంగ్రెస్కు రుణపడి ఉన్నారని, ఎపిలో పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా కూడా తెలంగాణ ఇచ్చారని, మాయమాటలు చెప్పి ఉంటే 2014లోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదన్నారు. మాయమాటలతో కెసిఆర్ రెండోసారి కూడా అధికారంలోకి వచ్చారని, ఆరు నెలల విశ్లేషణ తరువాత కాంగ్రెస్లో చేరాలని నిర్ణయం తీసుకున్నామని, కొంతకాలంగా తాను, జూపల్లి కృష్ణా రావు అనేక చోట్ల ఆత్మీయ భేటీలు నిర్వహించామన్నారు. కొంతకాలంగా తాను తెలంగాణలోని పరిస్థితులపై సర్వేలు చేయించామన్నారు. జులై 2న ఖమ్మంలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరుతామని పొంగులేటి ప్రకటించారు.




