ప్రాజెక్టులన్నీ పెండింగ్లో..
బిఆర్ఎస్ హయాంలో కాలువలలో నీళ్లు పారుతున్నాయి
కాంగ్రెస్ గెలిస్తే కరెంటు, రైతుబంధుకు రామ్ రామ్…దళిత బంధుకు జై భీమ్
కల్వకుర్తిలో గుంపెడుగా ఉన్న బీసీలు జైపాల్ యాదవ్ని గెలిపించుకోవాలి
కల్వకుర్తి ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కెసిఆర్
ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 19 : కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోని పాలమూరు జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఇక్కడి ప్రజలు పేదరికం వలసలతో సతమతమయ్యారని హైదరాబాదులో ఆటోలు నడుపుకుంటూ జీవనం కొనసాగించారని పాలమూరు ప్రాజెక్టులు పెండింగ్లో పడ్డాయని బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆదివారం కల్వకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే, బిఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ అధ్యక్షతన ఎన్నికల ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బిఆర్ఎస్ అధికారంలోకి వొచ్చినాకే పాలమూరు అభివృద్ధి జరిగిందన్నారు. బీదలకు సంక్షేమం, అభివృద్ధి ఫలాలు దక్కాయని, ఐటి, పారిశ్రామిక విధానాలు తీసుకొచ్చామన్నారు. ప్రజల పన్నులతో బిఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందిస్తుందని, రైతుబంధు లాంటి పథకాలు అమలు చేస్తుందని చెప్పే ప్రతిపక్ష నాయకులు ఒకసారి ఆలోచన చేసుకోవాలని హితువు పలికారు.
స్వయానా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీఎల్పీ నాయకుడు బట్టి విక్రమార్క రైతుబంధు వేస్ట్ పథకం అని అంటున్నారని, రైతుబంధు వేస్టా అని ప్రజలతో ముఖ్యమంత్రి కాదని చెప్పించారు. ఇలాంటి పార్టీలకు వోటు వేస్తే నష్టం జరుగుతుందన్నారు. మళ్ళీ గెలిపిస్తే రైతుబంధు లాంటి పథకాలు ఎన్నో వొస్తాయన్నారు..! అంచలంచెలుగా రైతుబంధును ఎకరాకు 16,000 వరకు పెంచుతామని ముఖ్యమంత్రి చెప్పారు. స్వయానా కాంగ్రెస్ పార్టీకి చెందిన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతులకు మూడు గంటల కరెంటు ఇస్తే చాలు అని అంటున్నాడని, అలా అయితే పది హెచ్ పి మోటర్లు బిగించుకోవాలని అంటున్నారని, అది సాధ్యమేనా అని రైతులతో అడిగి సభలో కాదని చెప్పించారు. కల్వకుర్తిలో రెండు కాలువల ద్వారా 90 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కల్వకుర్తి కాలువలలో నీరు పారుతుందని కల్వకుర్తి ప్రాజెక్టుల ద్వారా రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 200 పెన్షన్ తో ప్రజలను ఏడిపించారని, ఉద్యమాలు చేస్తే కాల్చి చంపారని ఆయన అన్నారు.
మీ ప్రాంతంలో రింగురోడ్డు రాబోతుందని, త్వరలోనే ఈ ప్రాంత పరిస్థితులు మారుతాయని అన్నారు. గిరిజనులను, గొర్రెల కాపరులను ఆదుకున్న ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు, తండాలను, గూడాలను గ్రామపంచాయతీలు చేసిన ఘనత తమదే నన్నారు. సీఎల్పీ నేత బట్టి విక్రమార్క ధరణిని తీసివేసి బంగాళాఖాతంలో వేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. మళ్లీ పాత పద్ధతి వొస్తే పట్వారి, వీఆర్ఏ పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆయన చెప్పారు. కౌలు రైతులకు కూడా పంచాయతీ పెడతామంటున్నారని ఆయన అన్నారు. రైతులు నేరుగా కార్యాలయాలకు వెళ్లి తమ పొలాలను మధ్య దలారులను ఆశ్రయించకుండా రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారని, ఆ ఘనత తమదేనన్నారు. ప్రజలు ఇంటికి వెళ్లి ఇతరులతో చర్చించి ఆలోచించి వోటు వేయాలని ప్రజలకు తెలియజేశారు. వోటును మంచివారికి వేస్తే మంచే జరుగుతుందని.. చెడ్డవారికి వేస్తే చెడు జరుగుతుందన్నారు. అన్ని వర్గాలను కలుపుకుపోయి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అందించామన్నారు.
పొరపాటున కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కరెంటు, రైతుబంధు రామ్ రామ్ చెబుతుందని, దళిత బంధుకు జై భీమ్ అని కేసీఆర్ అన్నారు. కల్వకుర్తి ప్రాంత ప్రజల కోసం అభివృద్ధి కోసం ఆలోచించే జైపాల్ యాదవ్ను భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించుకోవాలని కేసీఆర్ చెప్పారు. గుప్పెడు బీసీలు ఉన్న కల్వకుర్తిలో జైపాల్ యాదవ్ ఎలా ఓడిపోతారని ఆయన ప్రశ్నించారు. బీసీలకు టికెట్ రాని కాడ రాలేదని, వొచ్చిన కాడైనా గెలిపించుకోవాలన్నారు. గుంపెడు బీసీలు ఉన్న కల్వకుర్తిలో బీసీ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు వివిధ వర్గాలకు చెందిన వారు ఆలోచన చేసి జైపాల్ యాదవ్ను మళ్లీ గెలిపించి ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. బీసీలంతా ఏకమై జైపాల్ యాదవ్ను గెలిపించుకోవాలన్నారు. భారీ బహిరంగ సభలో హైదరాబాద్ నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్, బి ఆర్ ఎస్ ప్రజా ప్రతినిధులు నాయకు శ్రీనివాస్ యాదవ్, అర్జున్ రావు, దశరథ్ నాయక్, వెంకటేష్ గుప్తా, లక్ష్మీనరసింహ రెడ్డి, భాస్కరరావు, ఇర్షాద్ తదితరులు పాల్గొన్నారు.





